ఇళ్ల వద్దకే ఐటీ

పనిచేసే ప్రదేశానికి చేరువలో ఉండాలని మాదాపూర్, గచ్చిబౌలి ఐటీకారిడార్‌ చుట్టుపక్కల ఎక్కువమంది ఇళ్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. డిమాండ్‌ ఉండటంతో నిర్మాణదారులూ అత్యధిక ఇళ్లను ఇక్కడే కడుతున్నారు. అయితే, నగరానికి ఒకవైపే నిర్మాణరంగం విస్తరణతో ముప్పును గ్రహించిన ప్రభుత్వం.. గ్రోత్‌ ఇన్‌ డిస్‌పర్షన్‌(గ్రిడ్‌) పాలసీ తీసుకొచ్చింది.

Published : 22 Oct 2022 02:07 IST

పీపీపీ విధానంలో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లకు ప్రోత్సాహం

ఈనాడు, హైదరాబాద్‌: పనిచేసే ప్రదేశానికి చేరువలో ఉండాలని మాదాపూర్, గచ్చిబౌలి ఐటీకారిడార్‌ చుట్టుపక్కల ఎక్కువమంది ఇళ్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. డిమాండ్‌ ఉండటంతో నిర్మాణదారులూ అత్యధిక ఇళ్లను ఇక్కడే కడుతున్నారు. అయితే, నగరానికి ఒకవైపే నిర్మాణరంగం విస్తరణతో ముప్పును గ్రహించిన ప్రభుత్వం.. గ్రోత్‌ ఇన్‌ డిస్‌పర్షన్‌(గ్రిడ్‌) పాలసీ తీసుకొచ్చింది. దీనిలోభాగంగా హైదరాబాద్‌ నలుమూలలా ఐటీ కంపెనీల ఏర్పాటుపై దృష్టి సారించింది. ఈక్రమంలో ఇళ్లు ఉన్నచోటికే ఐటీ టవర్లు కూడా రాబోతున్నాయి.

సుమారు కోటి జనాభా కలిగిన నగరంలో ఐటీ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఐటీ, ఐటీ ఆధారితరంగాల్లో గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 7.78 లక్షల మంది నేరుగా ఉపాధి పొందుతున్నారని రాష్ట్ర ఐటీ శాఖ చెబుతోంది. కొత్తగా 1.55 లక్షల మందికి ఉద్యోగాలూ వచ్చాయని తెలిపింది. సహజంగానే కొలువులో చేరాక ఎక్కువమంది ఇళ్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో పని ప్రదేశానికి దగ్గరగా తమ నివాసాలు ఉండాలని చూస్తున్నారు. దీంతో ఐటీ కారిడార్‌ చుట్టూ ప్రాంతాలన్నీ ఆకాశహర్మ్యాలతో నిండిపోయాయి. కొత్తగా మరిన్ని నిర్మాణ ప్రాజెక్టులు రానుండడంతో స్థానికంగా మౌలికవసతులు చాలే పరిస్థితులు కన్పించడం లేదని పట్టణ ప్రణాళిక నిపుణులు చెబుతున్నారు. సిటీలో జనావాసాలు ఉన్న ప్రాంతాల్లోనే ఐటీ టవర్ల ఏర్పాటుతో ఇందుకు చెక్‌ పెట్టొచ్చని అంటున్నారు నిర్మాణరంగ నిపుణులు.

అన్ని వైపులా విస్తరణ..

నగరంలో 1500 వరకు చిన్నాపెద్దా ఐటీ కంపెనీలు ఉన్నాయి. అత్యధికం మాదాపూర్, గచ్చిబౌలి చుట్టుపక్కల ఉండగా.. ఘట్‌కేసర్‌ వైపు పోచారంలో ఇన్ఫోసిస్, ఆదిభట్లలో టీసీఎస్‌ వంటి పెద్ద సంస్థలే ఉన్నాయి. ఉప్పల్‌ ఐటీ సెజ్‌లోనూ, కొంపల్లి, ఇతర ప్రాంతాల్లో మరికొన్ని ఐటీ, ఐటీఆధారిత కంపెనీలు ఏర్పాటయ్యాయి. గ్రిడ్‌ పాలసీతో 300 వరకు చిన్న, మధ్యస్థ ఐటీ కంపెనీలు నగరంలోని ఇతర ప్రాంతాల్లో తమ సంస్థల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందుకోసం భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. తొలిదశలో ఐటీ టవర్ల నిర్మాణానికే సర్కారు భూములను కేటాయిస్తోంది. వాటిల్లో కొనుగోలు చేయడం, లీజుకు తీసుకోవడం ద్వారా ఆయా సంస్థల కార్యకలాపాలకు అవకాశం ఉంది.

జనావాసాలకు చేరువలో..

మేడ్చల్‌ వైపు కండ్లకోయలో 10.12 ఎకరాల్లో ఐటీ పార్క్‌ను పీపీపీ విధానంలో చేపట్టేందుకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ మాదిరి ఇది ఉంటుందని.. 11 లక్షల చదరపు అడుగులు ఐటీ కార్యాలయాలకు, మరో 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య, గృహ నిర్మాణ టవర్లు వస్తాయని కొంపల్లి ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఓరుగంటి వెంకట్‌ ‘ఈనాడు’తో చెప్పారు. ఇక్కడ తొలిదశలో 100 కంపెనీలు వచ్చే అవకాశం ఉందని, సుమారు 50 వేల మందికి ఉపాధి అవకాశాలొస్తాయని అంచనా వేస్తున్నారు.

* ఉప్పల్‌లోనూ ఏ గ్రేడ్‌ కార్యాలయాలను నిర్మిస్తున్నారు. స్థానికంగా కార్యాలయాల భవనాలతో పాటూ నివాస భవనాలు సైతం వస్తున్నాయి. ఉప్పల్‌ స్టేడియం చుట్టుపక్కల ఈ నిర్మాణాలు ఏర్పాటవుతున్నాయి.

* మలక్‌పేటలో 16 అంతస్తుల ఐటీ టవర్‌ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. స్థానిక మెట్రో మాల్‌ వెనక భాగంలోని ప్రభుత్వ ఉద్యోగుల పురాతన నివాస భవనాల స్థానంలో టవర్‌ రాబోతుంది. మెట్రోరైలు అనుసంధానం ఇక్కడ సానుకూల అంశం.

* రాజేంద్రనగర్‌ పరిధి బుద్వేల్‌లోనూ ఐటీ కార్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. గచ్చిబౌలి ఐటీ కారిడార్‌కు ఈ ప్రాంతం చేరువలో ఉండటంతో ఎక్కువ సంస్థలు ఇక్కడ కార్యాలయాల ఏర్పాటుకు మొగ్గుచూపుతున్నాయి. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని