AP Highcourt: జ్యుడీషియల్‌ అధికారిని బెదిరించడానికి ఎంత ధైర్యం?

‘జ్యుడీషియల్‌ అధికారిని బెదిరించడానికి ఆ పోలీసు అధికారికి ఎంత ధైర్యం?’ అని హైకోర్టు మండిపడింది.

Updated : 09 May 2023 06:53 IST

సీఐపై హైకోర్టు మండిపాటు
కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడినట్లు భావిస్తున్నాం
కేసు నమోదు చేయాలని రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశం
పోలీసుల బెదిరింపులతో దిగువ కోర్టులు ఎలా పనిచేస్తాయని వ్యాఖ్య
సీఎస్‌, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, సీఐలకు నోటీసులు

ఈనాడు, అమరావతి: ‘జ్యుడీషియల్‌ అధికారిని బెదిరించడానికి ఆ పోలీసు అధికారికి ఎంత ధైర్యం?’ అని హైకోర్టు మండిపడింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు అడ్వొకేట్‌ కమిషనర్‌ (జ్యుడీషియల్‌ ఆఫీసర్‌)గా నియమితులైన న్యాయవాది ఉదయ్‌ సింహారెడ్డి, కోర్టు సిబ్బంది శివశంకర్‌పై హిందూపురం 1వ పట్టణ ఠాణా సీఐ ఇస్మాయిల్‌ చేయి చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ప్రవర్తన న్యాయ పరిపాలన ప్రక్రియకు ఆటంకం కలిగించడమేనని ప్రాథమికంగా అభిప్రాయపడింది. కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడినట్లు భావిస్తున్నామని పేర్కొంది. ఇస్మాయిల్‌పై సుమోటోగా ధిక్కరణ కేసు నమోదు చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. ఆయనకు నోటీసులు జారీ చేయాలని స్పష్టంచేసింది. బెదిరింపులకు పాల్పడితే దిగువ న్యాయస్థానాలు ఏవిధంగా పనిచేస్తాయని ఘాటుగా వ్యాఖ్యానించింది. మరోవైపు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అడ్డుకునేందుకు సుమోటోగా నమోదు చేసిన పిల్‌లో ప్రతివాదులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, అనంతపురం రేంజ్‌ డీఐజీ, శ్రీసత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా ఎస్పీలు, పెనుకొండ డీఎస్పీ, హిందూపురం 1వ పట్టణ ఠాణ ఎస్‌హెచ్‌వో, సీఐ ఇస్మాయిల్‌కు నోటీసులు జారీచేసింది.  తాజాగా నమోదు చేసిన కోర్టు ధిక్కరణ కేసు, సుమోటో పిల్‌నూ కలిపి విచారిస్తామని పేర్కొంది. జూన్‌ 14కు వాయిదా వేసింది. ఆ రోజు విచారణకు ఇస్మాయిల్‌ కోర్టు ముందు హాజరు కావాలని తేల్చిచెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది.

పోలీసులు డి.గిరీష్‌ను అక్రమంగా నిర్బంధించారని దాఖలైన వ్యాజ్యంపై హిందూపురం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు విచారణ జరిపింది. హిందూపురం 1వ పట్టణ ఠాణాకు వెళ్లి వాస్తవాలు పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు న్యాయవాది పి.ఉదయ్‌సింహారెడ్డిని అడ్వొకేట్‌ కమిషనర్‌గా నియమించింది. గిరీష్‌ అక్రమ నిర్బంధంలో ఉంటే కోర్టు ముందుకు తీసుకురావాలని కోరింది. 2022 అక్టోబర్‌ 21న ఉదయ్‌ సింహారెడ్డి ఠాణాకు వెళ్లారు. ఆయనకు సహాయకుడిగా కోర్టు ఉద్యోగి (బెంచ్‌ క్లర్క్‌) శివశంకర్‌, నిర్బంధంలో ఉన్న వ్యక్తి తరఫు న్యాయవాది, ఆయన కుటుంబ సభ్యులు వెళ్లారు. గిరీష్‌ అక్రమ నిర్బంధంలో ఉన్నారని, పోలీసులు కొట్టినట్లు కమిషనర్‌ గమనించారు. అతన్ని కోర్టు ముందు హాజరుపరిచేందుకు తీసుకెళతానని చెప్పగా సీఐ ఇస్మాయిల్‌ నిరాకరించారు. అడ్వొకేట్‌ కమిషనర్‌, కోర్టు సిబ్బందిపై చేయి చేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు తర్వాత గిరీష్‌ను కోర్టు ముందు హాజరు పరిచారు. వైద్య పరీక్షలు చేయగా పోలీసులు చిత్ర హింసలకు గురిచేసినట్లు తేలింది. ఈ వ్యవహారంలో సీఐపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి లేఖ రాశారు. ఆ లేఖ ప్రతులను డీఐజీ, జిల్లా ప్రధాన న్యాయమూర్తికి పంపారు. ఈ వ్యవహారం హైకోర్టు రిజిస్ట్రార్‌ విజిలెన్స్‌కు చేరింది. అప్పట్లో అనంతపురం జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి/హైకోర్టు అప్పటి న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌.. ఇది చాలా తీవ్రమైన వ్యవహారమన్నారు. న్యాయవ్యవస్థ హుందాతనాన్ని కాపాడేందుకు ఈ విషయాన్ని సుమోటో పిల్‌గా పరిగణించాలని అభిప్రాయపడ్డారు. హైకోర్టు సీజే దృష్టికి తీసుకెళ్లాలని రిజిస్ట్రీని కోరారు. ఈ వ్యవహారాన్ని సుమోటో పిల్‌గా పరిగణించిన హైకోర్టు సోమవారం విచారణ జరిపింది.


పునరావృతం కాకుండా చూస్తాం

హోంశాఖ జీపీ

హోంశాఖ ప్రభుత్వ న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. సీఐని వీఆర్‌కు పంపామన్నారు. పూర్తి వివరాలతో నివేదికను కోర్టు ముందు ఉంచుతామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని