తెరపైకి జోన్ల పెంపు!

స్థిరాస్తి రంగాన్ని వృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా జోన్ల పెంపు ప్రతిపాదనలు తెరపైకి తెస్తోంది.

Updated : 20 Jan 2024 07:09 IST

నాలుగింటిని రెట్టింపు చేసే ప్రతిపాదనలు
పాలన సౌలభ్యం...అనుమతులు వేగవంతం
స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చే దిశగా అడుగులు
ఈనాడు, హైదరాబాద్‌

స్థిరాస్తి రంగాన్ని వృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా జోన్ల పెంపు ప్రతిపాదనలు తెరపైకి తెస్తోంది. హెచ్‌ఎండీఏ ప్రస్తుతం ఏడు జిల్లాల్లో 7,228 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఏయేటికాయేడు స్థిరాస్తి కార్యకలాపాలు పెరుగుతున్నాయి. హెచ్‌ఎండీఏ అనేది పట్టణ ప్రణాళిక సంస్థ. మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లోని కొంత భాగం, భువనగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి. 849 గ్రామాలు ఈ హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌ పరిధి కింద ఉన్నాయి. వీటిని స్థూలంగా శంషాబాద్‌, మేడ్చల్‌, శంకర్‌పల్లి, ఘట్‌కేసర్‌ జోన్ల కింద విభజించారు. వీటి పరిధిలో ఏటా కొత్త లేఅవుట్లు, భారీ అంతస్తుల నిర్మాణాల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. మున్ముందు వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రతి జోన్‌లో పారిశ్రామిక, నివాస, వ్యవసాయ, ఉత్పత్తి.. ఇలా అన్ని రంగాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ప్లాన్‌లో భూ కేటాయింపులు జరుగుతాయి. వాటికి అనుగుణంగా అక్కడ లేఅవుట్లు, ఇతర నిర్మాణాలకు అనుమతులు జారీ చేస్తుంటారు.

గడచిన మూడేళ్లలో హెచ్‌ఎండీఏ పరిధిలో దాదాపు లక్ష నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. ఇక లేఅవుట్లు అంటే లెక్కలేదు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వరకు వేయి చదరపు మీటర్లలో స్టిల్టు ప్లస్‌ 3, స్టిల్టు ప్లస్‌ 5 వరకే అనుమతులు ఇచ్చే అధికారం ఉంది. హెచ్‌ఎండీలో టీడీఆర్‌తో ప్రాంతాన్ని బట్టి గరిష్ఠంగా ఎన్ని అంతస్తుల వరకైనా నిర్మాణాలకు అనుమతులు జారీ చేసే అధికారం ఉంది. ప్రస్తుతం నగరంలో 56, అంతకు మించిన అంతస్తులతో నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. నగరం నానాటికీ విస్తరిస్తున్న దృష్ట్యా వచ్చే 5 నుంచి 10 ఏళ్లలో స్థిరాస్తి రంగం మరింత ఊపందుకునే సూచనలు ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్త కొత్త పరిశ్రమలు మహానగరం దారి పడుతున్న దరిమిలా శివార్లలో అభివృద్ధి మరింత విస్తరించనుంది. ఈ క్రమంలో మౌలిక వసతుల కల్పన పెద్దఎత్తున జరగాల్సి ఉంది. హెచ్‌ఎండీఏ బాధ్యతా మరింత పెరగనుంది. ఆ మేరకు సంస్థ బలోపేతానికి కొత్త ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

కొత్త జోన్లు షురూ...

స్థిరాస్తి రంగం పరుగులు పెట్టాలంటే ప్రభుత్వ పరంగా అనుమతుల ప్రక్రియ వేగవంతం కావాలి. ఇప్పటికే టీఎస్‌బీపాస్‌ ద్వారా దరఖాస్తులు పెట్టుకున్న నిర్ణీత గడువులోనే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే  సంబంధిత అధికారులకు జరిమానా విధించే అధికారం ఉన్నతాధికారులకు ఉంది. ఏ అధికారి వద్ద దస్త్రం ఎన్ని రోజులు ఉందో సహేతుకమైన కారణాలు చెప్పాల్సిందే. ఎలాంటి కారణాలు లేకుండా దస్త్రం ఉద్దేశపూర్వకంగా పక్కన పెడితే చర్యలు తీసుకోవచ్చు. గతంలో పలువురు అధికారులపై ఇలాంటి చర్యలకు అధికారులు ఉపక్రమించారు. ప్రస్తుతం ఉన్న నాలుగు జోన్ల నుంచి భారీగా దరఖాస్తులు వస్తుండటంతో సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం నాలుగు జోన్లకు 20-25 మంది వరకు పీవోలు, ఏపీవోలు ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. దీంతో దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరుగుతోంది. కొన్నిసార్లు లేఅవుట్లు, భవనాల అనుమతుల కోసం నెల, రెండు నెలలపాటు తిరగాల్సి వస్తోందని దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఈ డిమాండ్‌ను కొందరు సిబ్బంది తమకు అనువుగా మార్చుకొని సొమ్ము వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే సేవలను విస్తరించడమే కాకుండా పారదర్శకత పెంచాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న జోన్ల సంఖ్యను రెట్టింపు చేసి అదనపు సిబ్బందిని నియమించడం ద్వారా నిర్ణీత గడువులోనే లేఅవుట్లు, భవన నిర్మాణాల అనుమతులు ఇవ్వడం ద్వారా స్థిరాస్తి రంగానికి ఊపు తేవాలనేది ప్రణాళికగా ఉంది. ఇందులో భాగంగా ఒక్కో జోన్‌ను రెండేసి భాగాలు చేసి వాటి కిందకు కొన్నేసి మండలాలు తేవాలనేది గత ప్రణాళిక. ఉదాహరణకు శంకర్‌పల్లి, శంషాబాద్‌ లాంటి చోట్ల ఎక్కువ దరఖాస్తులు వస్తుంటాయి. అక్కడ పనిభారమూ ఎక్కువే. వీటిని రెండేసి జోన్లు చేయడం వల్ల ఉన్న సిబ్బందిపై భారం తగ్గుతుంది. ప్రస్తుతం నాలుగు జోన్లకు ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు. అవసరమైతే వీరి సంఖ్య పెంచడం లేదంటే వీరి పరిధిలోకే మిగతా జోన్లను తేనున్నారు. హెచ్‌ఎండీఏపై సీఎంతోపాటు ఉన్నతాధికారుల సమీక్ష తర్వాత జోన్ల పెంపు సంగతి కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని