India- Nepal: హిట్‌ నుంచి సూపర్‌ హిట్‌కు..! నేపాల్‌తో సంబంధాలపై ప్రధాని మోదీ

భారత్‌, నేపాల్‌ల మధ్య భాగస్వామ్యం ‘హిట్‌’ అయిందని, భవిష్యత్తులో దీన్ని ‘సూపర్ హిట్’ చేసే దిశగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత పర్యటనకు వచ్చిన నేపాల్‌ ప్రధాని పుష్పకమల్ దహల్‌తో గురువారం ప్రధాని మోదీ చర్చలు జరిపారు.

Updated : 01 Jun 2023 18:18 IST

దిల్లీ: భారత్‌, నేపాల్‌ల మధ్య సంబంధాల (India- Nepal Ties)ను హిమాలయాలంతా ఉన్నతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తూనే ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తెలిపారు. సరిహద్దు సమస్యలతోసహా అనేక అంశాల పరిష్కారానికి ప్రయత్నిస్తామని చెప్పారు. భారత పర్యటనకు వచ్చిన నేపాల్‌ ప్రధాని పుష్పకమల్ దహల్ ‘ప్రచండ’ (Pushpa Kamal Dahal)తో గురువారం ప్రధాని మోదీ చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం ‘హిట్‌’ అయిందని, భవిష్యత్తులో దీన్ని ‘సూపర్ హిట్’ చేసే దిశగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.

వాణిజ్యం, రవాణా, పెట్టుబడులు, విద్యుత్‌, నీటిపారుదల, పెట్రోలియం పైపులైన్‌ విస్తరణ, అనుసంధానత వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత పటిష్ఠం చేసుకునే మార్గాలపై చర్చించినట్లు ఇరు నేతలు తెలిపారు. ఈ సందర్భంగా రవాణా, పెట్రోలియం పైపులైన్‌ విస్తరణ, సమీకృత చెక్‌పోస్టుల అభివృద్ధి, జలవిద్యుత్‌ తదితర రంగాల్లో ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశారు. భారత్‌లోని రూపయిడిహా, నేపాల్‌లోని నేపాల్‌గంజ్‌లో సమీకృత చెక్‌పోస్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. బిహార్‌లోని బథ్‌నాహా నుంచి నేపాల్ కస్టమ్ యార్డ్ వరకు ఓ సరకు రవాణా రైలుకు పచ్చజెండా ఊపారు.

‘2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లో నేపాల్‌లో పర్యటించా. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య సంబంధాల విషయంలో ‘హిట్ (హైవేస్, ఐ-వేస్, ట్రాన్స్-వేస్)’ ఫార్ములా ఇచ్చా. మా భాగస్వామ్యం ‘హిట్’ అయిందని చెప్పేందుకు గర్వపడుతున్నా’ అని మోదీ అన్నారు. సాంస్కృతిక, మతపర అనుబంధాన్ని మరింత పెంపొందించేందుకుగానూ.. రామాయణ సర్క్యూట్‌కు సంబంధించిన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. భారత్‌ అవలంబిస్తోన్న ‘పొరుగు దేశానికి తొలి ప్రాధాన్యం’ విధానాన్ని ప్రచండ ఈ సందర్భంగా కొనియాడారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆయన బుధవారం భారత్‌కు చేరుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని