UN: ఉగ్రవాదంలో రకాలేంటీ..! ఐరాసలో గళమెత్తిన భారత్‌

ఉగ్రవాదాన్ని వర్గీకరించే ధోరణి ప్రమాదకరమని భారత్‌ స్పష్టం చేసింది. అన్ని రూపాలు, వ్యక్తీకరణల్లో ఉగ్రవాదాన్ని ఖండించాలన్న సూత్రాలకు ఇది విరుద్ధమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ వ్యాఖ్యానించారు.

Published : 10 Mar 2023 20:41 IST

న్యూయార్క్‌: ఉగ్రవాద చర్యల(Terrorist Acts) వెనుక ఉన్న ప్రేరేపిత అంశాల ఆధారంగా ఉగ్రవాదాన్ని వర్గీకరించే ధోరణి ప్రమాదకరమని భారత్‌ పేర్కొంది. ఇస్లామోఫోబియా, హిందూ, యూదు, సిక్కు, బౌద్ధ వ్యతిరేక ప్రేరేపిత.. ఇలా అన్ని రూపాల్లోని ఉగ్ర దాడులు(Terror Attacks) ఖండించదగినవని స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే నెపంతో తప్పుదోవ పట్టించే కొత్త పదాలు, తప్పుడు భాష్యాలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఐరాస(UN)లో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్(Ruchira Kambhoj) విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలను వారి చర్యలకు జవాబుదారీ చేయాలని.. పాకిస్థాన్‌ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా చురకలంటించారు.

‘ఉగ్రవాదాన్ని వర్గీకరించే ధోరణి ప్రమాదకరం. అన్ని రూపాలు, వ్యక్తీకరణల్లో ఉగ్రవాదాన్ని ఖండించాలన్న సూత్రాలకు ఇది విరుద్ధం’ అని తాజాగా గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ (GCTS) 8వ సమీక్ష సమావేశంలో రుచిరా కాంబోజ్‌ మాట్లాడారు. ‘ఉగ్రవాదుల్లో మంచివారు, చెడ్డవారని ఉండకూడదు. ఇలాగైతే.. వారు 'మీ టెర్రరిస్టులు', వీరు 'మా టెర్రరిస్టులు' అని ముద్ర వేసుకున్న 9/11 దాడుల కాలంనాటికి దిగజారిపోతాం. గత రెండు దశాబ్దాల్లో అంతర్జాతీయ సమాజం సాధించిన సామూహిక ప్రయోజనాలూ దీంతోపాటే మాయమైపోతాయి’ అని కాంబోజ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. 

‘అతివాద, మితవాద, వామపక్ష తీవ్రవాద భావజాలం వంటి కొన్ని పరిభాషలు.. స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగానికి దారితీస్తాయి. ఈ నేపథ్యంలో.. ప్రజాస్వామ్య భావనకు గొడ్డలిపెట్టులా పరిణమించే ఉగ్ర వర్గీకరణల విషయంలో జాగ్రత్తగా ఉండాలి’ అని పేర్కొన్నారు. మతం, విశ్వాసాలు, సంస్కృతి, జాతి బేధాలు లేకుండా అన్ని రూపాల్లోని ఉగ్రదాడులను భారత్‌ ఖండిస్తుందని చెప్పారు. రెండేళ్ల క్రితం జరిగిన జీసీటీఎస్‌ 7వ సమీక్షలో కేవలం ఇస్లాం, క్రిస్టియన్‌, యూదు వ్యతిరేక దాడులను పరిగణనలోకి తీసుకుని, మిగతా వాటిని విస్మరించినట్లు గుర్తు చేశారు. ఉగ్రవాదంతో పోరాడే విధానం, వ్యూహంలో లౌకిక స్వభావాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమన్నారు.

ఇదిలా ఉండగా.. ఐరాస ‘జీసీటీఎస్‌’ అనేది ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయత్నాలను ఏకీకృతం చేసే ప్రత్యేక సాధనం. 2006లో అన్ని ఐరాస సభ్యదేశాలు మొదటిసారి ఉగ్రవాద కట్టడి, పోరాటంపై ఉమ్మడి వ్యూహాత్మక, కార్యాచరణ విధానాలకు అంగీకరించాయి. ఈ క్రమంలోనే.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(FATF) వంటి కొన్ని అంతర్జాతీయ వేదికల కార్యకలాపాలను కూడా జీసీటీఎస్‌ పరిగణనలోకి తీసుకోవాలని కాంబోజ్‌ కోరారు. తద్వారా.. టెర్రర్ ఫైనాన్సింగ్‌ విషయంలో అలసత్వం వహించే సభ్య దేశాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవచ్చని మరోసారి పాక్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని