ఈ కొలువులు ఐపీఎస్‌తో సమానం!

డిగ్రీ అర్హతతో అత్యున్నత ఉద్యోగాన్ని సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. సాయుధ దళాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) ప్రకటన విడుదల చేసింది.

Updated : 20 Apr 2021 10:59 IST

డిగ్రీతో అసిస్టెంట్‌ కమాండెంట్‌

డిగ్రీ అర్హతతో అత్యున్నత ఉద్యోగాన్ని సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. సాయుధ దళాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్టు, ముఖాముఖిలో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరినవారు ఆకర్షణీయ వేతనంతోపాటు అత్యున్నత హోదాలు అందుకోవచ్చు. తాజా ప్రకటన పూర్తి వివరాలు చూద్దాం!

యూనిఫారం ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవారు దృష్టి సారించాల్సిన వాటిలో సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌) అసిస్టెంట్‌ కమాండెంట్స్‌ (ఏసీ) పోస్టులు ముఖ్యమైనవి. అంతర్గత భద్రత ప్రధాన లక్ష్యంగా ఈ ఉద్యోగాలను రూపొందించారు. వీటికి ఎంపికైనవారు సాయుధ బలగాలు..బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్సు (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సు (సీఆర్‌పీఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్సు (సీఐఎస్‌ఎఫ్‌), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్సు (ఐటీబీపీ), సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ)లో విధులు నిర్వర్తిస్తారు. వీరికి గ్రూప్‌-ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌ హోదా దక్కుతుంది. సివిల్‌ సర్వీసు ద్వారా ఐపీఎస్‌కు ఎంపికైనవారితో సమాన స్థాయి ఉన్న పోస్టులివి. అందువల్ల పాతికేళ్లలోపు వయసున్న పట్టభద్రులంతా వీటికి పోటీపడవచ్చు. మహిళలకూ అవకాశం ఉంది.  

పరీక్ష ఇలా..

ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్‌కు 250 మార్కులు. పరీక్ష వ్యవధి 2 గంటలు. జనరల్‌ ఎబిలిటీ అండ్‌ ఇంటలిజెన్స్‌ అంశాల నుంచి 125 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన జవాబుకు మూడో వంతు మార్కులు తగ్గిస్తారు. పేపర్‌ 2 మొత్తం 200 మార్కులకు డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. వ్యవధి 3 గంటలు. ఇందులో జనరల్‌ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేపర్‌ 1లో అర్హత సాధిస్తేనే పేపర్‌ 2 మూల్యాంకనం చేస్తారు. పేపర్‌ 2లో కనీసం 25 శాతం అంటే 50 మార్కులు పొందడం తప్పనిసరి.


ఫిజికల్‌..

పరీక్షలో అర్హత సాధించినవారికి ఫిజికల్‌ స్టాండర్డ్‌ / ఫిజికల్‌ ఎఫిషియన్సీ పరీక్షలు నిర్వహిస్తారు. పురుషులు 165 సెం.మీ. ఎత్తు, 50 కి.గ్రా. బరువు ఉండాలి. ఛాతీ విస్తీర్ణం 81 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చిన తర్వాత 5 సెం.మీ. పెరగాలి. మహిళలు 157 సెం.మీ. ఎత్తు, 46 కి.గ్రా. బరువు తప్పనిసరి. వంద మీటర్ల దూరాన్ని పురుషులు 16, మహిళలు 18 సెకన్లలో పూర్తిచేయాలి. అనంతరం 800 మీటర్ల దూరాన్ని పురుషులు 3 నిమిషాల 45 సెకన్లలో, మహిళలు 4 నిమిషాల 45 సెకన్లలో చేరుకోవాలి. లాంగ్‌ జంప్‌లో పురుషులు మూడు ప్రయత్నాల్లో కనీసం ఒకసారి 3.5 మీటర్లు, మహిళలు 3 మీటర్లు దూరం దూకాలి. షాట్‌పుట్‌లో 7.26 కి.గ్రా. గుండును పురుషులు 4.5 మీటర్ల దూరానికి విసరాలి. మహిళలకు షాట్‌పుట్‌ లేదు.


ఇంటర్వ్యూ..

