FIFA Cup: ‘బంగారు ఐఫోన్లు’.. టీం సభ్యులకు మెస్సి గిఫ్ట్!

ఖతార్‌ ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ విజయానికి గుర్తుగా అర్జెంటీనా కెప్టెన్‌ మెస్సి(Messi) తన తోటి క్రీడాకారులు, సిబ్బందికి బంగారు ఐఫోన్‌లను గిఫ్ట్‌గా ఇచ్చాడు. గతేడాది జరిగిన ఈ పోటీలో ఫ్రాన్స్‌పై గెలుపొంది అర్జెంటీనా విశ్వ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

Published : 03 Mar 2023 01:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు మెస్సి(Messi) ‘ఫిఫా వరల్డ్‌ కప్‌’ గెలుపు సంబరం ఇంకా తీరలేదు! గతేడాది సాధించిన ఈ అపురూప విజయానికి గుర్తుగా తన అర్జెంటీనా(Argentina) జట్టు సభ్యులు, సిబ్బందికి మరపురాని లగ్జరీ గిఫ్ట్‌లు ఇచ్చాడు. అవే.. బంగారు ఐఫోన్‌(Gold iPhones)లు. రూ.1.72 కోట్లతో ప్రత్యేకంగా తయారు చేయించిన 35 ‘ఐఫోన్‌లను తోటి క్రీడాకారులకు, స్టాఫ్‌కు కానుకగా  అందజేశాడు. గతేడాది డిసెంబరులో ఖతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌ కప్‌(FIFA World Cup) ఫైనల్లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జట్టుకు మెస్సియే కెప్టెన్‌గా వ్యవహరించాడు.

తన తోటి ఆటగాళ్లు, సిబ్బంది ఈ అద్భుత విజయాన్ని ఎప్పటికీ సెలబ్రేట్‌ చేసుకునేలా వ్యక్తిగత బహుమతులు ఇవ్వాలని మెస్సి భావించాడు. ఈ క్రమంలోనే 24 క్యారెట్ బంగారు స్మార్ట్‌ఫోన్‌లను ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయమై ఐడిజైన్‌ గోల్డ్‌ సంస్థను సంప్రదించాడు. ప్రతి ఫోన్‌ వెనుక భాగంలో సంబంధిత క్రీడాకారుడు, సిబ్బంది పేరు, షర్ట్‌ నంబర్‌, అర్జెంటీనా టీం లోగో, ‘వరల్డ్ కప్ ఛాంపియన్స్ 2022’ అని వచ్చేలా ప్రత్యేకంగా డిజైన్‌ చేయించాడు. ఇటీవలే ఈ ఫోన్‌లను డెలివరీ చేసినట్లు సదరు సంస్థ ధ్రువీకరించింది. సంబంధిత ఫోన్‌ ఫొటోలను పోస్ట్‌ చేసింది. ఇవి కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉండగా.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఫిఫా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో గెలిచింది. ఈ టోర్నీ విజయంతో అర్జెంటీనా స్టార్‌ ఆటగాడు మెస్సి కల నెరవేరింది. తన సారథ్యంలో అర్జెంటీనాకు కప్పు రావడం ఇదే తొలిసారి. గతంలో 1978, 1986లో అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. తాజా గెలుపుతో దశాబ్దాల నిరీక్షణకు తెరపడినట్లయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని