Hyderabad Metro: ఎయిర్‌పోర్టుకు మెట్రో

హైదరాబాద్‌లో మరో మెట్రోరైలు ప్రాజెక్టు అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మహానగరాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంతో అనుసంధానం చేస్తూ ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వెల్లడించింది.

Updated : 28 Nov 2022 06:14 IST

రాయదుర్గం నుంచి శంషాబాద్‌ వరకు విస్తరణ
డిసెంబరు 9న శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్‌
అంచనా వ్యయం రూ.6,250 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మాణం
మూడేళ్లలో పూర్తి: మంత్రి కేటీఆర్‌
ఈనాడు - హైదరాబాద్‌

హైదరాబాద్‌లో మరో మెట్రోరైలు ప్రాజెక్టు అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మహానగరాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంతో అనుసంధానం చేస్తూ ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఐటీ హబ్‌ మైండ్‌ స్పేస్‌ (రాయదుర్గం మెట్రో స్టేషన్‌) నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి 31 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో లైను నిర్మించనున్నట్లు తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిసెంబరు 9వ తేదీన ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ మెట్రోకు శంకుస్థాపన చేయనున్నట్లు పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదివారం తెలిపారు. ఈ ప్రాజెక్టు వివరాలను ఆదివారం ఆయన ట్విటర్‌లో వెల్లడించారు. మూడేళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం రూ.6,250 కోట్ల సొంత నిధులతో చేపడుతుందని తెలిపారు. శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రోరైలు పొడిగింపు ప్రతిపాదనలు కొంతకాలంగా నలుగుతున్నాయి. ఎట్టకేలకు దీనికి పచ్చజెండా ఊపిన సర్కారు.. సమస్యలు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. మైండ్‌స్పేస్‌ నుంచి గచ్చిబౌలి, నానక్‌రాంగూడ జంక్షన్‌ల నుంచి ఓఆర్‌ఆర్‌ మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయం వరకు కొత్తగా మెట్రో రైలు సౌకర్యం రానుంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచస్థాయి పెట్టుబడులతో విస్తరిస్తున్న నగరంలో ట్రాఫిక్‌ రద్దీ పెరుగుతున్నందున మెట్రోను విమానాశ్రయం వరకు అనుసంధానించడం అవసరమని పేర్కొంది. ఇప్పటికే ఉన్న 69 కిలోమీటర్ల మెట్రోరైలు ప్రాజెక్టు విజయవంతంగా నడుస్తోందని.. ఇప్పుడు రెండో దశలో కీలకమైన విస్తరణను చేపడుతున్నట్లు వివరించింది.

మూడో దశలో బీహెచ్‌ఈఎల్‌- లక్డీకాపూల్‌!

బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌ వరకు 26 కిలోమీటర్ల దూరం (మియాపూర్‌, హఫీజ్‌పేట, గచ్చిబౌలి, మెహిదీపట్నం మీదుగా) మెట్రోరైలు, నాగోల్‌ నుంచి ఎల్‌బీనగర్‌ మెట్రో స్టేషన్‌ వరకు 5 కిలోమీటర్ల మేర మెట్రో రైలు అనుసంధానం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సవివర నివేదిక (డీపీఆర్‌) రూపొందించి కేంద్రానికి సమర్పించింది. మొత్తం 31 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టుకు రూ.8453 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసి ఆ నిధులివ్వాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇటీవల జరిగిన ప్రీ బడ్జెట్‌ సమావేశంలో కూడా దీన్ని సమర్పించి.. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో చేర్చాలని కోరింది. అంతకుముందే మంత్రి కేటీఆర్‌ కేంద్ర పురపాలకశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురికి లేఖ రాశారు. హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రోనగరంగా పేర్కొంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టుగా చేపట్టేందుకు కేంద్రం తోడ్పాటు అందించాలని వివరించింది. ఈ ప్రాజెక్టు చర్చల దశలో ఉందని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో వెల్లడించారు.


ప్రస్తుతం అందుబాటులో..

* మియాపూర్‌-ఎల్‌బీనగర్‌: 29 కిలోమీటర్లు
* నాగోల్‌-రాయదుర్గం (మైండ్‌స్పేస్‌): 29 కిలోమీటర్లు
* జేబీఎస్‌-ఎంజీబీఎస్‌: 11 కిలోమీటర్లు
* నిత్యం సగటు ప్రయాణికులు: 4 లక్షల మంది


కొత్త ప్రాజెక్టు

* మైండ్‌స్పేస్‌-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు: 31 కిలోమీటర్లు
(గచ్చిబౌలి * నానక్‌రాంగూడ జంక్షన్‌ * అప్పా జంక్షన్‌ * రాజేంద్రనగర్‌ల మీదుగా శంషాబాద్‌)


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని