TDP: ‘బాబాయిని చంపిందెవరు’.. యువగళం పాదయాత్రలో పోస్టర్లతో ప్రదర్శన

నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రొద్దుటూరులో తెదేపా కార్యకర్తలు ‘బాబాయిని ఎవరు చంపారు?’ అని రాసి ఉన్న పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు.

Updated : 01 Jun 2023 19:02 IST

ప్రొద్దుటూరు: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పాదయాత్రలో ఆ పార్టీ శ్రేణులు వివేకా హత్యకు సంబంధించిన పోస్టర్లు, ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ తీశారు. వివేకాని ఎవరు చంపారనే దానిపై వివేకా ఫొటో, జగన్‌ ఫొటో, అవినాష్‌రెడ్డి ఫొటోలను ప్రదర్శిస్తూ ‘బాబాయిని ఎవరు చంపారు?’ అని రాసి ఉన్న పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు.

ఈ నినాదాలతో పాదయాత్ర పొడవునా ర్యాలీగా వెళ్లారు. నారా లోకేశ్‌ కూడా ప్లకార్డులు పట్టుకొని పాదయాత్ర వెంట ప్రజలకు చూపించారు. ప్రొద్దుటూరు టౌన్‌లో ‘హూ కిల్డ్ బాబాయ్’ ప్లకార్డులు ప్రజలకి చూపించి బాబాయ్‌ని చంపింది ఎవరు అంటూ లోకేశ్‌ స్థానిక ప్రజలను అడిగారు. అక్కడున్నవారంతా వివేకాని మర్డర్ చేసింది అవినాష్, జగన్ అంటూ పెద్ద ఎత్తున సమాధానమిచ్చారు. ఓ సందర్భంలో ఆ పోస్టర్లను పోలీసులు లాక్కోవడంతో తెదేపా నేతలు అభ్యంతరం తెలిపారు. పోలీసులతో ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. వందల సంఖ్యలో ప్లకార్డులు పట్టుకొని కార్యకర్తలు పాదయాత్రలో ముందుకు సాగారు. లోకేశ్‌ పాదయాత్ర సాగుతున్న దారి వెంట తెదేపా ప్లెక్సీలకు పోటీగా వైకాపా ఫ్లెక్సీలు, చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేశారని తెలుగుదేశం నేతలు పోలీసులను ప్రశ్నించారు. పాదయాత్ర పొడవున భారీ సంఖ్యలో యువత, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ప్లకార్డులు ప్రదర్శించకూడదంటూ తెదేపా కార్యకర్తలను ప్రొద్దుటూరు డీఎస్పీ నాగరాజు వారించారు. దీనిపై స్పందించిన లోకేశ్‌..  అనుమతులు తీసుకొనే తాము పాదయాత్ర చేస్తున్నామన్నారు. మమ్మల్ని రెచ్చగొట్టేలా వైకాపా వాళ్లు ఫ్లెక్సీలు పెట్టినప్పుడు మీరెక్కడ ఉన్నారని డీఎస్పీని లోకేశ్‌ ప్రశ్నించారు. వైకాపా ఫ్లెక్సీల గురించి లోకేశ్‌ ప్రశ్నించగానే పోలీసులు నీళ్లు నమిలారు. ముందు వెళ్లి వైకాపా ఫ్లెక్సీలు తొలగించండని చెప్పడంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

రూ.2,200 కోట్లను వైకాపా ప్రభుత్వం దొంగిలించింది: లోకేశ్‌

పాదయాత్ర సందర్భంగా ప్రొద్దుటూరు ప్రజలు నారా లోకేశ్‌ను కలిశారు. ఆర్ట్స్ కాలేజీ వద్ద పట్టణ ప్రముఖులు లోకేశ్‌ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయని స్థానికులు గోడు వెల్లబోసుకున్నారు. రామేశ్వరం పుణ్యక్షేత్రంలో దారి పొడవునా మద్యం దుకాణాలు పెట్టడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రేషన్ బండ్ల కోసం పనులు మానుకొని క్యూలో నిలబడాల్సి వస్తోందని వాపోయారు. పాత రేషన్ విధానాన్నే ప్రవేశపెట్టాలనీ కోరారు. 

నారా లోకేశ్‌ స్పందిస్తూ... రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. స్థానిక సంస్థల నిధులను పక్కదారి పట్టించడంతో మున్సిపాలిటీల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా నిధుల్లేని పరిస్థితులు నెలకొన్నాయని ధ్వజమెత్తారు. తెదేపా అధికారంలోకి రాగానే పట్టణాల్లో అన్నిరకాల మౌలిక సదుపాయాలను కల్పించి, చెత్తపన్నులాంటి అడ్డగోలు పన్నుల విధానాన్ని సమీక్షిస్తామని తెలిపారు. అభయహస్తం పథకంలోని డ్వాక్రా మహిళల సొమ్ము రూ.2,200 కోట్లను వైకాపా ప్రభుత్వం దొంగిలించిందని ఆరోపించారు. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తామన్నారు. డీలర్ల ద్వారా రేషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని లోకేశ్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని