covid: కొవిడ్‌ రెండో ఉద్ధృతికి జులైలో తెర!

కొవిడ్‌ మహమ్మారి రెండో ఉద్ధృతి (సెకెండ్‌ వేవ్‌)పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం కొంత ఊరటనిచ్చే కబురు చెప్పింది.

Updated : 20 May 2021 07:16 IST

6 నెలల తర్వాతే మూడో వేవ్‌
అప్పుడు ప్రభావం కొంత తక్కువే..
‘సూత్ర’ప్రాయంగా శాస్త్రవేత్తల బృందం అంచనా

దిల్లీ: కొవిడ్‌ మహమ్మారి రెండో ఉద్ధృతి (సెకెండ్‌ వేవ్‌)పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం కొంత ఊరటనిచ్చే కబురు చెప్పింది. జులైతో దీనికి తెర పడే అవకాశాలున్నట్లు వెల్లడించింది. అలాగే 6-8 నెలల తర్వాతే వైరస్‌ మూడో ఉద్ధృతి (థర్డ్‌ వేవ్‌) ఉండొచ్చని.. అయితే రెండో వేవ్‌ మాదిరి తీవ్ర ప్రభావం ఉండకపోవచ్చని అంచనా వేసింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ పరిధిలోని సైన్స్‌, టెక్నాలజీ విభాగం ఈ బృందాన్ని ఏర్పాటు చేసింది. ‘సూత్ర’ (ససెప్టబుల్‌, అన్‌డిటెక్టెడ్‌, టెస్టెడ్‌ (పాజిటివ్‌) అండ్‌ రిమూవ్డ్‌ అప్రోచ్‌) అనే మోడల్‌ ద్వారా శాస్త్రవేత్తల బృందం పలు అంచనాలకు వచ్చింది. ఈమేరకు బృందంలో ఒకరైన ఐఐటీ కాన్పుర్‌ ప్రొఫెసర్‌ మనీంద్ర అగర్వాల్‌ వివరాలను వెల్లడించారు. దేశంలో మే నెలాఖరుకల్లా రోజువారీ కేసుల సంఖ్య 1.5 లక్షలకు చేరుతుందని, జూన్‌ ఆఖరు నాటికి ఇది 20,000కు తగ్గుతుందని బృందం అంచనా వేసింది. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌, కేరళ, సిక్కిం, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, హరియాణా, దిల్లీ, గోవాల్లో ఇప్పటికే మహమ్మారి అత్యంత తీవ్రదశ (పీక్‌)కు చేరినట్లు అగర్వాల్‌ తెలిపారు. తమిళనాడు, పంజాబ్‌, పుదుచ్ఛేరి, అస్సాం, మేఘాలయ, త్రిపుర, హిమాచల్‌ప్రదేశ్‌లు ఈనెల 19 నుంచి 31 మధ్య అత్యంత తీవ్రదశకు చేరుతాయని అంచనా వేశారు.
మూడో ఉద్ధృతి ఎప్పుడంటే..!
‘సూత్ర’ ప్రకారం దేశంలో అక్టోబరు వరకు కరోనా మూడో ఉద్ధృతి ఉండకపోవచ్చని అగర్వాల్‌ తెలిపారు. ‘‘మూడో ఉద్ధృతి స్థానికంగానే ఉంటుంది. వ్యాక్సినేషన్‌ కారణంగా ఎక్కువమంది దీనికి ప్రభావితం కాకపోవచ్చు..’’ అని పేర్కొన్నారు.
ఏమిటీ సూత్ర మోడల్‌?
మహమ్మారుల తీవ్రత, విధాన నిర్ణయాల ప్రభావం వంటి వాటిని అంచనా వేసేందుకు గణితశాస్త్ర విధానాల్లో ఒకటి సూత్ర. కొవిడ్‌పై అధ్యయనానికి గతేడాది ఈ మోడల్‌ను అనుసరించడం ప్రారంభించారు. ఈ ‘జాతీయ కొవిడ్‌-19 సూపర్‌మోడల్‌ కమిటీ’ దీని ఆధారంగానే భారత్‌లో కొవిడ్‌ వ్యాప్తిపై అంచనాలను రూపొందించింది. దేశంలో రెండో ఉద్ధృతి తీరును ముందుగా అంచనా వేయలేకపోయినట్లు కమిటీ అంగీకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని