దేశ ప్రతిష్ఠ పెంచేలా యాదాద్రి ‘పవర్‌’

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న నాలుగు వేల మెగావాట్ల అల్ట్రా మెగా థర్మల్‌ విద్యుత్కేంద్రం దేశ కీర్తిప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు.

Published : 29 Nov 2022 04:33 IST

కార్పొరేట్‌ వ్యక్తులు ఒత్తిడి తెచ్చినా ప్రభుత్వ రంగంలోనే నిర్మాణం
ప్లాంటు పరిశీలనలో సీఎం కేసీఆర్‌
వచ్చే ఏడాది డిసెంబరు నాటికి రెండు యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభిస్తామన్న అధికారులు

ఈనాడు, నల్గొండ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న నాలుగు వేల మెగావాట్ల అల్ట్రా మెగా థర్మల్‌ విద్యుత్కేంద్రం దేశ కీర్తిప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా తలొగ్గకుండా.. రైతులు, ప్రజల శ్రేయస్సును కాంక్షించి ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌ ద్వారా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని స్పష్టంచేశారు. పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌.. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకరరావును అభినందించారు. వీలైనంత తొందరగా పూర్తి చేసి ఉత్పత్తి మొదలుపెట్టాలని ఆదేశించారు. కరోనా కారణంగా పనులు ఏడాదిన్నర ఆలస్యమయ్యాయని.. 2023 డిసెంబరు నాటికి రెండు యూనిట్లను పూర్తి చేసి విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామని, మిగిలిన మూడు యూనిట్లు 2024 జూన్‌ నాటికి పూర్తవుతాయని ఈ సందర్భంగా ప్రభాకరరావు.. సీఎంకు వివరించారు. థర్మల్‌ విద్యుత్కేంద్రం పనులను శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి సీఎం కేసీఆర్‌ సోమవారం పరిశీలించారు. హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 12.56 గంటలకు హెలికాప్టర్‌లో సీఎం విద్యుత్కేంద్రం ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్లాంటు ఫేజ్‌-1, యూనిట్‌-2 బాయిలర్‌ ప్రదేశానికి బస్సులో వచ్చారు. అక్కడ 82 మీటర్ల ఎత్తులో ఉన్న 12వ ఫ్లోర్‌కు చేరుకొని నిర్మాణ పనులను బీహెచ్‌ఈఎల్‌, జెన్‌కో అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి.. నిర్మాణ వివరాలు తెలుసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన డిస్‌ప్లే బోర్డులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. 

పది వేల మందికి ఉపయోగపడేలా టౌన్‌షిప్‌ నిర్మాణం

విద్యుత్‌ కేంద్రంలో పనిచేసే సుమారు 10 వేల మంది సిబ్బందికి ఉపయోగపడేలా అద్భుతమైన టౌన్‌షిప్‌ నిర్మాణం జరగాలి. ఇందుకు పట్టణ ప్రణాళిక నిపుణుల సేవలను వినియోగించుకోవాలి. సిబ్బంది క్వార్టర్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన తక్షణం చేపట్టాలి. ఇందుకు ప్రత్యేకంగా వంద ఎకరాలు సేకరించాలి. ఇదే ప్రాంతంలో భవిష్యత్తులో సోలార్‌ ప్లాంటు సైతం ఏర్పాటు చేయనున్నందున సిబ్బంది ఇంకా పెరుగుతారు.. అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు 50 ఎకరాలు కేటాయించాలి. సిబ్బంది కోసం సూపర్‌మార్కెట్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌, క్లబ్‌ హౌస్‌, హాస్పిటల్‌, స్కూల్‌, ఆడిటోరియం, మల్టీప్లెక్స్‌ నిర్మాణాలను చేపట్టాలి. ప్లాంటు సిబ్బందికి సేవలందించే ప్రైవేట్‌ సర్వీసు స్టాఫ్‌కూ క్వార్టర్లు నిర్మించాలి. దామరచర్ల మండల కేంద్రం నుంచి ప్లాంటు వరకు ఏడు కి.మీ.ల మేర నాలుగులైన్ల సీసీ రహదారిని వెంటనే మంజూరు చేయాలని ఆదేశిస్తున్నా. దామరచర్ల(విష్ణుపురం) రైల్వే స్టేషన్‌ విస్తరణతోపాటు దామరచర్ల-వీర్లపాలెం రహదారిలో ఉన్న రైల్వే క్రాసింగ్‌ వద్ద ఆర్వోబీ నిర్మాణానికి అధికారులు రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాలి’’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్లాంటు నిర్మాణానికి భూములిచ్చిన రైతులతోపాటు సాగర్‌ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డిలను సీఎం ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను పరిష్కరించేలా అక్కడికక్కడే అధికారులకు పలు సూచనలు చేశారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కోటిరెడ్డి, విప్‌ సునీత, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, సైదిరెడ్డి, శేఖర్‌రెడ్డి, లింగయ్య, భూపాల్‌రెడ్డి, కిశోర్‌కుమార్‌, ప్రభాకర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, రవీంద్రకుమార్‌, మల్లయ్యయాదవ్‌, భగత్‌, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


హైదరాబాద్‌ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్‌ అనుసంధానత

‘‘కనీసం 30 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బొగ్గు నిల్వలు సహా ఇతర అంశాల్లోనూ అధికారులు ముందుచూపుతో వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడి నుంచి రాజధాని హైదరాబాద్‌ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్‌ కనెక్టివిటీ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ప్లాంటుకు అవసరమైన నీళ్లను కృష్ణా నది నుంచి తీసుకోవాలి. కృష్ణపట్నం పోర్టు, నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిని దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్లాంటు నిర్మాణానికి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని