ప్రభుత్వ స్కూళ్లకు ప్రత్యేక ఉపకారం

ప్రభుత్వ, దాని అనుబంధ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం లక్ష స్కాలర్‌షిప్‌లు ఎదురుచూస్తున్నాయి. రాత పరీక్షలో ప్రతిభను ప్రదర్శిస్తే నాలుగు సంవత్సరాలపాటు ఉపకారవేతనం అందుకోవచ్ఛు

Published : 04 Sep 2019 00:29 IST

నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు

ప్రభుత్వ, దాని అనుబంధ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం లక్ష స్కాలర్‌షిప్‌లు ఎదురుచూస్తున్నాయి. రాత పరీక్షలో ప్రతిభను ప్రదర్శిస్తే నాలుగు సంవత్సరాలపాటు ఉపకారవేతనం అందుకోవచ్ఛు

ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించడానికి కేంద్ర మానవవనరుల విభాగానికి చెందిన స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ లిటరసీ విభాగం నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. వీటికి ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో చదువుతున్నవారు అర్హులు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1.5 లక్షలకు మించకూడదు. ప్రైవేటు పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, జవహర్‌ నవోదయ విద్యాలయాలు, ప్రభుత్వ గురుకులాలు, వసతితో కూడిన సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌లకు అనర్హులు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాసుకోవచ్ఛు అయితే ఏడో తరగతి పరీక్షల్లో 55 (ఎస్సీ, ఎస్టీలైతే 50) శాతం మార్కులు సాధించి ఉండాలి. నవంబరులో జరిగే పరీక్షలో ప్రతిభ చూపినవారికి తొమ్మిది నుంచి ఇంటర్‌ వరకు వరుసగా నాలుగేళ్లపాటు ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున అందిస్తారు.

రాష్ట్రాలవారీగా విద్యార్థులను ఎంపికచేస్తారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తాయి. ఎంపికైన జాబితాను కేంద్రానికి పంపుతాయి. మొత్తం లక్ష స్కాలర్‌షిప్పులను రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన విభజించారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 4087, తెలంగాణకు 2732 కేటాయించారు. వీటిలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6, బీసీఏ 7, బీసీబీ 10, బీసీసీ 1, బీసీడీ 7, బీసీఈ 4, దివ్యాంగులకు 3 శాతం దక్కుతాయి.

ప్రశ్నపత్రం తీరు

మొత్తం 180 మార్కులకు పరీక్ష ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు చొప్పున 180 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. పార్ట్‌ -1 మెంటల్‌ ఎబిలిటీలో 90 ప్రశ్నలు, పార్ట్‌-2 స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (ఎస్‌ఏటీ)లో 90 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో పార్ట్‌ వ్యవధి 90 నిమిషాలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 చొప్పున ఆప్షన్లు ఇస్తారు. రుణాత్మక మార్కులు లేవు.

మెంటల్‌ ఎబిలిటీ టెస్టులో వెర్బల్‌, నాన్‌ వెర్బల్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థి రీజనింగ్‌, క్రిటికల్‌ థింకింగ్‌ నైపుణ్యాలను పరీక్షిస్తారు. అనాలజీ, క్లాసిఫికేషన్‌, న్యూమరికల్‌ సిరీస్‌, ప్యాటర్న్‌ పర్సెప్షన్స్‌, హిడెన్‌ ఫిగర్స్‌ తదితర విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఎస్‌ఏటీ విభాగంలో అడిగే సైన్స్‌, సోషల్‌, మ్యాథ్స్‌ ప్రశ్నలు 7, 8 తరగతుల సిలబస్‌ నుంచి వస్తాయి. ఫిజిక్స్‌-12, కెమిస్ట్రీ-11, బయాలజీ-12, మ్యాథ్స్‌-20, హిస్టరీ-10, జాగ్రఫీ-10, పొలిటికల్‌ సైన్స్‌-10 ఎకనామిక్స్‌-5 చొప్పున ప్రశ్నలు వస్తాయి.

ఈ పరీక్షలో అర్హత సాధించడానికి రెండు విభాగాల్లోనూ కనీసం 40 (ఎస్సీ, ఎస్టీలు 32) శాతం మార్కులు తప్పనిసరి. అంటే జనరల్‌ అభ్యర్థులైతే ప్రతి పేపర్‌లోనూ 36, ఎస్సీ, ఎస్టీలకు 29 చొప్పున మార్కులు రావాలి. ఇలా అర్హులైన విద్యార్థుల జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం స్కాలర్‌షిప్‌లకు ఎంపికచేస్తారు. వీరికి తొమ్మిదో తరగతి నుంచి ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున ఎస్‌బీఐ ద్వారా ఖాతాలో వేస్తారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం వరకు వరుసగా నాలుగేళ్లపాటు వీటిని అందిస్తారు. ఈ స్కాలర్‌షిప్‌ కొనసాగాలంటే ప్రతి తరగతిలోనూ నిర్దేశిత మార్కులు సాధించడం తప్పనిసరి.

ముఖ్యమైన తేదీలు

* ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: ఏపీలో సెప్టెంబరు 5, తెలంగాణలో సెప్టెంబరు 6

* పరీక్ష రుసుం చెల్లించడానికి చివరి తేదీ: ఏపీలో సెప్టెంబరు 7, తెలంగాణలో సెప్టెంబరు 6

* పరీక్ష రుసుం: రూ.100. ఎస్సీ, ఎస్టీలకు రూ.50

* పరీక్ష తేదీ: రెండు రాష్ట్రాల్లోనూ నవంబరు 3

వెబ్‌సైట్‌:

ఏపీ http://home.bseap.org/nmmsjul/

తెలంగాణ http://portala.bsetelangana.org/NMMSAPPJUL/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని