Nara Lokesh: విశాఖను విషాదపట్నంగా మార్చేశారు: నారా లోకేశ్‌

వైకాపా పాలనలో విశాఖను గంజాయి క్యాపిటల్‌గా మార్చారని తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు.

Updated : 18 Feb 2024 13:39 IST

విశాఖ: వైకాపా పాలనలో విశాఖను గంజాయి క్యాపిటల్‌గా మార్చారని తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. నగరంలోని తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రాన్ని వైకాపా ప్రభుత్వం అప్పులమయం చేసింది. విశాఖను విషాదపట్నంగా మార్చేశారు. నగరానికి చంద్రబాబు నెలకొక ఐటీ కంపెనీ తీసుకొచ్చారు. ఇప్పుడు రోజుకో భూకుంభకోణం, హత్యలు, కిడ్నాప్‌లు జరుగుతున్నాయి.

లాలూచీతో విశాఖ ఉక్కును ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు జగన్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు నెలల్లో తెదేపా-జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కును అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం. రైల్వే జోన్‌, నగరానికి మెట్రో ప్రాజెక్టు హామీలను జగన్‌ నెరవేర్చలేదు. చంద్రబాబు సూపర్‌-6 పేరుతో హామీలను ప్రకటించారు. ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఏటా డీఎస్సీ ప్రకటిస్తాం. నిరుద్యోగులకు రూ.3వేల నిరుద్యోగ భృతి, 18-59 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.1500 అందజేస్తాం’’ అని లోకేశ్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని