ఇంద్ర భవనాలపై పెరిగిన మోజు
అత్యంత విలాసవంతమైన ఇంద్రభవనాల వంటి నివాసాలపై మోజు పెరిగింది. వీటి విక్రయాలు దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఊపందుకున్నాయి. అధిక ఆదాయం కల్గిన వ్యక్తులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
దిల్లీలో ప్రీమియం నివాసాలకు అధిక గిరాకీ
ఈనాడు, హైదరాబాద్: అత్యంత విలాసవంతమైన ఇంద్రభవనాల వంటి నివాసాలపై మోజు పెరిగింది. వీటి విక్రయాలు దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఊపందుకున్నాయి. అధిక ఆదాయం కల్గిన వ్యక్తులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. రూ.4 కోట్లు అంతకంటే అధిక విలువైన నివాసాలు 2022తో పోలిస్తే 2023లో 75 శాతం పెరిగినట్లు సీబీఆర్ఈ నివేదిక వెల్లడించింది. విక్రయించిన ఇళ్లు 7,395 నుంచి 12,935కు చేరాయి.
- దేశ రాజధాని దిల్లీలో ప్రీమియం నివాసాల అమ్మకాలు ఏకంగా మూడు రెట్లు అధికమయ్యాయి. ఏడు నగరాల్లో అత్యధికంగా ఇక్కడే విలాసవంతమైన ఇళ్లు అమ్ముడుపోయాయి. 2022లో విక్రయించిన ఈ తరహా గృహాల సంఖ్య 1860 కాగా 2023లో 5530.
- హైదరాబాద్లో 2022లో రూ.4కోట్ల పైన విలువైన ఇళ్లు 1240 విక్రయిస్తే.. గతేడాదిలో 2030 అమ్మగల్గారు.
- ముంబయిలో 3390 యూనిట్ల నుంచి 4190 యూనిట్లకు పెరుగుదల ఉండగా.. పుణెలో 190 నుంచి 450కి ఎగబాకింది.
అక్కడ నిలకడగా..
విలాసవంతమైన నివాసాల అమ్మకాలు బెంగళూరులో గత ఏడాది 310 జరిగాయి. ఇక్కడ విక్రయాలు నిలకడగా ఉన్నాయి.
- కోల్కతాలో 300 నుంచి 310 ఇళ్లకు... అంటే స్వల్పంగా మాత్రమే పెరుగుదల కనిపించింది.
- చెన్నైలోనూ 150 నుంచి 160 మాత్రమే పెరిగాయి.
అన్ని విభాగాల్లో కలిపి..
ఏడు ప్రధాన నగరాల్లోని అన్ని విభాగాల్లో కలిపి 2023లో 3.22 లక్షల ఇళ్లను విక్రయించినట్లు నివేదిక పేర్కొంది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 9 శాతం వృద్ధి నమోదైంది.
- డిమాండ్ ఉండటంతో 2023లో కొత్త ప్రాజెక్టుల్లో 3.13 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. 2022తో పోలిస్తే 6 శాతం ఎక్కువ.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.