Medaram Jathara: వన జాతర జయహో..

వన జాతర భక్తజన సాగరమైంది. మేడారం వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెకు చేరుకోగా.. గురువారం సమ్మక్క తల్లి కొలువు దీరింది.

Updated : 19 Feb 2022 04:48 IST

మేడారంలో అమ్మల దర్శనానికి పోటెత్తిన భక్తులు

కిక్కిరిసిన క్యూలైన్లు

జన ప్రవాహమైన జంపన్నవాగు

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: వన జాతర భక్తజన సాగరమైంది. మేడారం వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెకు చేరుకోగా.. గురువారం సమ్మక్క తల్లి కొలువు దీరింది. నలుగురూ గద్దెలపై ఆశీనులవడంతో శుక్రవారం వనదేవతల నిండు జాతరకు జనం పోటెత్తారు. క్యూలైన్లు కిక్కిరిసి పోయాయి. జంపన్నవాగు తీరమంతా భక్త ప్రవాహమైంది. ఇప్పటివరకు కోటి మందికిపైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. దర్శనాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిశా నుంచి భక్తులు తరలివచ్చారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రేణుకా సింగ్‌, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తదితర ప్రముఖులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశ ప్రధాని కావాలని మొక్కుకున్నానని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.

గిరిజన వర్సిటీకి రూ. 45 కోట్లు: కిషన్‌రెడ్డి

ఆదివాసీ సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మేడారం జాతర అని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. కరోనా నుంచి ప్రపంచానికి విముక్తి కలిగించాలని అమ్మవార్లను కోరుకున్నట్లు తెలిపారు. అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ములుగులో ఏర్పాటు చేయనున్న గిరిజన యూనివర్సిటీకి రూ.45 కోట్లు కేటాయించింది. పనులు ప్రారంభిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తాం. ఈ ప్రాంతానికి ట్రైబల్‌ సర్క్యూట్‌ కింద నిధులు మంజూరు చేసి కాటేజీలు, హోటళ్ల నిర్మాణం పూర్తిచేశాం. బిర్సాముండా జయంతిని ఆదివాసీ హక్కుల దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. రూ.15 కోట్లతో హైదరాబాద్‌లో ట్రైబల్‌ మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తున్నాం’’ అని తెలిపారు. కుంభమేళా తర్వాత అంతపెద్ద జాతర మేడారమే అని కేంద్ర గిరిజన శాఖ సహాయమంత్రి రేణుకా సింగ్‌ అన్నారు. ఇక్కడికి వచ్చి సమ్మక్కసారలమ్మలను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

నేడు వనప్రవేశం..

గద్దెలపై కొలువుదీరి మొక్కులు అందుకుంటున్న అమ్మవార్లు శనివారం సాయంత్రం వనప్రవేశం చేయనున్నారు. వన దేవతలను రెండేళ్లకోసారి ఘనంగా స్వాగతించడం, గద్దెలపై ప్రతిష్ఠించి మొక్కులు సమర్పించడం, నాలుగో రోజు వన ప్రవేశం చేయించడం ఆదివాసీ సంప్రదాయం. అమ్మవార్ల వన ప్రవేశంతో మేడారం మహాజాతర ముగుస్తుంది.

సీఎం రాకకు నేతల ఎదురుచూపులు..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం నాటి మేడారం పర్యటన రద్దయింది. ఆయన రాక కోసం యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు మేడారం చేరుకున్నారు. తొలుత మధ్యాహ్నం 12 గంటలకు సీఎం వస్తారని చెప్పారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వస్తారని ప్రచారం చేశారు. చివరకు పర్యటన రద్దయింది.

ప్రజలు ప్రశ్నిస్తారనే ముఖ్యమంత్రి రాలేదు: సంజయ్‌

గత జాతర్ల సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, వాటిపై ప్రజలకు సమాధానం చెప్పలేకనే కేసీఆర్‌ మేడారానికి రాలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ జాతరకు రాకపోవడం అంటే గిరిజనులను అవమానించడమేనని, వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. శనివారమైనా మేడారం రావాలన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ ధరలు పెంచిందని.. త్వరలోనే ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపనుందని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని