నేటి నుంచి హైదరాబాద్‌ సాహితీ వేడుక

వివిధ సాహితీ, సాంస్కృతిక, ప్రచురణ సంస్థల సహకారంతో హైదరాబాద్‌ లిటరరీ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరిగే  సాహితీ వేడుక(లిటరరీ ఫెస్టివల్‌)కు రంగం సిద్ధమైంది.

Published : 27 Jan 2023 04:29 IST

ముఖ్యఅతిథిగా జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు గ్రహీత దామోదర్‌ మౌజో
హాజరుకానున్న రచయితలు, కళాకారులు, దర్శకులు

ఈనాడు, హైదరాబాద్‌: వివిధ సాహితీ, సాంస్కృతిక, ప్రచురణ సంస్థల సహకారంతో హైదరాబాద్‌ లిటరరీ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరిగే  సాహితీ వేడుక(లిటరరీ ఫెస్టివల్‌)కు రంగం సిద్ధమైంది. రాష్ట్ర సచివాలయం సమీపంలోని విద్యారణ్య పాఠశాలలో జరిగే ఈ కార్యక్రమంలో అనేకమంది సాహితీవేత్తలు, రచయితలు, కళాకారులు, దర్శకులు, చిత్రకారులు పాల్గొననున్నారు. చర్చాగోష్ఠులు, పలు రకాల ప్రదర్శనలు, వివిధ అంశాలపై అవగాహన పెంచే కార్యక్రమాలెన్నో సమాంతరంగా జరగనున్నాయి. ఆయా రంగాలపై అధ్యయనం చేసిన దేశ, విదేశీ ప్రముఖులు సుమారు 120 మందికిపైగా అతిథులుగా హాజరుకానున్నారు. 27న మధ్యాహ్నం జరిగే ప్రారంభ కార్యక్రమానికి జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు గ్రహీత దామోదర్‌ మౌజో ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ అధ్యక్షత వహిస్తారు. ఈ సందర్భంగా భాష, సాహిత్యం, స్వేచ్ఛ-భిన్నాభిప్రాయాలపై సదస్సు జరగనుంది. అనంతరం జరిగే చర్చాగోష్ఠిలో ప్రముఖ సినీనటి, రచయిత, పెయింటర్‌ దీప్తినావల్‌ పాల్గొంటారు. తాజాగా ఆమె రాసిన ‘ఎ కంట్రీ కాల్డ్‌ చైల్డ్‌హుడ్‌-ఎ మెమొయిర్‌’ పుస్తకంపై చర్చ జరగనుంది. 28న ఉదయం పది గంటలకు జరిగే కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయుడు, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌ పాల్గొంటారు. 1998లో ‘ఎవ్రీబడీ లవ్స్‌ ఎ గుడ్‌ డ్రాట్‌’ పుస్తకాన్ని రాసిన సాయినాథ్‌, తాజాగా స్వాతంత్య్ర సమరంలో పాల్గొని గుర్తింపునకు నోచుకోని వారి గురించి ‘లాస్ట్‌ హీరోస్‌-ఫుట్‌ సోల్జర్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫ్రీడం’ పేరుతో పుస్తకం వెలువరించారు. దీని గురించి చర్చాగోష్ఠి జరగనుంది. ఇటీవలే హైదరాబాద్‌ గురించి రాసిన మన్రీత్‌ సోది సోమేశ్వర్‌ (న్యూయార్క్‌), చిన్నపిల్లల పుస్తక రచయిత నేహా జైన్‌ హాజరవుతారు. టైమ్‌మేనేజ్‌మెంట్‌ అంశంపై బ్లేజ్‌ ఆటోమేషన్‌ టెక్నికల్‌ డైరెక్టర్‌ శారద అక్కినేని, హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ప్రొఫెసర్‌ రీమా గుప్త, పర్యావరణం-వాతావరణ మార్పులపై యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినాలో పనిచేస్తున్న సిరి నల్లపరాజు తదితరులు మాట్లాడనున్నారు. ప్రపంచబ్యాంకు సీనియర్‌ ఆర్థిక శాస్త్రవేత్త శరణ్య భట్టాచార్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు అనే అంశంపై పుణెలోని ఐ.ఐ.ఎస్‌.ఇ.ఆర్‌లో పనిచేస్తున్న వినీత బాల్‌ తదితరులు ప్రసంగిస్తారు. బిలియన్‌ డాలర్‌ డ్రీమ్స్‌ అనే అంశంపై బి.వి.ఆర్‌ మోహన్‌రెడ్డి మాట్లాడతారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పలువురు చిత్రకారులు తమ ప్రదర్శనలు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు మెలకువలు నేర్పించనున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని