HCA: ‘హెచ్‌సీఏలో అవినీతి రాజ్యమేలుతోంది.. త్వరలో అజహర్‌కు బుద్ధిచెబుతాం’

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో ప్రస్తుతం అవినీతి రాజ్యమేలుతోందని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్‌ యాదవ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు...

Updated : 18 Jul 2022 15:33 IST

అధ్యక్షుడిపై హైదరాబాద్‌ మాజీ ఆఫీస్‌ బేరర్ల మండిపాటు

(Photo: Mohammed Azharuddin Twitter)

హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో ప్రస్తుతం అవినీతి రాజ్యమేలుతోందని మాజీ క్రికెటర్‌ శివలాల్‌ యాదవ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధ్యక్షుడు అజహరుద్దీన్‌తో పాటు ఇతర సభ్యుల పనితీరు అవినీతిమయమైందని ఆరోపించారు. శివలాల్‌తో పాటు హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్‌ ఆయుబ్‌, మాజీ కార్యదర్శి శేష్‌ నారాయణ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత హెచ్‌సీఏ కార్యవర్గంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు హెచ్‌సీఏలో సమస్యలు పేరుకుపోయాయని, చర్చించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయన్నారు. అజహర్ వ్యవహారశైలితో యువ ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధ్యక్షుడి అనాలోచితమైన నిర్ణయాల వల్ల క్రికెటర్లపై పెను ప్రభావం పడుతోందని వారు విమర్శలు చేశారు.

అజహర్‌ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు..

‘హెచ్‌సీఏలో ప్రస్తుత అధ్యక్షుడు తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు. బెదిరింపులకు పాల్పడుతున్నారు. అపెక్స్ కౌన్సిల్ నియమాలను ఉల్లంఘిస్తూ.. అన్ని విభాగాల నిబంధనలను కూడా పాటించడంలో మార్గనిర్దేశం చేయడం లేదు. సీనియర్ సెలక్షన్ కమిటీ, క్రికెట్ సలహా కమిటీలను అజహరుద్దీన్ రద్దు చేసి.. తన సొంత సెలక్షన్‌ కమిటీని నియమించారు. నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తున్నారు. అలాగే నాలుగు లీగ్ జట్లను నిలిపివేశారు. ఆయన మాట వినని క్లబ్‌లను రద్దు చేస్తున్నారు. ఆయా క్లబ్‌ల నిర్వహణ వెనుక చాలా చరిత్ర ఉంది. అలాంటి వాటిని నిలిపివేసి.. ఆయనపై ఆధారపడిన, ఆయనకే చెందిన క్లబ్బులను మాత్రమే క్రికెట్ ఆడిస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి లీగ్‌లు, మ్యాచ్‌లు నిర్వహించడం లేదు. మరోవైపు హైదరాబాద్‌లో భారత టీ20 లీగ్‌తో పాటు, రంజీ, ముస్తాక్ అలీ, అంతర్జాతీయ మ్యాచ్‌లు కానీ ఏవీ జరగడం లేదు. క్రికెట్‌ను మరిచిపోయే విధంగా అజహర్ ప్రస్తుత హెచ్‌సీఏను తయారు చేశారు. ఆయన వచ్చాకే ఇక్కడ పోలీస్ కేసులు నమోదయ్యాయి. సెలక్షన్ కమిటీ అంటే డబ్బులకు మాత్రమే ఉంది. నైపుణ్యమున్న ఆటగాళ్లకు ప్రాధాన్యత లేదు. త్వరలోనే అజహర్ నేతృత్వంలోని హెచ్‌సీఏ కార్యవర్గ సమయం ముగియనుంది. సెప్టెంబర్‌లో హెచ్‌సీఏ ఎన్నికలు నిర్వహించమని బిసీసీఐ సుప్రీంకోర్టును అశ్రయించనుంది. భవిష్యత్‌లో హైదరాబాద్ క్రికెట్‌కు మంచి రోజులు రావాలని ఆశిస్తున్నాం’ అని హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయుబ్ పేర్కొన్నారు.

త్వరలోనే అతనికి బుద్ది చెబుతాం..

‘అజహర్ సుప్రీంకోర్టు గైడ్‌లైన్‌ను ఉల్లంఘిస్తున్నారు. దాని ప్రకారం చెక్‌లపై సంతకాలు చేయలేదు. నిధులు ఇంకా విడుదల కాలేదు. ఆఫీస్ బేరర్స్ మాట వినడం లేదు. రూ.16 కోట్లు వచ్చినా హెచ్‌సీఏ దుర్వినియోగం చేస్తోంది. మూడు సంవత్సరాల అకౌంట్స్ ఇంకా లెక్క చూపలేదు.వచ్చే హెచ్‌సీఏ ఎన్నికల్లో అజహర్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన రోజు నుంచి అన్నీ వివాదాలే నెలకొన్నాయి. హైదరాబాద్‌లో అజహర్‌ ఎన్ని రోజులు ఉన్నారు? ఎన్నిసార్లు సెక్రెటరీల సమావేశం పెట్టారు? బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒక జట్టు ఎంపికలో 20 మందికి మించరాదు. కానీ, ఆయన 35 మందిని ఎంపిక చేశారు. ఆయన హైదరాబాద్‌లో కన్నా దుబాయ్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. మాజీ ఆఫీస్ బేరర్లు అందరం కలిసి అజహర్‌కు వచ్చే హెచ్‌సీఏ ఎన్నికల్లో బుద్ధి చెబుతాం’ అని హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని