Opposition Meeting: లోక్‌సభ ఎన్నికల్లో కలిసే పోటీ.. ‘ఇండియా’ కూటమి తీర్మానం

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వీలైనంత వరకు కలిసే పోటీచేయాలని ‘ఇండియా’కూటమిలోని పార్టీలు తీర్మానించాయి. అలాగే, సీట్ల సర్దుబాటుతో పాటు అనేక కీలక నిర్ణయాలు తీసుకొనేందుకు వీలుగా 13మందితో కమిటీ ఏర్పాటు చేసింది.

Updated : 01 Sep 2023 19:57 IST

ముంబయి:  సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ఎన్డీయేను ఢీకొట్టేందుకు ఏర్పాటైన ‘ఇండియా’(I.N.D.I.A) కూటమి మూడో సమావేశం ముంబయిలో రెండో రోజు భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 28 పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరైన ఈ కీలక భేటీలో వచ్చే ఎన్నికల నాటికి ఉమ్మడి పోరుకు చేయాల్సిన సన్నద్ధతపై సమాలోచనలు జరిపారు. లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాల మధ్య వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలని కూటమిలోని పార్టీలు తీర్మానం చేశాయి. ఇందులో భాగంగా 14 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. కూటమికి సంబంధించి అత్యున్నత నిర్ణయాలు తీసుకొనే కమిటీగా ఇది వ్యవహరించనుంది.

విపక్ష భేటీకి ఆకస్మిక అతిథి.. పర్వాలేదన్న రాహుల్‌

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు కలిసి పోటీ చేయాలని ‘ఇండియా’ కూటమిలోని పార్టీలు తీర్మానించాయి. వివిధ రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు ప్రక్రియ తక్షణమే ప్రారంభించనున్నట్టు ఈ మేరకు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. సహకార స్ఫూర్తితో త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశంలోని ప్రజా సమస్యలపై వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అలాగే, వివిధ భాషల్లో  "భారత్ ఏకమవుతోంది.. ఇండియా గెలుస్తుంది" అనే థీమ్‌తో ప్రచార వ్యూహాలను సమన్వయం చేసుకొని పనిచేయనున్నట్టు పేర్కొంది. సెప్టెంబర్‌ 30 నాటికి సీట్ల సర్దుబాటు అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు పనిచేయనున్నట్టు సమాచారం.

సమన్వయ కమిటీ సభ్యులు వీళ్లే..

‘ఇండియా’ కూటమి సమన్వయ కమిటీలో కేసీ వేణుగోపాల్‌(కాంగ్రెస్‌), శరద్‌ పవార్‌(ఎన్సీపీ), టీఆర్‌ బాలు (డీఎంకే), తేజస్వీ యాదవ్‌(ఆర్జేడీ), అభిషేక్‌ బెనర్జీ (తృణమూల్‌ కాంగ్రెస్‌), సంజయ్‌ రౌత్‌ (శివసేన-యూబీటీ), హేమంత్‌ సోరెన్‌(జేఎంఎం), రాఘవ్‌ చద్దా (ఆప్‌), జావేద్‌ అలీఖాన్‌( సమాజ్‌వాదీ పార్టీ), లలన్‌ సింగ్‌(జేడీయూ), డి.రాజా(సీపీఐ), ఒమర్‌ అబ్దుల్లా(నేషనల్‌ కాన్ఫరెన్స్‌), మెహబూబా ముఫ్తీ(పీడీపీ), సీపీఎం నుంచి ఒకరు (నేత పేరు ఇంకా తెలియలేదు) ఉన్నారు. ఈ అత్యున్నత నిర్ణాయక కమిటీ తక్షణమే సీట్ల పంపకాలపై కసరత్తు జరిపి సెప్టెంబర్‌ 30నాటికి తుది రూపు ఇచ్చే దిశగా పనిచేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని