కోతల ఇక్కట్లు

రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్తు కోతలతో అన్ని రంగాల వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు గంటల తరబడి కరెంట్‌ తీసివేస్తుండటంతో ఇళ్ల నుంచి పని (వర్క్‌ ఫ్రం హోం) చేస్తున్న పలువురు ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. ఆయా షిఫ్టు సమయాల్లో విద్యుత్తు ఉండకపోవడంతో అదనపు సమయం పనిచేయాల్సి వస్తోందని చెబుతున్నారు

Published : 13 Apr 2022 03:51 IST

ఇంటి నుంచి పనికి కరెంటు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు
ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్‌ లేక.. వైఫై రాక అవస్థలు
ఈనాడు డిజిటల్‌, అమరావతి

రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్తు కోతలతో అన్ని రంగాల వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు గంటల తరబడి కరెంట్‌ తీసివేస్తుండటంతో ఇళ్ల నుంచి పని (వర్క్‌ ఫ్రం హోం) చేస్తున్న పలువురు ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. ఆయా షిఫ్టు సమయాల్లో విద్యుత్తు ఉండకపోవడంతో అదనపు సమయం పనిచేయాల్సి వస్తోందని చెబుతున్నారు. అలాగే అప్పగించిన పనిని సమయానికి పూర్తి చేయలేకపోతుండటంతో ఒత్తిడి పెరుగుతోంది. రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారు కరెంటు కోతల కారణంగా ఉదయం కూడా పనిచేయాల్సి వస్తోంది. పల్లెటూళ్ళలో ఉండి పనిచేస్తున్న వారు ఇన్వర్టర్లు ఉన్న బంధువుల ఇళ్లకు వెళ్లాల్సి వస్తోంది.


కొత్త ల్యాప్‌టాప్‌ కొనాల్సి వచ్చింది..
కె.రాంబాబు, ఉద్యోగి, మన్యంపార్వతీపురం జిల్లా

ల్యాప్‌టాప్‌ ఛార్జింగ్‌ మూడు, నాలుగు గంటలకు మించి రావడం లేదు. కరెంట్‌ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. దీంతో కొత్త ల్యాప్‌టాప్‌ కొనాల్సి వచ్చింది.


మీకే  ఇబ్బంది ఎందుకు అని అడుగుతున్నారు
నాలాది సుధీర్‌, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, గురజాల, పల్నాడు జిల్లా

కరెంటు కోతల కారణంగా పూర్తి స్థాయిలో ఆఫీసు పని చేయలేకపోతున్నాం. ఒకసారి అయితే పై అధికారులు వింటారు. ప్రతిసారీ కరెంటు లేదనే సాకు చెబుతుంటే.. తెలంగాణలో లేని ఇబ్బంది మీకే ఎందుకు ఉందని అడుగుతున్నారు.


కనీసం పది గంటలకు తక్కువ కాకుండా విద్యుత్తు కోతలున్నాయి..
నక్కా వెంకటరమణ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, శ్రీకాకుళం

కరోనా కారణంగా రెండున్నరేళ్లుగా ఇంటి నుంచే పనిచేస్తున్నాను. శ్రీకాకుళం పక్కన చిన్న గ్రామం మాది. ప్రస్తుతం మా గ్రామంలో రోజుకు మూడు సార్లు కరెంటు తీసేస్తున్నారు. కనీసం పది గంటలు విద్యుత్తు ఉండడం లేదు. ఈ కోతలు కూడా వేళాపాళా లేకుండా ఉంటున్నాయి. ల్యాప్‌టాప్‌ ఛార్జింగ్‌ రెండు, మూడు గంటలే వస్తోంది. వైఫై కూడా ఉండటం లేదు. దీంతో పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్నాం. ఇలాగైతే కష్టం.. అవసరమైతే ఇన్వర్టర్‌ కొనుక్కోండి.. విద్యుత్‌ సరఫరా ఉండే ప్రాంతాలకు వెళ్లి పనిచేయండి అంటూపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు.


రాత్రి వేళల్లో కరెంటు కోతలు
కోటేశ్వరరావు, కురిచేడు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, ప్రకాశం జిల్లా

మా దగ్గర విద్యుత్తు కోతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు, తెల్లవారుజామున 2 నుంచి 6 వరకు కరెంటు తీసేస్తున్నారు. దీంతో ఆఫీసు పని చేసుకోవడం కష్టమవుతోంది.       -


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని