ఆ పథకం సురక్షితమేనా?

మూడేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో రూ.40లక్షల విలువైన టర్మ్‌ పాలసీని తీసుకున్నాను. నా వయసు 38. ఇప్పుడు మరో రూ.30 లక్షల పాలసీ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను.

Published : 10 Feb 2023 00:32 IST

* మూడేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో రూ.40లక్షల విలువైన టర్మ్‌ పాలసీని తీసుకున్నాను. నా వయసు 38. ఇప్పుడు మరో రూ.30 లక్షల పాలసీ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీని ఎంచుకోవచ్చా?  

శర్మ

* మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ కవర్‌ ఉండేలా చూసుకోండి. అదనంగా రూ.30 లక్షలు తీసుకున్నప్పుడు ఈ లెక్క సరిపోతే ఇబ్బందేమీ లేదు. అదనంగా తీసుకునే పాలసీ మీ పాత కంపెనీ నుంచి కాకుండా.. మంచి క్లెయిం చెల్లింపుల చరిత్ర ఉన్న మరో కంపెనీ నుంచి తీసుకోండి. సాధారణ టర్మ్‌ పాలసీతో పోలిస్తే ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీకి కొంత అధికంగా చెల్లించాలి. దీనికి బదులుగా మీరు సాధారణ పాలసీ తీసుకొని, అదనంగా చెల్లించే మొత్తాన్ని సొంతంగా పెట్టుబడి పెట్టుకోండి.


* నాకు 27 ఏళ్లు. ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.35వేలు వస్తున్నాయి. ఇందులో నుంచి రూ.10వేలను ఏదైనా పెట్టుబడికి కేటాయించాలని అనుకుంటున్నాను. నా ఆర్థిక ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుంది?  

రవీంద్ర

* ముందుగా మీపై ఆధారపడిన వారెవరైనా ఉంటే    టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా తగినంత జీవిత బీమా తీసుకోండి. ఆరోగ్య, వ్యక్తిగత ప్రమాద, వైకల్యం బీమా పాలసీలనూ తీసుకోండి. కనీసం 3 నెలల నుంచి ఆరు నెలల ఖర్చులకు సరిపోయే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తంలో రూ.3వేలను పీపీఎఫ్‌లో జమ చేయండి. రూ.7వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో జమ చేయండి. మీరు 15 ఏళ్లపాటు మదుపు చేస్తే 11 శాతం సగటు రాబడితో రూ.41,28,643 చేతికి వచ్చే అవకాశం ఉంది.


* మా అమ్మాయి పేరు మీద నెలకు రూ.5వేలను సుకన్య సమృద్ధిలో జమ చేయాలని అనుకుంటున్నాం. ఇది సురక్షితమేనా? దీనికి బదులుగా ఫండ్లలో మదుపు చేయడం మేలు అంటున్నారు నిజమేనా?

ఉమాదేవి

* దీర్ఘకాలంలో సుకన్య సమృద్ధి యోజనతో పోలిస్తే ఫండ్లు కాస్త అధిక రాబడినిచ్చే అవకాశాలున్నాయి. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే సుకన్య సమృద్ధి కేంద్ర ప్రభుత్వ హామీ ఉన్న పథకం. ఇందులో ఎలాంటి నష్టభయం ఉండదు. వడ్డీకి హామీ ఉంటుంది. ఈక్విటీ ఫండ్లలో కాస్త నష్టభయం ఉంటుంది. రాబడికీ హామీ ఉండదు. మీరు రూ.2వేలను సుకన్య సమృద్ధిలో, రూ.3వేలను హైబ్రీడ్‌ ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లలో మదుపు చేయొచ్చు. 

తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని