Ukraine Crisis: శత కన్నీటి చారికలు

పశ్చిమ దేశాల పంచన చేరుతోందని ఆరోపిస్తూ ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దండయాత్రకు వంద రోజులు పూర్తయింది. ఫిబ్రవరి 24న మొదలైన ఈ వినాశకర పోరుకు ముగింపు కనుచూపు మేరలో కనపడటంలేదు. రక్తపాతం, విధ్వంసం అక్కడ సర్వసాధారణ మైపోయాయి. ఈ వార్తలు ప్రపంచానికి నిత్యకృత్యమయ్యాయి. పిడుగుల్లా పడుతున్న బాంబులు.. కుప్పకూలుతున్న భవనాలు.. వీధుల్లో చెల్లాచెదురుగా శవాలు.. సర్వం కోల్పోయి ప్రాణాలు అరచేతపట్టుకుని వలసపోతున్న కుటుంబాలు.. ఇదీ మూడు

Updated : 04 Jun 2022 06:05 IST

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి వందరోజులు
నిత్యకృత్యమైన బాంబుదాడులు.. ఎటుచూసినా శవాల దిబ్బలు.. కుప్పకూలిన భవనాలు  

ఈనాడు ప్రత్యేక విభాగం

శ్చిమ దేశాల పంచన చేరుతోందని ఆరోపిస్తూ ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దండయాత్రకు వంద రోజులు పూర్తయింది. ఫిబ్రవరి 24న మొదలైన ఈ వినాశకర పోరుకు ముగింపు కనుచూపు మేరలో కనపడటంలేదు. రక్తపాతం, విధ్వంసం అక్కడ సర్వసాధారణ మైపోయాయి. ఈ వార్తలు ప్రపంచానికి నిత్యకృత్యమయ్యాయి. పిడుగుల్లా పడుతున్న బాంబులు.. కుప్పకూలుతున్న భవనాలు.. వీధుల్లో చెల్లాచెదురుగా శవాలు.. సర్వం కోల్పోయి ప్రాణాలు అరచేతపట్టుకుని వలసపోతున్న కుటుంబాలు.. ఇదీ మూడు నెలలుగా ఉక్రెయిన్‌లో నెలకొన్న దుస్థితి. బుచా నగరంలో పెద్ద సంఖ్యలో వెలుగు చూసిన పౌరుల మృతదేహాలు.. మేరియుపొల్‌లో పేలిపోయిన థియేటర్‌.. రష్యా క్షిపణి దాడితో ధ్వంసమైన క్రామటోర్స్క్‌ రైల్వే స్టేషన్‌.. వంటి విధ్వంసక చిత్రాలు మానవాళి మస్తిష్కం నుంచి ఇప్పుడప్పుడే తొలగిపోవు. ఈ వంద రోజుల్లో ఎంతటి  వినాశనం చోటుచేసుకుందంటే..  

శవాల కుప్పలు..

యుద్ధంలో జరిగిన ప్రాణనష్టంపై నిర్దిష్ట అధికారిక సమాచారం లేదు. అయితే తమ దేశ పౌరులు వేల మంది మరణించినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. రోజుకు 60 నుంచి 100 మంది ఉక్రెయిన్‌ సైనికులు అమరులవుతున్నారని చెప్పారు.

ఒక్క మేరియుపొల్‌లోనే 21వేల మందికి పైగా పౌరులు మృతిచెందినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. రష్యా ప్రధానంగా దృష్టిసారించిన లుహాన్స్క్‌ ప్రాంతంలోని సీవీరోదొనెట్స్క్‌ వద్ద 1500 మంది బలయ్యారని ఆ నగర మేయర్‌ చెప్పారు.

రష్యా చెప్పకున్నా..

తన సైనికులు ఎంతమంది మరణించారన్నదానిపై రష్యా చివరిసారిగా మార్చి 25న ప్రకటన చేసింది. 1,351 మంది చనిపోయారని, 3,825 మంది గాయపడ్డారని నాడు తెలిపింది. ఆ తర్వాత పెదవి విప్పలేదు. అయితే 30వేల మందికి పైగా రష్యా సైనికులు మరణించి ఉంటారని ఉక్రెయిన్‌, పశ్చిమ దేశాల పరిశీలకులు చెబుతున్నారు. ఇది 10 ఏళ్ల పాటు అఫ్గానిస్థాన్‌లో జరిపిన యుద్ధంలో సోవియట్‌ యూనియన్‌ కోల్పోయిన మిలటరీ సిబ్బంది సంఖ్య కన్నా అధికం. తాజా పోరులో 40వేల మంది రష్యన్‌ సైనికులు గాయపడి ఉంటారని అంచనా.

తూర్పు ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌ ప్రాంతంలో రష్యా మద్దతున్న వేర్పాటువాదులు 1300 మంది చనిపోగా 7,500 మంది గాయపడ్డారు. లుహాన్స్క్‌ ప్రాంతంలో 477 మంది వేర్పాటువాదులు, 29 మంది పౌరులు చనిపోయారు.

ప్రాణాలు అరచేత పట్టుకొని వలస..

యుద్ధం మొదలైన నాటి నుంచి దాదాపు 68లక్షల మంది ఉక్రెయిన్‌ను వీడి ఇతర దేశాలకు వలస వెళ్లినట్లు ఐరాస శరణార్థుల సంస్థ అంచనా వేసింది.  71 లక్షల మంది స్వస్థలాలు వీడి.. దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు అంచనా.

20 శాతం ఆక్రమణ..

యుద్ధానికి ముందు ఉక్రెయిన్‌లోని 7శాతం భూభాగంపై రష్యా నియంత్రణ ఉండేది. ఇందులో క్రిమియాతో పాటు దొనెట్స్క్‌, లుహాన్స్క్‌ ప్రాంతాలున్నాయి. తాజాగా 20శాతం భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుందని స్వయంగా జెలెన్‌స్కీనే ప్రకటించారు. అంటే.. అదనంగా 58వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతం పుతిన్‌ సేన అధీనంలోకి వెళ్లిపోయిందన్నమాట.  


ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు..

యుద్ధంవల్ల ఆహారం, ఇంధన ధరలు పెరగడంతో వర్ధమాన దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఆఫ్రికా దేశాలకు గోధుమ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రస్తుత సంక్షోభంతో ఆహార ధాన్యాలకు రెక్కలు వచ్చాయి.

మొత్తంమీద ఉక్రెయిన్‌ నుంచి సరఫరా కావాల్సిన ఆహార ధాన్యాలు, ఎరువులకు కొరత ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందిపై ప్రభావం పడినట్లు అంచనా.


పేకమేడల్లా కూలిన భవనాలు

తఘ్నులు, వైమానిక దాడులతో రష్యా సేనలు జరిపిన బాంబు దాడుల కారణంగా ఉక్రెయిన్‌లోని అనేక నగరాలు, పట్టణాల్లో సింహభాగం కాంక్రీటు శకలాల దిబ్బల్లా మారిపోయాయి.

రష్యా దాడుల వల్ల దాదాపు 38వేల నివాస భవనాలు నేలమట్టమైనట్లు ఉక్రెయిన్‌ పార్లమెంటరీ కమిషన్‌ వెల్లడించింది. దీనివల్ల 2.20లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

1900 విద్యా సంస్థలు ధ్వంసమయ్యాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకూ ఉన్నాయి. 50 రైలు వంతెనలు, 500 కర్మాగారాలు, 500 ఆసుపత్రులు నాశనమయ్యాయి.

ఉక్రెయిన్‌లోని ఆసుపత్రులు, అంబులెన్సులు, వైద్య సిబ్బందిపై 296 దాడులు జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.


ఆర్థికంగానూ దెబ్బ

యుద్ధం వల్ల ఉక్రెయిన్‌తోపాటు రష్యా కూడా  ఆర్థికంగా దెబ్బతింది. ఇప్పుడప్పుడే కోలుకోలేనంతగా ఇరు దేశాలు నష్టపోయాయి.

రష్యాను గుళ్లబార్చేందుకు పశ్చిమ దేశాలు భారీగా ఆంక్షలు విధించాయి. కీలకమైన చమురు, గ్యాస్‌ రంగాలనూ లక్ష్యంగా చేసుకున్నాయి. దీంతో ఇంధన అవసరాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని ఐరోపా దేశాలు తగ్గించుకుంటున్నాయి.

మొత్తంమీద రష్యాపై 5వేల ఆంక్షలు ఉన్నాయి. ప్రపంచంలోనే ఏ దేశం ఇన్ని చర్యలను ఎదుర్కోవడంలేదు.

దాదాపు 300 బిలియన్‌ డాలర్ల రష్యా బంగారం, విదేశీ మారక నిల్వలను పశ్చిమ దేశాలు స్తంభింపజేశాయి.

రష్యాలో 1000కి పైగా కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేయడం లేదా తగ్గించడం చేశాయి.

ఈ ఏడాది ఆరంభంతో పోలిస్తే.. రష్యా స్టాక్‌ ఇండెక్స్‌ 40 శాతం పతనమైంది. ఏప్రిల్‌ నాటికే దేశంలో ద్రవ్యోల్బణం 17.8 శాతానికి చేరింది.


ఉక్రెయిన్‌కు కోలుకోలేని నష్టం..

యుద్ధంతో ఉక్రెయిన్‌ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ఆ దేశ జీడీపీలో 35 శాతం తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం నష్టం 600 బిలియన్‌ డాలర్ల పైనే ఉంటుందని అంచనా.

ఉక్రెయిన్‌ ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం. ఇప్పుడు ఆ దేశ కీలక రేవులన్నీ రష్యా ముట్టడిలో ఉన్నాయి. దీంతో 22 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాలను ఉక్రెయిన్‌ ఎగుమతి చేసుకోలేకపోతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని