NEET: ‘నీట్‌ పరీక్ష వాయిదా’ వేయాలని విద్యార్థుల డిమాండ్‌.. కారణమిదే!

నీట్‌(NEET UG 2023) పరీక్ష వాయిదా వేయాలంటూ పలువురు విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రిపరేషన్‌కు తగిన సమయం లేకపోవడంతో ఒత్తిడికి గురవుతున్నట్టు ట్వీట్లు చేస్తున్నారు.

Updated : 16 Apr 2023 16:19 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ (NEET UG 2023)పరీక్ష వాయిదా వేయాలంటూ పలువురు విద్యార్థుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. మే 7న 499 నగరాలు/పట్టణాల్లో ఈ పరీక్ష జరగనుండగా.. దాదాపు 21లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే, దేశంలో కరోనా కేసుల పెరుగుదల, బోర్డు పరీక్షలు ఇటీవలే పూర్తికావడంతో ప్రిపరేషన్‌కు తగిన సమయం లేకపోవడం వంటి కారణాలతో ఈ పరీక్షను నెల లేదా రెండు నెలల పాటు వాయిదా వేయాలంటూ విద్యార్థులు జాతీయ పరీక్షల మండలి (NTA)ను కోరుతున్నారు. ఈ మేరకు పీఎంవో, ప్రధాని మోదీ, ఎన్‌టీఏ డీజీ, కేంద్ర విద్యా, వైద్యశాఖ మంత్రులు, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌ తదితరులను ట్యాగ్‌ చేస్తూ పరీక్ష వాయిదా వేయాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.  ఇంటర్‌ విద్యార్థులకు ఆయా బోర్డులు ప్రిపరేషన్‌కు కేవలం ఒక నెల మాత్రమే సమయం ఇచ్చాయని.. సర్వస్వం త్యాగం చేసేందుకు సిద్ధమయ్యే భావి వైద్యులకు సంబంధించిన ఈ పరీక్ష నిర్వహించే విషయాన్ని పునరాలోచించాలని కోరుతున్నారు. దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళనకు గురవుతున్నామని.. ఈ పరీక్షను నెల రోజులు వాయిదా వేయాలంటూ మరికొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.

మన దేశంతో పాటు విదేశాల్లోని మొత్తంగా 499 నగరాలు/పట్టణాల్లో  మే 7న నీట్‌ పరీక్ష జరగనుంది. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్‌ విధానంలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. నీట్ పరీక్ష మే 7న (ఆదివారం) మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల మధ్య జరుగుతుంది. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో వెల్లడించనున్నారు.  ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గత ఐదేళ్లుగా ఈ పరీక్ష రాసేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. గతేడాది 17.64లక్షల మంది నీట్‌ యూజీ పరీక్ష రాయగా.. ఈ ఏడాది 21లక్షల మందికి పైగా  రాసే అవకాశం ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని