మురుగును మింగి మొక్కలను పెంచే ఎస్టీపీ

మురుగునీటి శుద్ధి కేంద్రం(ఎస్టీపీ) పక్కనే మంచం వేసుకుని పడుకోవచ్చు. నిశ్చింతగా గాలి పీల్చుకోవచ్చు. తనివితీరా పచ్చందాలను తిలకించవచ్చు. బ్లూ డ్రాప్‌ సంస్థకు చెందిన ‘ఏరియేటెడ్‌ వెట్‌ల్యాండ్‌’ సాంకేతికతతో ఏర్పాటయ్యే మురుగునీటి శుద్ధి కేంద్రాలతో అది సాధ్యం.

Published : 01 Apr 2023 00:42 IST

ఈనాడు, హైదరాబాద్‌

మురుగునీటి శుద్ధి కేంద్రం(ఎస్టీపీ) పక్కనే మంచం వేసుకుని పడుకోవచ్చు. నిశ్చింతగా గాలి పీల్చుకోవచ్చు. తనివితీరా పచ్చందాలను తిలకించవచ్చు. బ్లూ డ్రాప్‌ సంస్థకు చెందిన ‘ఏరియేటెడ్‌ వెట్‌ల్యాండ్‌’ సాంకేతికతతో ఏర్పాటయ్యే మురుగునీటి శుద్ధి కేంద్రాలతో అది సాధ్యం. సంప్రదాయ ఎస్టీపీలకు దీటుగా.. మెరుగైన ఫలితాలతో.. పరిశ్రమలో కొత్త చిగురు తొడుగుతోన్న బ్లూడ్రాప్‌ ఎన్విరో సంస్థను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రీ అవార్డుతో సత్కరించింది. ఎస్టీపీలంటే దుర్వాసన, వికారం, అధిక ఖర్చు, నిర్వహణ కష్టమనే మాటలు వినిపిస్తాయి. అవన్నీ సంప్రదాయ ఎస్టీపీలతో తలెత్తుతోన్న సమస్యలు. వేర్వేరు దశల్లో మురుగునీటిని ప్రవహింపజేస్తూ, ప్రవాహంపైనే మొక్కలను పెంచి, దుర్వాసనను సమాధి చేసే కొత్త తరం ఎస్టీపీలు నగరంలో క్రమంగా విస్తరిస్తున్నాయి.

పార్ట్‌మెంట్లుగానీ, గేటెడ్‌ కమ్యూనిటీలుగానీ ఇళ్ల సంఖ్య వందకు మించితే.. అదే ప్రాంగణంలో ఎస్టీపీ ఉండాలి. అప్పుడే సదరు నిర్మాణ ప్రాజెక్టుకు నివాసయోగ్యపత్రం(ఓసీ) అందుతుంది. తనఖా పెట్టిన ఇళ్లను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ నిబంధన ఉండటంతో.. ఆ కోవలోని అన్ని భవన సముదాయాలు, విల్లా కమ్యూనిటీల్లో నిర్మాణ సంస్థలు ఎస్టీపీలను నిర్మిస్తున్నాయి. ఓసీ  జారీ అయ్యాక.. ఎస్టీపీలను స్థానిక అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్లకు అప్పగిస్తున్నాయి. సంఘాల పెద్దలు కొన్ని నెలల పాటు ఎస్టీపీలను నడిపించి, విద్యుత్తు ఛార్జీ, దుర్వాసన, ఇతరత్రా సమస్యలతో వాటిని నిలిపేస్తున్నారు. కొన్నిచోట్ల ఎస్టీపీలు నడుస్తున్నప్పటికీ.. శుద్ధి అయిన నీటిలో కాలుష్య కారకాలు అలాగే ఉంటున్నాయి. రాజధానిలోని 90శాతం ఎస్టీపీలు అలాగే ఉన్నాయనేది నిపుణుల అంచనా. ఈ నేపథ్యంలో అమెరికా, ఆస్ట్రేలియా, డెన్మార్క్‌, తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో విజయవంతంగా నడుస్తోన్న ప్రకృతి ఆధారిత ఎస్టీపీలపై అధ్యయనం చేశామని, వాటిని మరింత మెరుగుపరిచి ‘ఏరియేటెడ్‌ వెట్‌ల్యాండ్‌’ సాంకేతికతను రూపొందించామని బ్లూడ్రాప్‌ ఎన్విరో సంస్థ ఎండీ, సీఈఓ గ్యాంజెస్‌ రెడ్డి చెబుతున్నారు. ప్రకృతిలో కాలువల ద్వారా ప్రవహించే నీటిని, కాలువల్లోని మొక్కలే శుద్ధి చేస్తాయి. ఆ సూత్రానికి, శాస్త్రీయత, ఇంజినీరింగ్‌ను జోడించి తక్కువ ఖర్చుతో, ఎక్కువ కాలం పనిచేసే ఎస్టీపీలకు రూపకల్పన చేస్తున్నామని, హైదరాబాద్‌ కేంద్రంగా ఇప్పటికే 70 కేంద్రాలను విజయవంతంగా నడిపిస్తున్నామని ఆయన వెల్లడించారు. శంషాబాద్‌ సమీపంలోని కన్హ శాంతివనంలో, హైటెక్‌సిటీలోని సీఐఐ ఐజీబీసీ కేంద్రంలో, గీతం యూనివర్సిటీ, హకీంపేటలోని ఎన్‌ఐఎస్‌ఎఫ్‌ వంటి పలు సంస్థల్లో, మోకిలాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో, డెక్కన్‌ సిమెంట్స్‌ వంటి పరిశ్రమల్లో తమ సాంకేతికత మెరుగ్గా పనిచేస్తోందని గ్యాంజెస్‌ రెడ్డి వివరించారు.

పనితీరు ఇలా..

ఏరియేటెడ్‌ వెట్‌ల్యాండ్‌ సాంకేతికతతో పనిచేసే ఎస్టీపీలో మూడు రకాల నిర్మాణాలుంటాయి. అవి వెట్‌వెల్‌, హోల్డింగ్‌ ట్యాంక్‌, వెట్‌ బెడ్‌. భవన సముదాయంలో ఉత్పత్తయ్యే మొత్తం మురుగు వెట్‌ వెల్‌కు చేరుతుంది. అందులో కొన్ని రకాల జీవ రసాయనాలను కలుపుతారు. మురుగులోని ఘన వ్యర్థాలన్నీ విచ్ఛిన్నమై నీటిలో కలిసిపోతాయి. కొంత ఎత్తు నుంచి వెట్‌వెల్‌లోని మురుగు ఎప్పటికప్పుడు పక్కనున్న హోల్డింగ్‌ ట్యాంక్‌కు చేరుతుంది. ఇందులోని మురుగు నీటిలో బాక్టీరియా వృద్ధి చెందేందుకు యంత్రంతో గాలిని అందిస్తారు. హోల్డింగ్‌ ట్యాంక్‌లో ఓ మట్టం నుంచి మురుగునీరు ఎప్పటికప్పుడు పక్కనున్న వెట్‌బెడ్‌కు చేరుతుంది. శుద్ధి ప్రక్రియలో ఇదే కీలకం. వెట్‌ బెడ్‌ అడుగున దళసరి ప్లాస్టిక్‌ కవరు ఉంటుంది. దానిపై కొంత ఎత్తులో గాలిని సరఫరా చేసే పైపులు, వాటిపైన కొంత ఎత్తులో కంకర, కొద్దిపాటి మట్టి ఉంటాయి. ఉపరితలంపై నీటిలో పెరిగే కొన్ని ప్రత్యేక జాతుల మొక్కలను నాటుతారు. హోల్డింగ్‌ ట్యాంకు నుంచి వెట్‌బెడ్‌లోకి వచ్చే నీటిలో అప్పటికే కొంత బాక్టీరియా ఉంటుంది. అది మరింతగా వృద్ధి చెందేందుకు. వెట్‌బెడ్‌ అడుగున ఉన్న గాలి పైపులు ఉపయోగపడతాయి. మొక్కల వేర్ల దగ్గరుండే బాక్టీరియా.. నీటిలోని మలినాలను, రకరకాల వ్యర్థాలను పోషకాలుగా మార్చుతాయి. ఆయా పోషకాలను మొక్కలు ఆహారంగా తీసుకుని పచ్చగా పెరుగుతాయి. ఉత్పత్తయ్యే మురుగునీటి పరిమాణం ఆధారంగా వెట్‌వెల్‌, హోల్డింగ్‌ ట్యాంకు, వెట్‌ బెడ్‌లను ఎంత విస్తీర్ణంలో నిర్మించాలనే అంశం ఆధారపడి ఉంటుంది.

ప్రమాణాలకు మించి..

వెట్‌బెడ్‌లోని మొక్కలు మురుగునీటిలోని వ్యర్థాలను ఆహారంగా తీసుకోవడంతో నీరు స్వచ్ఛంగా మారుతుంది. నిర్ణీత సమయం తర్వాత శుద్ధి అయిన నీటిని బయటకు వదులుతారు. అలా వచ్చిన నీరు.. స్వచ్ఛమైన నీటికి సమానంగా ఉందా, లేదా అని తెలుసుకునేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ), కేంద్ర కాలుష్య నియంత్రణమండలి(సీపీసీబీ) వేర్వేరు మూలకాల స్థాయిలతో ప్రమాణాలను నిర్దేశించాయని బ్లూడ్రాప్‌ సంస్థ చెబుతోంది. తమ ఎస్టీపీ ద్వారా బయటకొచ్చే నీరు ఆయా ప్రమాణాలను పూర్తిస్థాయిలో సంతృప్తిపరిచేలా ఉంటాయని భరోసా వ్యక్తం చేస్తోంది. క్లోరినేషన్‌ చేసి తాగునీటిగా కూడా ఉపయోగించుకోవచ్చని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.


చిత్తడి నేలలు పర్యావరణానికి ఆయువు పట్టులాంటివి. మా ఎస్టీపీలు వాటితోనే రూపుదిద్దుకుంటాయి. మురుగునీటిపై పెరిగే మొక్కలు గాలిలోకి కార్బన్‌ మోనాక్సైడ్‌ను, గ్రీన్‌ హౌజ్‌ గ్యాస్‌లను చాలా తక్కువ స్థాయిలో విడుదల చేస్తాయి. జీవవైవిధ్యానికి, పర్యావరణ సమతుల్యతకు దోహదపడతాయి.

గ్యాంజెస్‌ రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు