ఎస్ఐ కొలువులకు మీరు సిద్ధమేనా?
తెలుగు రాష్ట్రాల యువత ఎక్కువమంది ఆసక్తి చూపే కొలువుల్లో ఖాకీ పోస్టులదే పైచేయి. ఇప్పుడు వీరికి కేంద్రంలో ఎస్ఐ ఉద్యోగానికి పోటీపడే అవకాశమొచ్చింది. కేంద్ర సాయుధ దళాలైన బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్లతోపాటు దిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన వెలువడింది.
4187 ఖాళీలు
తెలుగు రాష్ట్రాల యువత ఎక్కువమంది ఆసక్తి చూపే కొలువుల్లో ఖాకీ పోస్టులదే పైచేయి. ఇప్పుడు వీరికి కేంద్రంలో ఎస్ఐ ఉద్యోగానికి పోటీపడే అవకాశమొచ్చింది. కేంద్ర సాయుధ దళాలైన బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్లతోపాటు దిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన వెలువడింది. అన్ని విభాగాల్లోనూ 4187 ఖాళీలున్నాయి. డిగ్రీ విద్యార్హతతో వీటికి పోటీ పడొచ్చు. పరీక్ష, పీఎస్టీ, పీఈటీ, వైద్య పరీక్షలతో నియామకాలుంటాయి. శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. మొదటి నెల నుంచే రూ.60 వేలకు పైగా వేతనం అందుకోవచ్చు!
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లతోపాటు దిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ల ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దాదాపు ఏటా ప్రకటన విడుదల చేస్తుంది. ఇందులో ఉత్తీర్ణులైనవాళ్లు.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్), సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)ల్లో ఎందులోనైనా, దేశంలో ఎక్కడి నుంచైనా విధులు నిర్వర్తించవచ్చు. దిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐ అవకాశం వచ్చినవారు దిల్లీ పరిధిలోనే కొనసాగవచ్చు.
ఏ విభాగంలో అవకాశం వచ్చినప్పటికీ వేతనం, ప్రోత్సాహకాలు అందరికీ ఒకేలా ఉంటాయి. వీరికి లెవెల్-6 జీతం అందుతుంది. అంటే రూ.35,400 మూలవేతనం, దీనికి డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం. అన్నీ కలిపి మొదటి నెల నుంచే వీరు రూ.60 వేలకు పైగా పొందవచ్చు. 10-15 ఏళ్ల సర్వీస్తో ఇన్స్పెక్టర్ హోదాకు, అనంతరం అనుభవం, ప్రతిభ ప్రాతిపదికన అసిస్టెంట్ కమాండెంట్, డిప్యూటీ కమాండెంట్, కమాండెంట్, సీనియర్ కమాండెంట్ స్థాయికి చేరుకోవచ్చు. ఈ పోస్టులకు సొంత రాష్ట్రంలో విధులు నిర్వర్తించే అవకాశం తక్కువ. ఇదొక్కటే ప్రతికూలత.
ఎంపిక
ముందు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి దేహదార్ఢ్య పరీక్షలు ఉంటాయి. వీటిలో విజయవంతులైనవారికి పేపర్-2 రాయడానికి అవకాశమిస్తారు.పేపర్-1, 2 రెండింటిలోనూ వచ్చిన మార్కులు కలిపి మెరిట్, రిజర్వేషన్ ప్రకారం అర్హులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులో ఎలాంటి సమస్యలూ లేనివారికి మెరిట్, ఎంచుకున్న ప్రాధాన్యం ప్రకారం సంబంధిత విభాగాల్లో శిక్షణకు తీసుకుంటారు. దాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు విధుల్లో కొనసాగుతారు.
పరీక్ష
ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ వీటిలో ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. సెక్షన్ల వారీ కటాఫ్ ఉంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 200 మార్కులకు పేపర్-2 నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. రెండు పేపర్లలోనూ తప్పు సమాధానానికి పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్షలో అర్హతకు ప్రతి పేపర్లోనూ జనరల్ అభ్యర్థులు 30 శాతం, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 25 శాతం, ఎస్సీ, ఎస్టీలు 20 శాతం మార్కులు పొందాలి. అర్హుల జాబితా నుంచి విభాగాల వారీ మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం తర్వాతి దశకు ఎంపిక చేస్తారు. ఎన్సీసీ సీ సర్టిఫికెట్ ఉంటే 10, బీ ఉన్నవారు 6, సీతో 4 మార్కులు అదనంగా పొందవచ్చు.
పీఈటీ
పురుషులు వంద మీటర్ల దూరాన్ని 16, మహిళలు 18 సెకన్లలో చేరుకోవాలి. 1.6 కి.మీ. పరుగును పురుషులు 6.5 నిమిషాల్లో, 800 మీటర్లను మహిళలు 4 నిమిషాల్లో పూర్తిచేయాలి. పురుషులు 3 ప్రయత్నాల్లో ఒక్కసారైనా 3.65 మీటర్ల దూరానికి దూకాలి. మహిళలు 3 ప్రయత్నాల్లో కనీసం ఒకసారి 2.7 మీటర్ల దూరం అధిగమించాలి. హైజంప్లో పురుషులు 1.2 మీటర్ల ఎత్తుకు 3 ప్రయత్నాల్లో ఒకసారైనా ఎగరాలి. మహిళలు 0.9 మీటర్ల ఎత్తుకు చేరుకోవాలి. పురుషులు షాట్పుట్ 3 ప్రయత్నాల్లో 16 ఎల్బీఎస్ (సుమారు 7.257 కి.గ్రా.) గుండును 4.5 మీ. దూరానికి విసరాలి. మహిళలకు షాట్పుట్ మినహాయించారు. పీఈటీకి మార్కులు లేనప్పటికీ, నిర్దేశిత లక్ష్యాలు పూర్తిచేస్తేనే పేపర్-2కు అవకాశం ఉంటుంది.
ఏ విభాగంలో ఏవి?
జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్: క్లాసిఫికేషన్, ఎనాలజీ, డేటా సఫిషియన్సీ, పజిల్స్, ఆల్ఫబెట్స్ (వర్డ్ టెస్టు), వెన్ డయాగ్రామ్స్, సిరీస్, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, మిస్సింగ్ నంబర్, కోడింగ్ డీకోడింగ్, ఆర్డరింగ్ అండ్ ర్యాంకింగ్ అంశాలను చదవాలి.
జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్: సైన్స్ అండ్ టెక్నాలజీ, వర్తమాన వ్యవహారాలు (జాతీయ, అంతర్జాతీయ), హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీలకు ఎక్కువ ప్రాధాన్యం.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: డేటా ఇంటర్ప్రెటేషన్, ట్రిగనోమెట్రీ, సింప్లిఫికేషన్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, జామెట్రీ, ఆల్జీబ్రా, ప్రాఫిట్ అండ్ లాస్, మెన్సురేషన్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, మిక్స్చర్ ప్రాబ్లమ్స్, నంబర్ సిస్టమ్ బాగా చదవాలి.
ఇంగ్లిష్ కాంప్రహెన్షన్: వొకాబ్యులరీ (క్లోజ్ టెస్టు, సిననిమ్స్, యాంటనిమ్స్, స్పెల్లింగ్, ఇడియమ్ మీనింగ్), ఇంగ్లిష్ గ్రామర్ (ఎర్రర్ స్పాటింగ్, ఫ్రేజ్ రీప్లేస్మెంట్, యాక్టివ్ - పాసివ్ వాయిసెస్, డైరెక్ట్ - ఇండైరెక్ట్ స్పీచ్), రీడింగ్ కాంప్రహెన్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి.
సన్నద్ధత సూత్రాలు
- ప్రకటనలోని సిలబస్ వివరాలు క్షుణ్నంగా పరిశీలించాలి. ఎస్ఐ పోస్టులకు సన్నద్ధమవుతున్నవారు ఈ పరీక్షను సులువుగానే ఎదుర్కోగలరు.
- తొలిసారి రాస్తున్నవారు ప్రాథమికాంశాల నుంచి సన్నద్ధత ప్రారంభించాలి. ప్రతి విభాగం నుంచీ రోజూ ఒక్కో అంశాన్ని చదివి, అందులో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.
- ప్రతి విభాగంలోనూ అన్ని అంశాల నుంచీ ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల సిలబస్ మొత్తం చదవడం తప్పనిసరి. ఎక్కువ ప్రశ్నలు వస్తోన్న అంశాలపై శ్రద్ధ వహించాలి. ఇలాంటి వాటికి అధిక సమయం కేటాయించి, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి.
- పాత ప్రశ్నపత్రాలను నిశితంగా గమనించాలి. వీటి ద్వారా.. ప్రశ్నలు ఏ స్థాయిలో వస్తున్నాయి, సన్నద్ధత ఎలా ఉంది, ఏ అంశాలు మరింత లోతుగా అధ్యయనం చేయాలి, వేటికి ఎంత సమయం కేటాయించాలో స్పష్టత వస్తుంది.
- పరీక్షకు ముందు కనీసం 10 నమూనా పరీక్షలు రాయాలి. జవాబులు సరిచూసుకుని, తప్పులు జరుగుతోన్న విభాగాల్లో అధ్యయనం కొనసాగించి, మెరుగుపడాలి. ముందు పరీక్షకు, తర్వాత పరీక్షకు మార్కుల్లో పురోగతి ఉండేలా చూడాలి. తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటే సన్నద్ధత సరైన మార్గంలో ఉన్నట్లే.
- సెక్షన్లవారీ కటాఫ్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి విభాగంలోనూ కనీస మార్కులు పొందడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. కష్టమైన విభాగాలకు అదనపు సమయాన్ని కేటాయించుకోవాలి.
- మొదట పేపర్-1ను ప్రాధాన్యంతో చదవాలి. ఈ పరీక్ష తర్వాత ఉన్న వ్యవధిని ఫిజికల్ టెస్టులు, పేపర్-2 కోసం వెచ్చించాలి.
- పేపర్-2 మొత్తం ఆంగ్ల విభాగం నుంచే ఉంటుంది. ఇందులో సాధించిన మార్కులు విజయాన్ని నిర్ణయిస్తాయి. అందువల్ల దీనికి అధిక ప్రాధాన్యం ఇచ్చి పట్టు పెంచుకోవాలి.
- జవాబులు గుర్తించడానికి ఎక్కువ సమయం అవసరమయ్యే ప్రశ్నలు ఆఖరులో సమయం మిగిలితే సాధించాలి. ఎలిమినేషన్ టెక్నిక్ ఉపయోగపడుతుంది.
- రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియనివి వదిలేస్తేనే నష్టం జరగకుండా ఉంటుంది.
- వర్తమాన వ్యవహారాల్లో విజయానికి ఆగస్టు 2023 నుంచి వివిధ రంగాల్లో జాతీయం, అంతర్జాతీయంగా జరుగుతోన్న ముఖ్య పరిణామాలను నోట్సు రాసుకోవాలి. అవార్డులు, పురస్కారాలు, వార్తల్లో వ్యక్తులు, నియామకాలు, పుస్తకాలు-రచయితలు, తాజా పరిశోధనలు, క్రీడలు, ప్రాదేశిక రక్షణ, పోలీస్ వ్యవస్థ, సైబర్ సెక్యూరిటీ అంశాలు బాగా చదవాలి.
- ప్రతి విభాగానికీ ఒకటి చొప్పున ఏదైనా మంచి పుస్తకాన్ని తీసుకుని, దాన్నే బాగా సాధన చేయాలి.
ముఖ్య సమాచారం
ఖాళీలు: 4187. వీటిలో సీఏపీఎఫ్ల్లో 4001 ఉన్నాయి. విభాగాల వారీ.. సీఐఎస్ఎఫ్ 1597, సీఆర్పీఎఫ్ 1172, బీఎస్ఎఫ్ 892, ఐటీబీపీ 278, ఎస్ఎస్బీ 62. దిల్లీ పోలీస్.. పురుషులకు 125, మహిళలకు 61. (దిల్లీ పోలీస్ పురుషుల విభాగంలో ఖాళీలకు పోటీ పడేవారికి ఎల్ఎంవీ (మోటార్సైకిల్ అండ్ కార్) లైసెన్స్ తప్పనిసరి.
అర్హత: ఏదైనా డిగ్రీ.
వయసు: ఆగస్టు 1, 2024 నాటికి 25 ఏళ్లలోపుండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసు మినహాయింపు.
శారీరక ప్రమాణాలు: పురుషులు 170, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్టీలైతే పురుషులు 162.5, మహిళలు 154 సెం.మీ. ఉన్నా చాలు. ఊపిరి పీల్చిన తర్వాత కనీసం 85 సెం.మీ, పీల్చక ముందు 80 సెం.మీ. ఛాతీ విస్తీర్ణం పురుషులకు ఉండాలి.
ఆన్లైన్ దరఖాస్తులు: మార్చి 28 రాత్రి 11 గంటల వరకు స్వీకరిస్తారు.
ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు మినహాయించారు.
కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు: మే 9, 10, 13 తేదీల్లో.
వెబ్సైట్: https://ssc.nic.in/
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి