అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టులో త్రిష, షబ్నమ్‌

ఐసీసీ తొలి అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో బరిలో దిగే భారత జట్టులో తెలుగమ్మాయిలు జి.త్రిష, షబ్నమ్‌లకు చోటు దక్కింది.

Published : 06 Dec 2022 02:47 IST

దిల్లీ: ఐసీసీ తొలి అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో బరిలో దిగే భారత జట్టులో తెలుగమ్మాయిలు జి.త్రిష, షబ్నమ్‌లకు చోటు దక్కింది. తెలంగాణకు చెందిన 16 ఏళ్ల త్రిష ఈ ఏడాది అండర్‌-19 ఛాలెంజర్‌ టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. 12 ఏళ్లకే అండర్‌-19 క్రికెట్‌ ఆడిన త్రిష.. ఆల్‌రౌండ్‌ ప్రతిభతో అదరగొడుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పేసర్‌ షబ్నమ్‌ ఇటీవల దేశవాళీ క్రికెట్లో సత్తా చాటింది. అండర్‌-19 ప్రపంచకప్‌లో పోటీపడే భారత జట్టుకు ఓపెనర్‌ షెఫాలీవర్మ సారథ్యం వహించనుంది. దక్షిణఫ్రికాతో అండర్‌-19 ద్వైపాక్షిక సిరీస్‌కూ 18 ఏళ్ల షెఫాలీ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. శ్వేత షెరావత్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైంది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి 29 వరకు దక్షిణాఫ్రికాలో మహిళల టీ20 ప్రపంచకప్‌ జరుగనుంది. ఈనెల 17న దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభమవుతుంది. 2019లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన షెఫాలీ.. 2 టెస్టులు, 21 వన్డేలు, 46 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. 16 జట్లు బరిలో దిగుతున్న ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా, యూఏఈ, స్కాట్లాండ్‌లతో కలిసి భారత జట్టు గ్రూపు-డిలో ఉంది. ప్రతి గ్రూపు నుంచి మొదటి మూడు జట్లు సూపర్‌ 6 దశకు అర్హత సాధిస్తాయి. సూపర్‌ 6లో రెండు గ్రూపుల్లో ఆరేసి జట్లు బరిలో ఉంటాయి. రెండు గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. జనవరి 29న ఫైనల్‌ జరుగుతుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు జట్టు: షెఫాలీ (కెప్టెన్‌), శ్వేత (వైస్‌ కెప్టెన్‌), రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), త్రిష, సౌమ్య తివారి, సోనియా, హర్లే, హృషిత (వికెట్‌ కీపర్‌), సోనమ్‌ యాదవ్‌, మన్నత్‌, అర్చన దేవి, పార్శవి, టైటాస్‌ సాధు, ఫలక్‌ నాజ్‌, షబ్నమ్‌, శిఖ, నజ్లా, యషశ్రీ. అండర్‌-19 ప్రపంచకప్‌కు జట్టు: షెఫాలీ (కెప్టెన్‌), శ్వేత (వైస్‌ కెప్టెన్‌), రిచా (వికెట్‌ కీపర్‌), త్రిష, సౌమ్య, సోనియా, హర్లే, హృషిత (వికెట్‌ కీపర్‌), సోనమ్‌, మన్నత్‌, అర్చన, పార్శవి, టైటాస్‌, ఫలక్‌, షబ్నమ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని