USA: అమెరికాలో ‘నేషనల్‌ డే ఆఫ్‌ సెలబ్రేషన్‌’గా ఆగస్టు 15.. చట్టసభలో తీర్మానం

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని అమెరికాలో ‘నేషనల్‌ డే ఆఫ్‌ సెలబ్రేషన్‌’గా నిర్వహించాలని అక్కడి చట్ట సభలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి కొందరు అమెరికన్‌ సభ్యులు కూడా సహప్రాయోజకులుగా వ్యవహరించారు. 

Updated : 08 Aug 2023 15:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత (India) స్వాతంత్ర్య దినోత్సవాన్ని అమెరికా(USA)లో కూడా ప్రత్యేకంగా నిర్వహించుకొనేలా ఓ తీర్మానాన్ని కాంగ్రెస్‌ సభ్యుడు శ్రీ తానేదార్‌ ప్రవేశపెట్టారు. ఆగస్టు 15ను అమెరికాలో ‘నేషనల్‌ డే ఆఫ్‌ సెలబ్రేషన్‌’గా ప్రకటించాలని దీనిలో కోరారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్‌ సభ్యులు బడ్డీ కార్టర్‌, బ్రాడ్‌ షర్మాన్‌ సహ ప్రాయోజకులుగా వ్యవహరించారు. ఆ రోజును ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల్లో సంబరాల దినోత్సవంగా మార్చాలని వారు కోరారు.

అంతరిక్ష వ్యర్ధాలతో చిక్కులు..!

ఇరుదేశాలు పంచుకొనే ప్రజాస్వామ్య విలువలే బంధానికి, భాగస్వామ్యానికి మూలమని అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లి అన్ని దేశాల్లో శాంతి, స్థిరత్వం, సంపద వృద్ధిని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ తీర్మానానికి బీజం పడింది. 

అధికార దేశ పర్యటన (అఫిషియల్‌ స్టేట్‌ విజిట్‌)తో ఇరుదేశాల మధ్య విశ్వాసం, పరస్పర అవగాహన, చట్ట పాలన, మానవహక్కులను గౌరవించడం వంటి అంశాలపై అవగాహన పెరిగిందని తీర్మానంలో వెల్లడించారు. భారతీయ మూలాలున్న చాలా మంది అమెరికన్లు ప్రభుత్వ ఆధికారులుగా, సైనికులుగా, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులుగా ప్రజాజీవితాన్ని మెరుగుపరుస్తున్నారని దానిలో పేర్కొన్నారు. అమెరికా చట్టాన్ని రక్షిస్తూ.. దేశంలోని వైవిధ్యాన్ని కాపాడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో భారతీయులతో కలిసి ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి తీర్మానం ఉపయోగపడుతుందని వెల్లడించారు.

అమెరికాలో జూన్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. రక్షణ, వ్యాపార, వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో ఇరు దేశాలు మరో అడుగు ముందుకేశాయి.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని