RRB Fee Refund: ఆర్ఆర్బీ గ్రూప్-డి పరీక్ష ఫీజు రీఫండ్.. ఇలా చేయండి!
దక్షిణ మధ్య రైల్వే(SC Railway)పరిధిలో గ్రూప్-డి పరీక్ష రాసిన అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రిఫండ్ చేయనున్నారు. ఏప్రిల్ 14న ఉదయం 10గంటల నుంచి ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా అభ్యర్థులు ఆన్లైన్లో బ్యాంకు ఖాతా నంబర్, IFSC కోడ్ తదితర వివరాలను మరోసారి అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే (SC Railway) పరిధిలో గ్రూప్-డి (లెవెల్-1, ప్రకటన నం.ఆర్ఆర్సీ 01/2019) పోస్టుల భర్తీ పూర్తయిన నేపథ్యంలో ఆర్ఆర్సీ- సికింద్రాబాద్ కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్షకు చెల్లించిన దరఖాస్తు రుసుంను అభ్యర్థుల బ్యాంకు ఖాతాల్లోకి రిఫండ్(Refund) చేయనున్నట్టు వెల్లడించింది. గతేడాది ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 11 వరకు జరిగిన కంప్యూటర్ బేస్డ్ టెస్టు(CBT)కు హాజరైన అభ్యర్థులకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టంచేసింది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 14న ఉదయం 10గంటల నుంచి ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఆన్లైన్లో బ్యాంకు ఖాతా నంబర్, IFSC కోడ్ తదితర వివరాలను మరోసారి అప్డేట్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
గత నాలుగేళ్ల వ్యవధిలో పలు బ్యాంకులు విలీనం కావడంతో IFSC కోడ్లు మారాయని.. అందువల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరోసారి అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) తెలిపింది. అభ్యర్థులు తప్పుడు వివరాలు సమర్పించడం వల్ల రిఫండ్ చేసిన మొత్తం వారి ఖాతాల్లో జమకాకపోతే అందుకు ఆర్ఆర్బీ ఎలాంటి బాధ్యత వహించవని స్పష్టంచేసింది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.500; దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్, ఎక్స్-సర్వీస్మెన్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.250 చొప్పున రిఫండ్ కానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.