IPL 2021 Replacements: ఐపీఎల్‌లో మారిన ఆటగాళ్లు ఎవరంటే?

మునుపెన్నడూ లేని విధంగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఈ ఏడాది రెండు భాగాలుగా జరుగుతోంది. ఏప్రిల్‌ 9న తొలుత ప్రారంభమైన ఈ మెగా టీ20లీగ్‌.. బయోబుడగలోని పలువురు ఆటగాళ్లు వైరస్‌ బారిన పడటంతో మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోయింది...

Updated : 24 Dec 2022 15:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మునుపెన్నడూ లేని విధంగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఈ ఏడాది రెండు భాగాలుగా జరుగుతోంది. ఏప్రిల్‌ 9న తొలుత ప్రారంభమైన ఈ మెగా టీ20లీగ్‌.. బయోబుడగలోని పలువురు ఆటగాళ్లు వైరస్‌ బారిన పడటంతో మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోయింది. దాన్ని ఎలాగైనా పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్న బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి సెప్టెంబర్‌ 19 నుంచి తిరిగి నిర్వహిస్తున్నాయి. అయితే, మిగిలిన సీజన్‌కు చాలా మంది విదేశీ ఆటగాళ్లు దూరమయ్యారు. వారి స్థానాల్లో ఆయా ఫ్రాంఛైజీలు ఎవరెవరిని తీసుకున్నాయో తెలుసుకుందాం..

ఆర్సీబీలో ఐదుగురు..

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడుతోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న కోహ్లీసేన మిగతా సీజన్‌లోనూ ఇలాగే ఆడాలని చూస్తోంది. అయితే, ఈ జట్టులో అత్యధికంగా ఐదుగురు ఆటగాళ్లు తప్పుకున్నారు. వాషింగ్టన్‌ సుందర్‌ మినహా మిగతా వాళ్లంతా విదేశీ క్రికెటర్లే. వారి స్థానాల్లో ఎవరెవరు కొత్తగా చేరారంటే..

వెళ్లిపోయిన వారు: ఆడం జంపా, డేనియల్‌ సామ్స్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, ఫిన్‌ అలెన్‌, వాషింగ్టన్‌ సుందర్‌

కొత్తగా వచ్చిన వారు‌: వానిండు హసరంగ, దుష్మంత చమీర, జార్జ్‌ గార్టన్‌, టిమ్‌ డేవిడ్‌, ఆకాశ్‌ దీప్‌

రాజస్థాన్‌లో నలుగురు..

పేలవ ఆటతీరుతో గతేడాది చివరి స్థానంలో నిలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఈసారి మిశ్రమ ఫలితాలతో పోరాడుతోంది. ఈ క్రమంలోనే ఈ సీజన్‌లో ఆడిన 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి ఐదో స్థానంలో నిలిచింది. అయితే, ఈ జట్టులోని విదేశీ ఆటగాళ్లలో ఇంగ్లాండ్‌ ప్లేయర్లే కీలకం. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఆల్‌రౌండర్ల విభాగాల్లో ఎవరికి వారే ప్రత్యేకం. అలాంటి ముగ్గురు ఆటగాళ్ల సేవలను రాజస్థాన్‌ కోల్పోనుంది. మరోవైపు ఒక ఆస్ట్రేలియా క్రికెటర్‌ కూడా దూరంకానున్నాడు. దీంతో రాజస్థాన్‌లో జరిగే మార్పులు ఎవరెవరంటే..

వెళ్లిపోయిన వారు: జోఫ్రా ఆర్చర్‌, ఆండ్రూ టై, జోస్‌ బట్లర్‌, బెన్‌స్టోక్స్‌

కొత్తగా వచ్చిన వారు‌: గ్లెన్‌ ఫిలిప్స్‌, తబ్రైజ్‌ షంసి, ఎవిన్‌ లూయిస్‌, ఒషానె థామస్‌

పంజాబ్‌లో ముగ్గురు..

ఇక ఈ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ జట్టు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టులో ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లు, ఒక ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ మిగతా సీజన్‌కు దూరమయ్యారు. దాంతో పంజాబ్‌ టీమ్‌ ఇతర ఆటగాళ్లను కూడా సమకూర్చుకుంది. మరి ఈ జట్టులో ఎవరెవరు ఆడటం లేదు ఎవరెవరు కొత్తగా వచ్చారంటే..

వెళ్లిపోయిన వారు: రిలే మెరిడిత్‌, జై రిచర్డ్‌సన్‌, డేవిడ్‌ మలన్‌

కొత్తగా వచ్చిన వారు‌: నాథన్‌ ఎలిస్‌, అదిల్‌ రషీద్‌, ఎయిడెన్‌ మార్‌క్రమ్‌

మూడింటిలో ఒక్కొక్కరే..

మరోవైపు దిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు మిగతా మ్యాచ్‌లకు ఒక్కో ఆటగాడిని కోల్పోయాయి. అయితే, ఈ మూడు జట్లూ వారికి తగ్గ ఆటగాళ్లను తీసుకొని బరిలోకి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే దిల్లీ ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కోల్‌కతా 7 మ్యాచ్‌ల్లో 2, హైదరాబాద్‌ 7 మ్యాచ్‌ల్లో 1 విజయాలతో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. కాగా, ఈ రెండు జట్లు మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా రాణిస్తాయో లేదో చూడాలి. ఏయే జట్టులో ఎవరెవరు మారారంటే..

దిల్లీ..

వెళ్లిపోయిన వారు: క్రిస్‌వోక్స్‌

కొత్తగా వచ్చిన వారు‌: బెన్‌ డ్వార్షూస్‌

కోల్‌కతా..

వెళ్లిపోయిన వారు: పాట్‌ కమిన్స్‌

కొత్తగా వచ్చిన వారు‌: టిమ్‌సౌథీ

హైదరాబాద్‌..

వెళ్లిపోయిన వారు‌: జానీ బెయిర్‌స్టో

కొత్తగా వచ్చిన వారు‌: షర్ఫేన్‌ రూథర్‌ఫోర్డ్‌

చివరగా ఐపీఎల్‌లో మిగిలిన రెండు జట్లు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ప్రస్తుతం 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో నాలుగో స్థానంలో ఉండగా చెన్నై 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. కాగా, ఈ రెండు జట్లలో ఎలాంటి మార్పులు లేకపోవడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని