Aung San Suu Kyi: ఆంగ్‌ సాన్‌ సూకీకి క్షమాభిక్ష.. శిక్ష తగ్గించిన సైనిక ప్రభుత్వం

మయన్మార్‌ (Myanmmar)లో దేశ వ్యాప్తంగా నిర్వహించే బౌద్ధ పండుగ సందర్భంగా ఆంగ్ సాన్‌ సూకీ (Aung San Suu Kyi), మాజీ అధ్యక్షుడు విన్‌ మైంట్‌ సహా ఏడు వేల మంది ఖైదీలకు అక్కడి సైనిక ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది.

Published : 01 Aug 2023 13:48 IST

బ్యాంకాక్‌: మయన్మార్‌ (Myanmar) కీలక నేత, నోబెల్ బహుమతి విజేత ఆంగ్ సాన్‌ సూకీ (Aung San Suu Kyi)కి స్వల్ప ఊరట లభించింది. ఆ దేశ సైనిక ప్రభుత్వం ఆమెకు క్షమాభిక్షను ప్రసాదించింది. దీంతో ఆమెకు ఆరేళ్ల జైలు శిక్ష తగ్గనుందని ఆ దేశ అధికార ప్రతినిధి జా మిన్‌ తెలిపారు. గత వారం సూకీని జైలు నుంచి గృహనిర్భందానికి తరలించారు. మయన్మార్‌లో దేశ వ్యాప్తంగా నిర్వహించే బౌద్ధ పండుగ సందర్భంగా సూకీ, మాజీ అధ్యక్షుడు విన్‌ మైంట్‌ సహా ఏడు వేల మంది ఖైదీలకు అక్కడి సైనిక ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. ఇందులో భాగంగా విన్‌ మైంట్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష తగ్గనుంది. 

ఏమీ ఆర్డర్‌ చేయకున్నా అమెజాన్‌ నుంచి వందకు పైగా పార్శిళ్లు

ఆంగ్‌ సాన్‌ సూకీని 19కిపైగా కేసుల్లో దోషిగా తేలుస్తూ మయన్మార్‌ కోర్టు ఆమెకు 33ఏళ్ల జైలు శిక్ష విధించింది. తాజా క్షమాభిక్షలో భాగంగా వీటిలో నాలుగు కేసుల్ని రద్దు చేశారు. తొలిసారిగా 1989లో సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినందుకు ఆమెను గృహనిర్భందంలో ఉంచారు. 1991లో ప్రజాస్వామ్య స్థాపనకు కృషి చేసినందుకు ఆమెకు నోబెల్‌ బహుమతి వరించింది. 2010లో ఆమెకు గృహనిర్భందం నుంచి విముక్తి లభించింది. 2015లో మయన్మార్‌లో జరిగిన ఎన్నకల్లో ఆమె పార్టీ విజయం సాధించడంతో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది. తర్వాత 2020లో జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ మరోసారి విజయం సాధించింది. 2021లో సూకీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం బాధ్యతలు చేపట్టింది. అప్పటి నుంచి మయన్మార్‌లో సైనిక పాలన సాగుతోంది. ఆ తర్వాత సూకీతోపాటు ఆమె అనుచరులపై ఎన్నికల్లో అవతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో కోర్టు జైలు శిక్ష విధించింది. దాంతోపాటు మరికొన్ని కేసుల్లో కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. తాజాగా వాటిలో నాలుగు కేసులను కొట్టేశారు. 

మరోవైపు మయన్మార్‌లో ఎమర్జెన్సీని పొడిగిస్తున్నట్లు  సైనిక ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఎన్నికలను జాప్యం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజధానిలో సోమవారం సమావేశమైన జాతీయ రక్షణ, భద్రతా మండలి (ఎన్‌డీఎస్‌సీ) ఎమర్జెన్సీని మరో 6 నెలలపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని