KL Rahul - Rohit Sharma: వైఫల్యాల సుడిలో టీమ్‌ ఇండియా ఓపెనర్లు!

భారత జట్టు ఓపెనర్లు ఇంకా గాడినపడలేదు. మరో కీలకమైన మ్యాచ్‌లో చేతులెత్తేశారు. ఇంగ్లాండ్‌పై కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌లు స్వల్పస్కోర్లకే పెవిలియన్‌ చేరుకొన్నారు. 

Updated : 10 Nov 2022 15:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ 20 ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌కు చేరుకొన్నా.. భారత ఓపెనర్లు కుదురుకోలేదు. నేడు సెమీఫైనల్స్‌లో ఓపెనింగ్‌ జోడీ కేవలం 9 పరుగులు మాత్రమే సాధించింది. క్రిస్‌ వోక్స్‌ వేసిన రెండో ఓవర్‌ నాలుగో బంతికి రాహుల్‌ (5) పేలవమైన షాట్‌కు యత్నించి వికెట్‌ సమర్పించుకొన్నాడు. ఈ మ్యచ్‌లో కొంచె ఓర్పుగా ఆడుతున్నట్లు కనిపించిన రోహిత్‌.. జట్టు స్కోర్‌ అర్ధశతకం దాటగానే.. జోర్డాన్‌ వేసిన 8వ ఓవర్‌ ఐదో బంతికి ఓ భారీషాట్‌కు యత్నించి కరన్‌కు దొరికిపోయాడు. ఈ జోడీ టోర్నీ లో ఇప్పటి వరకు భారత్‌కు శుభారంభాన్ని ఇవ్వలేదు. ఆడిన ఆరు మ్యాచుల్లో ఓపెనింగ్‌ భాగస్వామ్యాలు వరుసగా 7, 11, 23, 11, 27, 9గా ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో పవర్‌ప్లేలో భారత్‌ కేవలం 38 పరుగులు మాత్రమే చేసింది. కోహ్లీ, పాండ్యా ఆదుకోవడంతో గౌరవప్రదమైన స్కోర్‌ను సాధించింది. 

ఈ సిరీస్‌లో రోహిత్‌ నెదర్లాండ్స్‌పై మినహా మరే మ్యాచ్‌లోనూ చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. ఆరు మ్యాచ్‌లు కలిపి అతడు చేసిన పరుగులు 116. పాక్‌పై 4, నెదర్లాండ్స్‌పై 53, దక్షిణాఫ్రికాపై 15, బంగ్లాదేశ్‌పై 2, జింబాబ్వేపై 15, తాజాగా ఇంగ్లాండ్‌పై 27 పరుగులు సాధించాడు. ఇక చిన్నజట్లైన బంగ్లాదేశ్‌, జింబాబ్వేపై అర్థశతకాలతో రాణించిన కేఎల్‌ రాహుల్‌ ఆట గాడిన పడినట్లే కనిపించింది. కానీ, ఈ మ్యాచ్‌లో అతడు మరోసారి స్వల్పస్కోర్‌కే పెవిలియన్‌ చేరుకొన్నాడు. ఐసీసీ టోర్నీల నాకౌట్‌ మ్యాచ్‌ల్లో రాణించడనే అపవాదు ఇప్పటికే కేఎల్‌ రాహుల్‌ను వెంటాడుతోంది. తాజా ఇన్నింగ్స్‌లో అదే మరోసారి పునరావృతమైంది. రాహుల్‌ కెరీర్‌లో ఇది రెండో టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌. 2019లో న్యూజిలాండ్‌పై జరిగిన ప్రపంచకప్‌ సెమీఫైనల్లో కూడా కేవలం 1 పరుగు మాత్రమే చేసి వికెట్‌ సమర్పించుకొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని