IPOs in 2022: అదరగొట్టిన అదానీ.. నిరాశపర్చిన ఎల్‌ఐసీ.. 2022లో తగ్గిన ఐపీఓల జోరు!

IPOs in 2022: 2022లో ఐపీఓల జోరు తగ్గింది. సమీకరణ మొత్తం 2021తో పోలిస్తే సగానికి తగ్గింది. ప్రధానంతా అంతర్జాతీయ కారణాలే ప్రైమరీ మార్కెట్‌ సెంటిమెంటును దెబ్బతీసింది.

Updated : 26 Dec 2022 11:01 IST

IPOs in 2022: క్రితం ఏడాదితో పోలిస్తే 2022లో ఐపీఓ (IPO)ల సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. కానీ, పబ్లిక్‌ ఇష్యూ (IPO)లో షేర్లు దక్కించుకున్న వారికి మాత్రం సగటున 32 శాతం వరకు ప్రతిఫలం అందడం విశేషం. ఈ ఏడాది ఇప్పటి వరకు 38 కంపెనీలు ఐపీఓ (IPO)కు వచ్చాయి. క్రితం సంవత్సరం ఈ సంఖ్య 65గా ఉన్న విషయం తెలిసిందే.

ఈ ఏడాది పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన కంపెనీలు దాదాపు రూ.59,000 కోట్లు సమీకరించాయి. 2021లో ఈ మొత్తం రికార్డు స్థాయిలో 1.31 లక్షల కోట్లుగా నమోదైంది. సగటు ఐపీఓ పరిమాణం సైతం క్రితం సంవత్సరంతో పోలిస్తే రూ.2,022 కోట్ల నుంచి రూ.1,844 కోట్లకు పడిపోయింది. 

2022లో ఐపీఓకి వచ్చిన కంపెనీల్లో దాదాపు 80 శాతం కంపెనీలు లాభాల్లో ఉండడం విశేషం. అదానీ విల్మర్‌ 2022లో మదుపర్ల పంట పండించిందనే చెప్పాలి. ఇది దాదాపు 183 శాతం రిటర్న్స్‌ ఇచ్చింది. తర్వాత హరిఓం పైప్స్‌ 137 శాతం రాబడితో మదుపర్లకు లాభాలు కురిపించింది. మొత్తంగా ఈ ఏడాది ఐపీఓకి వచ్చిన వాటిలో నాలుగు కంపెనీలు మదుపర్ల సంపదను రెట్టింపు చేశాయి. మరో 18 కంపెనీలు రెండంకెల రాబడినివ్వడం విశేషం.

(ప్రస్తుత ధరలు డిసెంబరు 24 మార్కెట్లు ముగిసినప్పటివి) 

ఈ ఏడాది మదుపర్ల సంపదను హరించేసిన ఐపీఓలూ ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ కూడా ఉండడం గమనార్హం. రూ.21,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకి వచ్చిన ఈ కంపెనీ షేర్లు 8.1 శాతం నష్టంతో స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఇష్యూ ధరతో పోలిస్తే ప్రస్తుతం 20 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి.

(ప్రస్తుత ధరలు డిసెంబరు 24 మార్కెట్లు ముగిసినప్పటివి)

ప్రభావం చూపిన అంశాలివే..

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు తమ ద్రవ్య విధానాన్ని కఠినతం చేశాయి. దీంతో వడ్డీరేట్లు పెరిగి ప్రజల వద్ద ద్రవ్యలభ్యత తగ్గింది. మదుపు చేసేందుకు డబ్బు లేక ఐపీఓలో పాల్గొనడానికి మదుపర్లు వెనుకాడారు.

☛  భౌగోళిక రాజకీయాలు సైతం స్టాక్‌ మార్కెట్‌ తద్వారా ప్రైమరీ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం మార్కెట్లను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. కరోనా సంక్షోభం నుంచి కోలుకుంటున్న ఈక్విటీ మార్కెట్లకు 2022 ఆదిలోనే ఇది పెనుశాపంగా పరిణమించింది. 

☛ ఇటీవల మార్కెట్‌లోకి వచ్చిన పేటీఎం, జొమాటో, నైకా వంటి నవతరం టెక్‌ కంపెనీలు ఈ ఏడాది మదుపర్లను బోల్తా కొట్టించాయి. భారీ దిద్దుబాటుకు గురై మదుపర్లకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఐపీఓలో పెద్ద ఎత్తున షేర్లు కొనుగోలు చేసిన సంస్థాగత మదుపర్లు లాకిన్‌ గడువు ముగియడంతో వాటిని మార్కెట్‌లోకి వదిలేశారు. దీంతో వీటి ధరలు పతనమయ్యాయి. ఈ నేపథ్యంలోనే చాలా న్యూఏజ్‌ టెక్ కంపెనీలు ఐపీఓకి రావడానికి వెనుకడుగు వేశాయి. 

గత ఏడాది మార్కెట్‌లో లిస్టై 2022లో భారీ పతనాన్ని చూసిన టెక్‌ కంపెనీలివే..

నైకా..

  • ఇష్యూ ధర: రూ.2,018 (తర్వాత ఈ స్టాక్‌ను 6:1 నిష్ఫత్తిలో విభజించారు)
  • గరిష్ఠ ధర: రూ.429
  • కనిష్ఠ ధర: రూ.139.40
  • ప్రస్తుత ధర: రూ.145.80
  • ఇష్యూ ధరతో పోలిస్తే 57 శాతం పతనమైంది.

ఈజ్‌మైట్రిప్‌..

  • ఇష్యూ ధర: రూ.187 
  • గరిష్ఠ ధర: రూ.476.50
  • కనిష్ఠ ధర: రూ.44.95
  • ప్రస్తుత ధర: రూ.48.70
  • ఇష్యూ ధరతో పోలిస్తే 73 శాతం పతనమైంది.

జొమాటో..

  • ఇష్యూ ధర: రూ.76 
  • గరిష్ఠ ధర: రూ.169.10
  • కనిష్ఠ ధర: రూ.40.60
  • ప్రస్తుత ధర: రూ.57.90
  • ఇష్యూ ధరతో పోలిస్తే 54 శాతం పతనమైంది.

పేటీఎం..

  • ఇష్యూ ధర: రూ. 
  • గరిష్ఠ ధర: రూ.2150
  • కనిష్ఠ ధర: రూ.441.10
  • ప్రస్తుత ధర: రూ.496.55
  • ఇష్యూ ధరతో పోలిస్తే 76 శాతం పతనమైంది.

(పై స్టాక్స్‌లో ప్రస్తుత ధరలు డిసెంబరు 26 ఉదయం 10 గంటల సమయానికి ఉన్నవి)

ఈ ఏడాది ఐపీఓల్లో మరిన్ని విశేషాలు..

దేశంలోనే అతి పెద్ద ఐపీఓగా ఎల్‌ఐసీ నిలిచింది. రూ.20,557 కోట్లతో అగ్రస్థానం దక్కించుకోగా తర్వాత స్థానాల్లో డెలివరీ (రూ.5,235 కోట్లు), అదానీ విల్మర్‌ (రూ.3,600 కోట్లు), వేదాంతా ఫ్యాషన్‌ (రూ.3,149 కోట్లు), గ్లోబల్‌ హెల్త్‌ (రూ.2,205 కోట్లు) ఉన్నాయి.

38 ఐపీఓల్లో కేవలం రెండు (డెలివరీ, ట్రాక్షన్‌ టెక్నాలజీస్‌) మాత్రమే కొత్త తరం టెక్నాలజీ కంపెనీలు. గత ఏడాది ఐపీఓకు వచ్చిన పేటీఎం, కొన్ని సాంకేతిక సంస్థల షేర్లు పేలవ ప్రదర్శన చేయడం వల్ల, ఈ ఏడాది ఇలాంటివి 2 మాత్రమే ఐపీఓకు వచ్చాయి.

హర్ష ఇంజినీర్స్‌ ఐపీఓకు 75 రెట్ల ఆదరణ దక్కింది. ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా (72 రెట్లు), డీసీఎక్స్‌ సిస్టమ్స్‌ (70 రెట్లు) తర్వాత స్థానాల్లో నిలిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని