Rishabh Pant: రిషభ్‌ పంత్‌ స్టంపింగ్‌ను చూసి ధోనీ గర్వపడతాడు: దినేశ్‌ కార్తిక్‌

బంగ్లాదేశ్‌పై తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించి ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించడంలో కీలక పాత్ర పోషించారు.

Updated : 18 Dec 2022 15:33 IST

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌పై తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ అద్భుత విజయం సాధించింది. యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ తొలి ఇన్నింగ్స్‌లో దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు. అలాగే కీపింగ్‌లోనూ చురుగ్గా వ్యవహరించాడు. బంగ్లా బ్యాటర్ నురుల్‌ హసన్‌ను చేసిన స్టంప్‌ ఔట్‌ అయితే అద్భుతం. ఈ క్రమంలో పంత్‌ను సీనియర్ వికెట్ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ ప్రశంసలు కురిపించాడు. 

‘‘బంగ్లాదేశ్‌తో టెస్టులో పంత్‌ అద్భుతమైన కీపింగ్‌ నైపుణ్యాలు ప్రదర్శించాడు. ఎంఎస్ ధోనీని పంత్‌ ఆరాధిస్తాడని భావిస్తున్నా. బంగ్లాపై అతడు చేసిన స్టంపింగ్‌ను చూసి ధోనీ గర్వంగా ఫీలై ఉంటాడు. పిచ్‌ మీద బంతి చాలా వేగంగా కీపర్ వైపు వచ్చింది. అయినా, పంత్ అద్భుతంగా ఒడిసిపట్టి స్టంప్‌ చేశాడు. ధోనీ కూడా ఇలా అద్భుతంగా స్టంపౌట్‌లు చేసేవాడు. బ్యాటర్‌ను ముందే అంచనా వేసి వికెట్లను గిరాటేసేందుకు ఎంఎస్‌డీ సిద్ధంగా ఉంటాడు’’ అని కార్తిక్ తెలిపాడు. 

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ అద్భుత విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 404 పరుగులకు ఆలౌట్‌ కాగా.. బంగ్లా 150 రన్స్‌కే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 258/2 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ చేసింది. దీంతో 513 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ 324 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 188 పరుగుల తేడాతో బంగ్లాపై విజయం సాధించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని