శక్తి పెంపు సరిగా..

కొవిడ్‌-19 పుణ్యమాని రోగనిరోధకశక్తిని పెంచుకోవటం మీద ఆసక్తి బాగా పెరిగింది. నిరోధక శక్తి బాగుంటే ఇన్‌ఫెక్షన్లను చాలావరకు నివారించుకోవచ్చు మరి. ఇందుకోసం ఆహార పదార్థాలు, వ్యాయామం, మాత్రలు.. ఇలా ఎవరికి తోచిన మార్గాన్ని వారు అనుసరిస్తున్నారు.

Published : 15 Nov 2022 00:06 IST

కొవిడ్‌-19 పుణ్యమాని రోగనిరోధకశక్తిని పెంచుకోవటం మీద ఆసక్తి బాగా పెరిగింది. నిరోధక శక్తి బాగుంటే ఇన్‌ఫెక్షన్లను చాలావరకు నివారించుకోవచ్చు మరి. ఇందుకోసం ఆహార పదార్థాలు, వ్యాయామం, మాత్రలు.. ఇలా ఎవరికి తోచిన మార్గాన్ని వారు అనుసరిస్తున్నారు. ఇవి రోగనిరోధకశక్తి పెరగటానికి తోడ్పడే మాట నిజమే అయినా సరైన పద్ధతిని పాటించటమూ ముఖ్యమే. కేవలం మాత్రల మీదే ఆధారపడటం కన్నా సరైన ఆహారం పైనా దృష్టి సారించాలి.

విటమిన్‌ సి మాత్రలు

ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందినవి ఇవే. విటమిన్‌ సి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయటానికి తోడ్పడుతుందన్నది కొత్త విషయమేమీ కాదు. అయితే వీటిని విచ్చలవిడిగా, డాక్టర్‌ సలహా లేకుండా వాడుకోవటం తగదు. విటమిన్‌ సి మాత్రలను ఎక్కువ మోతాదులో తీసుకుంటే హానికరంగా పరిణమించే ప్రమాదం లేకపోలేదు. మాత్రల రూపంలో కన్నా దీన్ని ఆహారం ద్వారా పొందేలా చూసుకుంటే ఇంకా మంచిది. ఆహారం ద్వారా అందే విటమిన్‌ను శరీరం బాగా స్వీకరిస్తుంది. ఆహారం ద్వారానైతే తగినంత మోతాదులో లభించేలా చూసుకోవచ్చు కూడా. విటమిన్‌ సి మితిమీరటం వల్ల తలెత్తే అతి మూత్రం వంటి దుష్ప్రభావాలు తలెత్తకుండా జాగ్రత్త పడొచ్చు.

సమతుల జీవనశైలీ..

సమతులాహారమే కాదు.. సమతుల జీవనశైలి కూడా ముఖ్యమే. తగినంత నిద్ర, విశ్రాంతితో ఒంట్లో నిరోధక శక్తి ఇనుమడిస్తుందని అధ్యయనాలు నొక్కి చెబుతున్నాయి. కమం తప్పకుండా వ్యాయామం చేయటం, ఉద్యోగం-నిత్య జీవన వ్యవహారాలను చక్కగా సమన్వయం చేసుకోవటమూ మేలు చేస్తుంది. యోగా కూడా ముఖ్యమే. ఇదీ రోగనిరోధకశక్తి ఇనుమడించటానికి తోడ్పడుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ధారాళంగా గాలి వీచే పరిశుభ్రమైన వాతావరణంలో గడపటమూ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది జబ్బుల నుంచి త్వరగా కోలుకోవటానికి, రోగనిరోధక శక్తి పెంపొందటానికి దోహదం చేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.

పుల్లటి పండ్లు మాత్రమే కాదు

మన భారతీయ వంటకాల వైవిధ్యమే వేరు. వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు అందించే ఆహార పదార్థాలు ఎన్నెన్నో. నిమ్మకాయలు, బత్తాయి వంటి పుల్లటి పండ్లలోనే విటమిన్‌ సి ఉంటుందని.. ఇవి మాత్రమే రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంటాయని చాలామంది అపోహ పడుతుంటారు. నిజానికి ఇతర పదార్థాల్లోనూ విటమిన్‌ సి ఉంటుంది. ఉదాహరణకు- ఎర్ర క్యాప్సికంలో మనకు రోజుకు అవసరమైన దానికన్నా ఇంకా 50% ఎక్కువగానే విటమిన్‌ సి ఉంటుంది. వెల్లుల్లిలోని సల్ఫ్యూరిక్‌ సమ్మేళనాలు రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడేలా చేస్తాయి. అలాగే విటమిన్‌ ఎ దండిగా ఉండే క్యారెట్లు సైతం నిరోధక శక్తిని గణనీయంగా పెంచుతాయి. పిల్లలకైతే అరటి పండ్లు, చిలగడ దుంపలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. వీటిల్లో విటమిన్‌ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇది లోపిస్తే రోగనిరోధకశక్తి చతికిల పడుతుంది మరి.

సూపర్‌ఫుడ్స్‌ మోజు

సూపర్‌ఫుడ్స్‌ మీద మోజు బాగా పెరిగింది. కొందరు వీటిని జబ్బులన్నింటికీ పరిష్కార మార్గంగానూ భావిస్తుంటారు. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే- సూపర్‌ఫుడ్‌ అనేది పోషక మాత్రల వినియోగాన్ని ప్రోత్సహించటానికి పుట్టించిన పదమని. వీటితో కూడిన మాత్రలు ప్రధానంగా రోగనిరోధకశక్తి పుంజుకోవటానికి ప్రేరకాలుగానే పనిచేస్తాయని తెలుసుకోవాలి. వీటిని ఔషధాలుగా వాడటం తగదు. మరి ప్రత్యామ్నాయమేదైనా ఉందా? లేకేం.. రకరకాల పండ్లు, కూరగాయలతో పళ్లాన్ని రంగురంగులతో శోభిల్లేలా చూసుకోవటమే. దీంతో శరీరానికి అవసరమైన అన్నిరకాల పోషకాలు అందుతాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థ బలోపేతం కావటానికి తోడ్పడతాయి. సూపర్‌ఫుడ్‌ మాత్రల మీద ఆధారపడటంతో పోలిస్తే ఇలాంటి ఆహారం మరింత మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది.

అందరికీ ఒక్కటేనా?

మన శరీరాలు వేరు. అవసరాలు వేరు. కాబట్టి అందరినీ ఒకే గాటన కట్టేయటం, ఒకే పద్ధతి ఉపయోగపడుతుందని చెప్పటం తప్పు. ఆహార పదార్థాల విషయంలో అందరికీ ఒకే పరిష్కారమనేది లేదని తెలుసుకోవాలి. కాబట్టి ఏవైనా మాత్రలు, ఆహార పద్ధతులు పాటించే ముందు వాటితో లభించే పోషకాల మోతాదులను గుర్తించాలి. వాటిని శరీరం ఎంతవరకు స్వీకరిస్తుందో కూడా చూసుకోవాలి. ఉదాహరణకు- పసుపు పాలనే చూడండి. పాలలో పసుపు వేసి మరిగించి, తాగితే రోగనిరోధకశక్తి పుంజుకుంటుందని నమ్ముతుంటారు. అయితే పాలలోని లాక్టోజ్‌ పడనివారికిది కీడు చేస్తుంది. అలాగే కొందరు కొన్ని రకాల పదార్థాలకు దూరంగా ఉండాల్సి రావొచ్చు. ఉదాహరణకు- గౌట్‌ బాధితులు మాంసాహార ప్రొటీన్‌ తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆహార నిపుణులను సంప్రదించి ఎవరికి ఎలాంటి ఆహారం సరిపడుతుందో తెలుసుకొని, ఆయా పద్ధతులను పాటించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని