
తాజా వార్తలు
అరంగేట్రం ఆటగాళ్లకు కొత్త కార్లు
భారత ఆటగాళ్లను ఆశ్చర్యపర్చిన ఆనంద్ మహీంద్ర
ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఆరుగురు టీమ్ఇండియా ఆటగాళ్లను ప్రశంసించడంతో పాటు.. ఖరీదైన బహుమతులతో వారిని ఆశ్చర్యపర్చారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో అరంగేట్రం చేసి అత్యుత్తమ ప్రదర్శన చేసిన శార్దూల్ ఠాకుర్(గతంలో ఒక మ్యాచ్ ఆడి గాయపడ్డాడు), మహ్మద్ సిరాజ్, శుభ్మన్గిల్, నవ్దీప్ సైని, వాషింగ్టన్ సుందర్, నటరాజన్లకు తమ కంపెనీ నుంచి THAR SUV కార్లను బహుమతులుగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆరుగురూ తమ జీవితాల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారని, వీరివి నిజ జీవిత విజయగాథలని కొనియాడారు. అసాధ్యాలను సుసాధ్యం చేసుకునేలా భావి భారత పౌరులకు ఆదర్శంగా నిలిచారని మహీంద్ర కొనియాడారు. యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే వీరిని బహుమతులతో ప్రోత్సహించినట్లు ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా, టీమ్ఇండియా ఆస్ట్రేలియాతో ఆడిన బోర్డర్-గావస్కర్ సిరీస్లో ఈ యువ ఆటగాళ్లు ప్రతీ ఒక్కరూ తమ శక్తి మేరా రాణించారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని తొలి పర్యటనలోనే ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే సిరాజ్ నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీయగా, నటరాజన్ అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసి మంచి ప్రదర్శన చేశాడు. అలాగే వాషింగ్టన్ సుందర్(62), శార్దూల్ ఠాకుర్(66) చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో అర్ధశతకాలతో రాణించారు. దాంతో ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని 33 పరుగులకు తగ్గించారు. ఇక శుభ్మన్ గిల్ తన బ్యాటింగ్తో పలు అర్ధశతకాలు సాధించాడు. నవ్దీప్ బౌలింగ్ దళంలో తనవంతు పాత్ర పోషించాడు. దాంతో టీమ్ఇండియా 2-1 తేడాతో కంగారూలపై మరోసారి చారిత్రక విజయం సాధించింది. అంతకుముందు 2018-19 సీజన్లోనూ భారత్ ఆస్ట్రేలియాపై బోర్డర్-గావస్కర్ ట్రోఫీ గెలుపొందిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి..
‘ఏం కావాలంటే అది చేసుకోండి.. మేం వెళ్లం’
చిరకాల కోరిక నెరవేర్చుకున్న సిరాజ్..!