ఫిజికల్‌ టెస్టుల్లో అర్హత సాధించినవారికి మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే ముఖాముఖికి పిలుస్తారు. ఇంటర్వ్యూకి 150 మార్కులు కేటాయించారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది నియామకాలు చేపడతారు.

శిక్షణ.. విధులు..

ఎంపికైనవారికి సంబంధిత విభాగానికి చెందిన కేంద్రాల్లో ఏడాది పాటు శిక్షణ నిర్వహిస్తారు. ఉదాహరణకు సీఐఎస్‌ఎఫ్‌లో అవకాశం పొందినవారు నేషనల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ అకాడెమీ (ఎన్‌ఐఎస్‌ఎ)- హైదరాబాద్‌లో 53 వారాల ప్రాథమిక శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారు ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తిస్తారు. ఇందులో భాగంగా దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన కార్యకలాపాల్లో పాలు పంచుకుంటారు. ముఖ్యంగా నక్సలైట్లు, ఉగ్రవాదులు, మావోయిస్టుల కదలికలను కనిపెడుతూ ప్రమాదం ఉన్నచోట ప్రత్యక్షమవుతారు. చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి వ్యూహరచన చేస్తారు. అవసరమైన చోట ఎన్నికల విధులను సైతం నిర్వర్తిస్తారు. సరిహద్దుల్లో జరుగుతోన్న అభివృద్ధి కార్యక్రమాల్లోనూ భాగమవుతారు. వీరికి రూ.56,100 (లెవెల్‌ 10) మూలవేతనం లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, అలవెన్సులు కలుపుకుని మొదటి నెల నుంచే దాదాపు లక్ష రూపాయలకు పైగా జీతం అందుకోవచ్చు. నిర్ణీత వ్యవధుల్లో పదోన్నతులు పొందవచ్చు. భవిష్యత్తులో వీరు సంబంధిత విభాగానికి ప్రధానాధికారి కావచ్చు.

ప్రకటన వివరాలు

ఖాళీలు: మొత్తం 159. విభాగాల వారీగా..బీఎస్‌ఎఫ్‌ 35, సీఆర్‌పీఎఫ్‌ 36, సీఐఎస్‌ఎఫ్‌ 67, ఐటీబీపీ 20, ఎస్‌ఎస్‌బీ 1.

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత వయసు: ఆగస్టు 1, 2021 నాటికి కనిష్ఠం 20 గరిష్ఠం 25 ఏళ్లు. ఆగస్టు 2, 1996 కంటే ముందు; ఆగస్టు 1, 2001 తర్వాత జన్మించినవారు అనర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: మే 5 సాయంత్రం 6 వరకు  దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు. మిగిలినవారికి రూ. 200

పరీక్ష తేదీ: ఆగస్టు 8 తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి.

వెబ్‌సైట్‌: https://upsc.gov.in

సన్నద్ధత మెలకువలు  

1 హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, జనరల్‌ సైన్స్‌ అంశాలను ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతో పూర్తిచేసుకోవచ్చు. ఈ సబ్జెక్టుల్లో 8 నుంచి 12 తరగతుల్లోని ముఖ్యాంశాలను చదవాలి.

2 సీఏపీఎఫ్‌(ఏసీ) పాత ప్రశ్నపత్రాలు యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. వాటిని అధ్యయనం చేయాలి. ఆయా అంశాలు, విభాగాల వారీ పరీక్షలో లభిస్తోన్న ప్రాధాన్యం తెలుసుకుని అందుకు అనుగుణంగా సన్నద్ధం కావాలి.

3 వర్తమాన అంశాల కోసం ఏదైనా ఆంగ్ల పత్రికను అనుసరించాలి. ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి. గత ఏడాది జులై నుంచి జరుగుతోన్న ముఖ్య పరిణామాలపై దృష్టి సారించాలి. అవార్డులు, నియామకాలు, రచనలు, సంఘటనలు, వార్తల్లో వ్యక్తులు,  భద్రతపరమైన అంశాలను గుర్తుంచుకోవాలి.

4 జనరల్‌ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్‌ పేపర్‌ పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. అందువల్ల రాయడాన్ని అలవాటు చేసుకోవాలి. వ్యాసాన్ని బాగా రాయడానికి సమకాలీన అంశాలపై పట్టు పెంచుకోవడం ముఖ్యం. ఈ విభాగంలోని ప్రశ్నలు తాజా పరిణామాల ఆధారంగా వస్తున్నాయి. అందువల్ల పత్రికల్లో వచ్చిన నిపుణుల అభిప్రాయాలు, గుర్తింపు పొందిన సంస్థల నివేదికలు చదవాలి.

5 సన్నద్ధత పూర్తయిన తర్వాత వీలైనన్ని మాక్‌ పరీక్షలు రాయాలి.

6 ఇప్పటినుంచే పరుగు, లాంగ్‌ జంప్, షాట్‌పుట్‌ సాధన మొదలుపెట్టాలి.

పరీక్ష, ఇంటర్వ్యూల్లో 600కు గానూ 333 మార్కులు సాధించిన జనరల్‌ అభ్యర్థులు ఏదో ఒక విభాగంలో అవకాశాన్ని పొందవచ్చు. అయితే ప్రశ్నపత్ర కఠినత్వం, పోస్టుల సంఖ్యను బట్టి సాధించాల్సిన మార్కులు మారతాయి.

ఈ అంశాల్లో ప్రశ్నలు..

పేపర్‌ 1: ఈ విభాగంలో ఆరు అంశాల్లో అభ్యర్థి సమర్థతను పరీక్షిస్తారు. మెంటల్‌ ఎబిలిటీ విభాగంలో రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (న్యూమరికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌) ప్రశ్నలు వస్తాయి. జనరల్‌ సైన్స్‌లో దైనందిన జీవితంతో ముడిపడే ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఐటీ, బయోటెక్నాలజీ, పర్యావరణ అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. వర్తమాన సంఘటనలు విభాగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ప్రాధాన్యం సంతరించుకున్న వివిధ అంశాలను చదువుకోవాలి. ఇందులో భాగంగా నాగరికత, కళలు, సాహిత్యం, క్రీడలు, పాలనా విభాగాలు, వర్తకం, పరిశ్రమలు, ప్రపంచీకరణ...మొదలైనవాటికి ప్రాధాన్యం ఉంటుంది.

మరో విభాగం ఇండియన్‌ పాలిటీ అండ్‌ ఎకానమీలో దేశ రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగం, సామాజిక వ్యవస్థ, ప్రజా పరిపాలన భారత ఆర్థిక పురోగతి, ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతా సమస్యలు; మానవ హక్కులు, వాటి సూచికలు మొదలైనవాటిపై ప్రశ్నలు వస్తాయి. భారత దేశ చరిత్ర విభాగం నుంచి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలతో ముడిపడే అంశాలను ప్రశ్నిస్తారు. అలాగే జాతీయవాదం, స్వాతంత్య్రోద్యమ సంఘటనలకు సంబంధించిన ప్రశ్నలూ అడుగుతారు. చివరి అంశమైన జాగ్రఫీలో భౌతిక, సామాజిక, ఆర్థిక అంశాలకు సంబంధించిన జాతీయ, ప్రపంచ సంఘటనలకు ప్రాధాన్యం ఉంటుంది.

పేపర్‌ 2: రెండు భాగాలు ఉంటాయి. పార్ట్‌-ఎలో వ్యాసాలపై ప్రశ్నలు వస్తాయి. వీటికి 80 మార్కులు. ఇంగ్లిష్‌ లేదా హిందీ మాధ్యమంలో సమాధానం రాయాలి. ఇందులో భాగంగా ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి స్వాతంత్య్రోద్యమం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, భద్రత, మానవ హక్కులకు సంబంధించిన సంఘటనలు, ఎనలిటికల్‌ ఎబిలిటీ మొదలైన వాటిపై ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌-బిలో అభ్యర్థి ఆంగ్ల నైపుణ్యాలను పరీక్షిస్తారు. కాంప్రహెన్షన్, ప్రెసీ, లాంగ్వేజ్‌ స్కిల్స్‌ నుంచి 120 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగానికి మొత్తం ఆంగ్లంలోనే జవాబులు రాయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని