రివిజన్‌కు సొంత నోట్సు

గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైంది. మరికొద్ది రోజుల్లో గ్రూప్‌-2, గ్రూప్‌-4 నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. కొత్తగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు సీనియర్లతో పోటీ పడగలమా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా సిలబస్‌పై పట్టు...

Published : 25 May 2022 00:28 IST

గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైంది. మరికొద్ది రోజుల్లో గ్రూప్‌-2, గ్రూప్‌-4 నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. కొత్తగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు సీనియర్లతో పోటీ పడగలమా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా సిలబస్‌పై పట్టు సాధించేందుకూ, పునశ్చరణ (రివిజన్‌)కూ సమయం సరిపోతుందా? అనే డైలమాలో ఉంటున్నారు. ప్రతి అంశంపై సొంతంగా నోట్సు రాసుకోవడం వల్ల భయం తగ్గి రివిజన్‌ చేయడం సాధ్యమవుతుందనీ, ఇందుకు కొన్ని పద్ధతులు అనుసరించాలనీ నిపుణులు సూచిస్తున్నారు.

రీక్షల్లో అభ్యర్థి సమాధానాలను గుర్తించేటప్పుడు, ఎగ్జామినర్లు అభ్యర్థుల విశ్లేషణాత్మక, విమర్శనాత్మక సామర్థ్యాలను గమనిస్తారు. సమయ పరిమితి ఉండటంతో అభ్యర్థులు త్వరగా, ప్రభావవంతంగా సమాధానాన్ని ఎంపిక చేయాలి. ఇందుకు షార్ట్‌ నోట్స్‌ ఎంతో ఉపయోగపడుతుంది. మొత్తం సిలబస్‌ను ప్రణాళికా బద్ధంగా చదివితే, పరీక్షకు ముందు మెటీరియల్‌ని సులభంగా రివిజన్‌ చేయడం సాధ్యమవుతుంది. పాఠ్యపుస్తకంలో రాసినవాటిని తిరిగి రాయడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. మీరు అర్థం చేసుకున్న అంశాన్ని సొంతమాటల్లో రాయడం వల్ల ఎంతో కాలం గుర్తుంటుంది. ఇందుకు కొన్ని చిట్కాలు...

రంగు-కోడెడ్‌ పద్ధతి  

అంశాన్ని ఎంచుకున్న తర్వాత మునుపటి పరీక్షల ప్రశ్నపత్రాలను జాగ్రత్తగా పరిశీలించి, పేపర్‌లలో సాధారణంగా ఏయే అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారో గుర్తించాలి. ప్రతి వరుసలో ప్రధాన అంశాలను బోల్డ్‌ కలర్‌లో హైలైట్‌ చేయాలి. చాలా ముఖ్యమైన పాయింట్‌లను వేరు చేయడానికి క్యాపిటల్‌లు, బాక్స్‌లు ఉపయోగించాలి. అండర్‌లైన్‌, స్కెచ్‌ పెన్‌తో హైలైట్‌ చేయాలి.

వర్తమాన వ్యవహారాల్లో తరచూ కొత్త పరిణామాలు సంభవిస్తుంటాయి. నోట్స్‌ని మళ్లీ రాయడానికి బదులుగా, పరిణామాలను గుర్తించేందుకు స్టికీ నోట్‌లను జోడించాలి. రాసే నోట్స్‌లో నిర్వచనాలు, సారాంశాలను స్ఫుటమైన, చిన్న వాక్యాల్లో రాయాలి.


మైండ్‌ మ్యాపింగ్‌ టెక్నిక్‌లు అనుసరించాలి
- బాలలత, పోటీ పరీక్షల నిపుణులు

అభ్యర్థులు మైండ్‌ మ్యాపింగ్‌ టెక్నిక్‌లను అనుసరించాలి. ట్రీచార్ట్‌, ఫ్లోచార్ట్‌లను వేసుకోవాలి. మొత్తం టాపిక్‌ను కవర్‌ చేసేలా ఉండాలి. విజువలైజ్‌ చేసుకోవాలి. స్వయంగా రాసుకునే నోట్స్‌ వల్ల సబ్‌కాన్షియస్‌ మైండ్‌లో అవి గుర్తుండిపోతాయి. ఎవరి షార్ట్‌ నోట్స్‌ వారే తయారుచేసుకోవాలి. ఓ పాయింట్‌ చూడగానే దాని చుట్టూ ఏం జరిగిందనే విషయం గుర్తొస్తుంది. కొంతమంది బులెట్‌ పాయింట్‌లు, కొందరు బాక్స్‌లో ఇలా ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని అవలంబిస్తుంటారు. యూట్యూబ్‌, యాప్‌లలో వచ్చే సమాచారంపై పూర్తిగా ఆధారపడకూడదు. అకడమిక్‌, తెలుగు అకాడమీ, ప్రామాణిక పుస్తకాలను చదవాలి.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని