చందాదార్లను భయపెట్టే యత్నం

మార్గదర్శి చిట్‌ఫండ్‌పై కొంతకాలంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ, కేసులు పెట్టి వేధిస్తూ చందాదార్లలో సంస్థ విశ్వసనీయతను దెబ్బతీయడానికి శతవిధాలుగా ప్రయత్నించి విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో కుటిల పన్నాగానికి నడుం కట్టింది.

Updated : 31 May 2023 06:50 IST

మార్గదర్శి చరాస్తుల ‘ఎటాచ్‌మెంట్‌’ ఉత్తర్వులు కక్షపూరితం
వ్యాపారాన్ని దెబ్బతీయాలనే కుట్ర  
అసత్య ఆరోపణలు.. చట్టాలకు వక్రభాష్యం

ఈనాడు, హైదరాబాద్‌: మార్గదర్శి చిట్‌ఫండ్‌పై కొంతకాలంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ, కేసులు పెట్టి వేధిస్తూ చందాదార్లలో సంస్థ విశ్వసనీయతను దెబ్బతీయడానికి శతవిధాలుగా ప్రయత్నించి విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో కుటిల పన్నాగానికి నడుం కట్టింది. చందాదార్లను భయభ్రాంతులకు గురిచేసి, సంస్థ వ్యాపారాన్ని దెబ్బతీసే లక్ష్యంతో మార్గదర్శి చిట్‌ఫండ్‌కు చెందిన రూ.793.50 కోట్ల సొమ్మును ‘ఎటాచ్‌మెంట్‌్’ చేసేందుకు ఏపీ హోం శాఖ జీఓ జారీ చేసింది. చట్టాన్ని మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఏ విధంగానూ ఉల్లంఘించనప్పటికీ, ఈ సంస్థకు వర్తించని ఏపీ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ యాక్ట్‌, 1999ను ప్రస్తావిస్తూ ఎటాచ్‌మెంట్‌్ జీఓ ఇచ్చింది. దీనికి వెనుక దురుద్దేశాలు, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది విస్పష్టం. చట్టానికి తనకు తోచిన వక్రభాష్యం చెప్పి, తనకు అడ్డుగా ఉన్నవారిని వేధించడమే లక్ష్యంగా చేస్తున్న కుటిల యత్నంగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఒక పక్క చందాదార్ల ప్రయోజనాల పరిరక్షణకే ఇదంతా చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, మరోపక్క అదే చందాదార్లకు నష్టం చేయడానికి నడుంకట్టింది. ఇది పూర్తిగా కక్షపూరిత చర్య. బాధ్యతాయుతమైన ఏ ప్రభుత్వమూ ‘చట్టబద్ధంగా వ్యాపారాన్ని నిర్వహించే సంస్థలపై’ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడదు.

కోర్టు మధ్యంతర ఆదేశాలు బేఖాతరు

మార్గదర్శి చిట్‌ఫండ్‌ వ్యాపార కార్యకలాపాలకు నష్టం వాటిల్లే విధంగా ఎటువంటి చర్యలూ తీసుకోరాదని ఇప్పటికే న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని పట్టించుకోకుండా, న్యాయస్థానం    ఆదేశాలకు పూర్తి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని మార్గదర్శి శాఖల్లో కొత్త చిట్లు ప్రారంభించడానికి అనుమతి ఇవ్వడం లేదు. కాలవ్యవధి ముగిసిన చిట్‌ గ్రూపులకు సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్లు రిలీజ్‌ చేయకుండా తొక్కిపడుతోంది. ఇవన్నీ సంస్థ వ్యాపారాన్ని దెబ్బతీసే చర్యలే. ఇప్పుడు చరాస్తుల ‘ఎటాచ్‌మెంట్‌’ జీఓ (ఎంఎస్‌ నం. 104) తీసుకువచ్చింది. ఇందులో మళ్లీ సత్యదూరమైన, పదే పదే చేసే ఆరోపణలే ప్రస్తావించింది.

చిట్‌ఫండ్‌ చట్టాన్ని అనుసరిస్తున్నప్పటికీ..

మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ చేసిన ఆరోపణలకు సహేతుక సమాధానాలు ఇచ్చినప్పటికీ, సత్యాన్ని అంగీకరించకపోగా ఇంకా దిగజారుడు చర్యలకు ప్రభుత్వ యంత్రాంగం పాల్పడుతోంది. తాజాగా జారీచేసిన  ఎటాచ్‌మెంట్‌్ ఉత్తర్వులే దీనికి ఉదాహరణ.

* చందాదార్ల సొమ్మును కార్పొరేట్‌ కార్యాలయానికి బదిలీ చేసి, ఆ సొమ్మును మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడిగా పెట్టారనే ఆరోపణ పూర్తిగా సత్యదూరం. సంస్థకు లభించిన కమీషన్‌ ఆదాయంలో మిగిలిన మొత్తం మాత్రమే కార్పొరేట్‌ కార్యాలయానికి బదిలీ అవుతుంది. ఇది సంస్థకు చెందిన మిగులు ఆదాయం.

* ఆరు దశాబ్దాల నుంచి వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగిస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఇలా మిగిలిన సొమ్మును జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది. అందుకే సంస్థ ఆర్థికంగా పరిపుష్టంగా ఉండటమే కాకుండా, చందాదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చెల్లింపులు నిర్వహిస్తోంది. ఆస్తి-అప్పుల పట్టీలో 31.03.2022 నాటికి రూ.1,509 కోట్ల నిధులు ఉండటానికి ఈ జాగ్రత్తే కారణం.

చందాదారుల సొమ్ము నిర్వహణ ఇలా

క్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చందాదారుల నుంచి నెలవారీ చిట్‌ సొమ్ము వసూలు కాగానే, దాన్ని ఆ నెలలో పాడుకున్నవారికి చెల్లిస్తుంటారు. సంస్థకు మిగిలేది కమీషన్‌ ఆదాయం మాత్రమే. ఆ సొమ్మును ఎక్కడైనా నిల్వ చేసుకోవడానికి, పెట్టుబడి పెట్టడానికి నిబంధనలు వీలు కల్పిస్తున్నాయి. వాస్తవం ఇది కాగా, చందాదారుల సొమ్మును మళ్లించారనే తప్పుడు ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం వల్లెవేస్తోంది. ఎంత చెప్పినా వాస్తవాన్ని గ్రహించాలనే ఆలోచన చేయడం లేదు.

డిపాజిట్లు తీసుకోవడం లేదు

రిజర్వు బ్యాంకు నిబంధనలను ఉల్లంఘించారనేది పూర్తిగా అవాస్తవం. మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఎలాంటి డిపాజిట్లు తీసుకోవడం లేదు. డిపాజిట్లే తీసుకోనప్పుడు, నిబంధనలు ఉల్లంఘించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. చందాదారులు చిట్‌ మొత్తాన్ని తీసుకునే సమయంలో, ఆ చిట్‌ కింద భవిష్యత్తులో చెల్లించాల్సిన నెలవారీ చందాల మొత్తాన్ని ష్యూరిటీ కింద సంస్థకు చందాదారు చిట్‌ఫండ్‌ చట్టానికి లోబడి స్వచ్ఛందంగా ఇవ్వవచ్చు. ఇది పూర్తిగా ఫోర్‌మెన్‌ విచక్షణతో తీసుకునే నిర్ణయం. చిట్‌ఫండ్‌ కంపెనీలకు వర్తించే విధంగా ఆర్‌బీఐ జారీ చేసిన ‘మిస్‌లేనియస్‌: నాన్‌ బ్యాంకింగ్‌ కంపెనీస్‌ డైరెక్షన్స్‌’ కింద ష్యూరిటీ తీసుకోవడానికి అవకాశం ఉంది. ష్యూరిటీ మొత్తాన్ని సాధారణ డిపాజిట్‌ కింద పరిగణించరాదని ఈ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి.

* చిట్‌ గ్రూపు ప్రస్తుత చందా, భవిష్యత్తులో చెల్లించాల్సిన చందా లేదా అడ్వాన్సుగా చెల్లించే చందా సొమ్ము ‘డిపాజిట్‌’ నిర్వచనం కిందకు రానే రాదు. వాస్తవాలు ఇలాఉండగా, మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. చందాదార్ల నుంచి డిపాజిట్లు తీసుకుంటోందని,  అందువల్ల ఏపీ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ యాక్ట్‌-1999 దీనికి వర్తిస్తుందని, చందాదార్ల సొమ్మును ఎక్కడికో తరలిస్తోందని, ఏదో జరుగుతోందంటూ తప్పుడు ఆరోపణలను సంస్థపై రుద్దుతూ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. ఇది 60 ఏళ్లుగా సజావుగా, స్థిరంగా నడిచే సంస్థను దెబ్బతీసే కుట్రలో భాగమే తప్ప మరొకటి కాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని