Ukraine Crisis: వీసా ఉంటేనే రష్యా పౌరులకు అనుమతి.. జెలెన్‌స్కీ కీలక నిర్ణయం

ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్​ జెలెన్​స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వీసాలు ఉంటేనే రష్యా పౌరులను తమ దేశంలోకి అనుమతించనున్నట్లు ప్రకటించారు..........

Published : 17 Jun 2022 23:51 IST

కీవ్‌: ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్​ జెలెన్​స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వీసాలు ఉంటేనే రష్యా పౌరులను తమ దేశంలోకి అనుమతించనున్నట్లు ప్రకటించారు. జులై 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని టెలిగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్​ పౌరులు ఎలాంటి వీసాలు లేకుండానే ఇరు దేశాలకు వెళ్లేవారు. అయితే ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగు నెలలుగా  ఉక్రెయిన్​పై రష్యా దాడులు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే రష్యా చొరబాటును నిలువరించేలా ఆ దేశ పౌరులకు జెలెన్​స్కీ వీసా విధానాన్ని ప్రకటించారు. 1991లో సోవియట్ యూనియన్ నుండి ఉక్రెయిన్ స్వాతంత్య్రం పొందిన తర్వాత నుంచి కొనసాగుతున్న రష్యన్‌ పౌరుల వీసా రహిత రాకపోకలకు ఈ చర్య ముగింపు పలకనుంది.

మరోవైపు తమ 27 దేశాల కూటమిలో చేరేలా దరఖాస్తు చేసుకునేందుకు ఉక్రెయిన్​కు అవకాశం ఇవ్వాలని యూరోపియన్ యూనియన్ కార్యనిర్వాహక విభాగం సిఫారసు చేసింది. ఇది ఉక్రెయిన్​కు ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ.. ఈ అధికార ప్రక్రియ పూర్తికావడానికి ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఉక్రెయిన్ దరఖాస్తుకు ఈయూ కూటమిలోని అన్ని దేశాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈయూ సిఫారసులపై అవగాహన ఉన్నప్పటికీ వెనక్కి తగ్గని రష్యా.. ఉక్రెయిన్​పై భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని