Laughing gas: ‘లాఫింగ్‌ గ్యాస్‌’పై యూకే నిషేధం.. ఎందుకంటే..?

Laughing gas: యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లాఫింగ్‌ గ్యాస్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.

Updated : 08 Nov 2023 14:52 IST

లండన్‌: ‘లాఫింగ్‌ గ్యాస్‌ (Laughing gas)’గా పిలిచే నైట్రస్‌ ఆక్సైడ్‌ (Nitrous Oxide)ను వినోదభరిత కార్యకలాపాల కోసం వినియోగించడంపై బ్రిటన్‌ (Britain) ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది. ఆ డ్రగ్‌ను ఉత్పత్తి చేయడం, సరఫరా లేదా విక్రయించడం వంటివి చేస్తే.. జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆ గ్యాస్‌ కారణంగా ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘‘బహిరంగ ప్రదేశాల్లో సుదీర్ఘ కాలం ఈ పదార్థాన్ని (నైట్రస్‌ ఆక్సైడ్‌) వినియోగించడం.. సంఘ వ్యతిరేక ప్రవర్తనకు కారణమయ్యే అవకాశముంది. ఇది కమ్యూనిటీలకు, ప్రజల ఆరోగ్యానికి ముప్పు. దీన్ని మేం అంగీకరించబోం’’ అని బ్రిటన్‌ పోలీసింగ్ మినిస్టర్‌ క్రిస్‌ ఫిలిప్‌ తన అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ‘‘వాస్తవం నుంచి దూరం చేసి ఓ భ్రమలో ఉండే అనుభూతినిచ్చే ఈ పదార్థం.. ఇబ్బందికర ప్రవర్తనలకు ఆజ్యం పోస్తుంది. ప్రజల ఆరోగ్యానికి కూడా ఇది ముప్పుగా మారుతోంది’’ అని యూకే (UK) సర్కారు మరో ప్రకటనలో వెల్లడించింది.

న్యాయమూర్తిపై విరుచుకుపడిన ట్రంప్‌.. కోర్టులో వ్యంగ్యంగా వాంగ్మూలం

ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చింది. అయితే, ఆరోగ్య సంరక్షణ కోసం, ఇతర పరిశ్రమల్లో చట్టబద్ధంగా నైట్రస్‌ ఆక్సైడ్‌ను వినియోగించడంపై ఈ నిషేధం నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త నిబంధనల కింద.. ఎవరైనా ఈ లాఫింగ్‌ గ్యాస్‌ను దుర్వినియోగం చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనిష్ఠంగా రెండేళ్ల నుంచి గరిష్ఠంగా 14 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది.

బ్రిటన్‌ ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. యూకేలో 16-24 ఏళ్ల వయసు వారు అత్యధికంగా వినియోగిస్తున్న మూడో డ్రగ్‌ నైట్రస్‌ ఆక్సైడ్‌. దీనిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల రక్తహీనత బారిన పడే అవకాశమున్నట్లు ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. దీని తీవ్రత ఎక్కువైతే నరాలు దెబ్బతినడంతో పాటు పక్షవాతానికి దారితీసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలోనే లాఫింగ్‌ గ్యాస్‌ను నిషేధించాలని రిషి సునాక్‌ ప్రభుత్వం ప్రతిపాదించగా.. తాజాగా దీన్ని అమల్లోకి తెచ్చారు. వచ్చే ఏడాది యూకేలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని