ఏడాది పాలన.. ఎటు చూసినా రోదన

అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకుని... ‘ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌’లో వారు సాగిస్తున్న పాలన సోమవారం ఏడాది పూర్తిచేసుకుంది. ఈ ఏడాది కాలంలో దేశం ఆర్థిక పతనం

Updated : 16 Aug 2022 19:19 IST

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల వేడుకలు

కాబూల్‌: అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకుని... ‘ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌’లో వారు సాగిస్తున్న పాలన సోమవారం ఏడాది పూర్తిచేసుకుంది. ఈ ఏడాది కాలంలో దేశం ఆర్థిక పతనం సహా ఎన్నో ఆటుపోట్లకు గురైంది. అంతర్జాతీయంగానూ ఒంటరిగా మిగిలింది. ఇంటాబయటా సవాళ్లు ముసురుకున్న వేళ- ఏడాది పాలనకు గుర్తుగా తాలిబన్లు మోటారు వాహనాలపై వీధుల్లో తిరుగుతూ ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహించారు. అమెరికా రాయబార కార్యాలయం ఉన్నచోట కొందరు ‘డెత్‌ టు అమెరికా’ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు.

పేదరికంలోకి లక్షల మంది..

అఫ్గాన్‌ పగ్గాలు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఆ దేశం చిన్నాభిన్నమైంది. ఆర్థిక పతనానికి తోడు విదేశీ సాయం కూడా మందగించింది. దీంతో లక్షల మంది పేదరికంలోకి జారుకున్నారు. తాలిబన్‌ పాలకులను ఏ దేశమూ గట్టిగా విశ్వసించకపోవడంతో... అంతర్జాతీయంగా అఫ్గాన్‌ ఒంటరిగా మారింది. అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి... బాలికలు, మహిళలు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి ఇబ్బంది కలిగించబోమని తాలిబన్లు తొలినాళ్లలో నమ్మబలికారు. కాలక్రమంలో దాన్ని తుంగలో తొక్కారు. యుక్తవయసు పిల్లలు ఇప్పుడు విద్యాసంస్థల్లో చదువుకోలేని పరిస్థితి నెలకొంది. మహిళలు బహిరంగ ప్రదేశాల్లోకి రావాలంటే నడినెత్తి నుంచి అరికాళ్ల వరకూ బురఖా ధరించాల్సిందే. చాలామంది తమ ఇళ్లలోని ఆడపిల్లల చదువులు ఆగిపోకూడదని ప్రత్యామ్నాయ మార్గాల్లో వారికి విద్యను చెప్పిస్తున్నారు. బాలికల కోసం అక్కడక్కడ రహస్య, భూగర్భ పాఠశాలలు వెలిశాయి. అఫ్గాన్‌ బాలికలను, మహిళలను, వారి హక్కుల పట్ల ప్రపంచ సమాజం నిర్లక్ష్యం వహించరాదని ఐరాస లైంగిక, పునరుత్పిత్తి ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ నటాలియా కనెమ్‌ పేర్కొన్నారు.

గర్వించదగ్గ రోజంటూ...

అఫ్గానిస్థాన్‌లో రెండు దశాబ్దాల సుదీర్ఘ పోరాటాన్ని అర్ధంతరంగా ముగించిన అమెరికా, నాటో బలగాలు... ఏడాది కిందట కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.తాలిబన్ల బెడద నుంచి తప్పించుకోవడానికి వేలమంది అఫ్గాన్లు విమానాశ్రయానికి చేరి తమను కూడా తీసుకువెళ్లిపోవాలంటూ శరణు కోరారు. ఈ క్రమంలో తొక్కిసలాటలు, విధ్వంసం చోటుచేసుకుని అనేకమంది అక్కడే ప్రాణాలు విడిచారు. పలువురు విమాన చక్రాలు పట్టుకుని గాలిలో రాలిపోయిన దృశ్యాలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. అయితే... ‘ఆగస్టు 15 గర్వించదగ్గ రోజు’’ అంటూ తాలిబన్లు సోమవారం వేడుకలు జరిపారు. బడులకు సెలవులు ప్రకటించారు. ‘‘దేవుడి మీద ఆధారపడటం, ప్రజల మద్దతు దేశానికి స్వేచ్ఛను, విజయాన్ని అందించాయి. అమెరికా, దాని మిత్రపక్షాల ఆక్రమణకు వ్యతిరేకంగా ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ విజయం సాధించిన రోజు’’ అని తాలిబన్‌ అధికార వార్తాసంస్థ బఖ్తర్‌ న్యూస్‌ అధిపతి అబ్దుల్‌ వాహిద్‌ రేయాన్‌ వ్యాఖ్యానించారు. అవినీతి నిర్మూలన, భద్రత పెంపు, గసగసాల సాగును నిషేధించడం... తాలిబన్‌ సర్కారు ఏడాది కాలంలో సాధించిన విజయాలుగా అఫ్గాన్‌ అధికారిక మీడియా పేర్కొంది.

అలాంటి పాలనకు గుర్తింపు ఉండదు...

మానవ హక్కులను తుంగలో తొక్కే పాలనను అంతర్జాతీయ సమాజం ఎప్పటికీ గుర్తించదని జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్‌బాక్‌ పేర్కొన్నారు. అఫ్గాన్‌ పట్ల ప్రపంచ బాధ్యత ఇంకా మిగిలే ఉందన్నారు. ‘‘అఫ్గానిస్థాన్‌, ఆ దేశ ప్రజలు సుస్థిర శాంతి, సమృద్ధితో వికసించేందుకు ఐరోపా కూటమి కృషి కొనసాగిస్తూనే ఉంటుంది’’ అని అఫ్గాన్‌లో ఈయూ ప్రత్యేక రాయబారి థామస్‌ నిక్లాసన్‌ పేర్కొన్నారు. అయితే, ఇందుకు అఫ్గాన్‌ పురుషులతో పాటు మహిళల భాగస్వామ్యం, మానవ హక్కుల పట్ల గౌరవంతో కూడిన సమగ్ర రాజకీయ విధానం అవసరమని ఆయన నొక్కి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని