Narendra Modi: బహుముఖ రవాణా వ్యవస్థ దిశగా విశాఖ: ప్రధాని మోదీ

ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రా ప్రజలు తమ ప్రతిభను చాటుతున్నారని.. వైద్యం, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో ఏపీ ప్రజలు రాణిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. విశాఖ పర్యటనలో భాగంగా దాదాపు రూ.15వేల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులను వర్చువల్‌ విధానంలో మోదీ ప్రారంభించారు.

Updated : 12 Nov 2022 15:27 IST

విశాఖ: ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రా ప్రజలు తమ ప్రతిభను చాటుతున్నారని.. వైద్యం, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో ఏపీ ప్రజలు రాణిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. విశాఖ పర్యటనలో భాగంగా ఏయూ ప్రాంగణలోని ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు రూ.15వేల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులను వర్చువల్‌ విధానంలో మోదీ ప్రారంభించారు.

అనంతరం ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘ఏపీలోని విశాఖకు ఇవాళ మరుపురాని రోజు. భారత్‌కు విశాఖ ప్రత్యేకమైన నగరం. ప్రాచీన భారతంలో విశాఖ ప్రముఖ ఓడరేపు. వ్యాపార కేంద్రంగా విశాఖ విరాజిల్లింది. ప్రాచీన కాలం నుంచి విశాఖ పోర్టుకు ఘన చరిత్ర ఉంది. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ వ్యాపార కేంద్రంగా విశాఖ విరాజిల్లుతోంది. వెయ్యేళ్ల క్రితమే పశ్చిమాసియా, రోమ్‌కు విశాఖ నుంచి వ్యాపారం జరిగేది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నన్ను కలిసినప్పుడల్లా ఏపీ అభివృద్ధి గురించే అడిగేవారు.

మిషన్‌ గతిశక్తి కింద ప్రాజెక్టుల్లో వేగం పెంచాం..

వికసించిన భారత్‌ అనే అభివృద్ధి మంత్రంతో భారత్‌ ముందుకెళ్తోంది. సమ్మిళిత అభివృద్ధే మా ఆలోచన. మౌలిక సదుపాయాలతో ఆధునిక భారత్‌ ఆవిష్కరిస్తున్నాం. రైల్వే, రోడ్లు, పోర్టుల అభివృద్ధి విషయంలో ముందుంటున్నాం. విశాఖ రైల్వే స్టేషన్‌తో పాటు పోర్టును ఆధునికీకరిస్తున్నాం. బహుముఖ రవాణా వ్యవస్థ దిశగా విశాఖ ముందడుగు వేస్తోంది. మిషన్‌ గతిశక్తి కింద ప్రాజెక్టుల్లో వేగం పెంచాం. ప్రపంచ దేశాలు భారత్‌ వైపు చూస్తున్నాయి. సామాన్య మానవుడి జీవితం మెరుగుపరచడమే మా ప్రధాన లక్ష్యం. ఇవాళ ప్రతి దేశం ఏదో ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంక్షోభంలో ఉన్న ప్రతి దేశం నేడు భారత్‌ వైపు చూస్తోంది. ఎప్పుడైతే పేదవాళ్ల శక్తి పెరుగుతందో, ఆధునిక సాంకేతికత వారికి అందుబాటులోకి వస్తుందో అప్పడే వికసించిన భారత్‌ కల సాకారమవుతుంది. సముద్ర తీరాలు మన సమృద్ధికి ముఖ్య ద్వారాలుగా మారాయి. భారత్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య భూమిక పోషిస్తుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు’’ అని మోదీ అన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలివే..

రూ.2,658 కోట్లతో శ్రీకాకుళం-అంగుల్‌ నేచురల్‌ గ్యాస్‌ పైపులైన్‌ (745కి.మీ.), రూ. 3,778 కోట్లతో రాయపూర్‌-విశాఖ ఎకనామిక్‌ కారిడార్‌లో 6 లేన్ల గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి, విశాఖ ఎన్‌హెచ్‌-516సిపై కాన్వెంట్‌ జంక్షన్‌-షీలానగర్‌ జంక్షన్‌ వరకు 6 లేన్లు, రూ. 566 కోట్లతో విశాఖ పోర్టు కనెక్టివిటీ కోసం అదనంగా 4 లేన్ల డెడికేటెడ్‌ పోర్టు రోడ్డు, రూ.152 కోట్లతో విశాఖ ఫిషింగ్‌ హర్బర్‌ ఆధునికీకరణ, రూ.460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఓఎన్‌జీసీ-యుఫీల్డ్‌ ఆన్‌షోన్‌ సదుపాయాలు జాతికి అంకితం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని