Swiggy: స్విగ్గీలో లేఆఫ్.. 380 మందికి ఉద్వాసన.. కఠిన నిర్ణయమన్న సీఈఓ

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థల బాటలోనే స్విగ్గీ కూడా నడుస్తోంది. తన ఉద్యోగుల్లో 380 మందికి ఉద్వాసన పలికింది. 

Updated : 20 Jan 2023 15:08 IST

బెంగళూరు: ఫుడ్ డెలివరీ యాప్‌ స్విగ్గీ(Swiggy) 380 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ట్విటర్‌ వంటి ప్రముఖ సంస్థల బాటలోనే నడిచింది. శుక్రవారం ఉదయం దీనిపై స్విగ్గీ(Swiggy) సీఈఓ .. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు ఈ-మెయిల్‌ చేశారు. సంస్థ పునర్నిర్మాణ చర్యల్లో భాగంగా అత్యంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు.

‘సంస్థ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు ఈ కఠిన నిర్ణయాన్ని అమలుచేస్తున్నాం. ఇందుకోసం ప్రతిభగల 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన (Lays Off)  పలుకుతున్నాం. ఎన్నో అవకాశాలను అన్వేషించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను’ అని సీఈఓ ఉద్యోగులకు ఈ- మెయిల్ చేశారు. అలాగే మాంసం విక్రయాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని మూసివేస్తామని, అయితే ఇన్‌స్టామార్ట్‌ ద్వారా ఆ విక్రయాలు కొనసాగుతాయని తెలిపారు. కొత్త విభాగాల్లో తమ పెట్టుబడులు కొనసాగుతాయని చెప్పారు. సవాలుగా మారిన ఈ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో గత సంవత్సరకాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు వాటికి తగ్గట్లుగా చర్యలు తీసుకుంటున్నాయని  తెలిపారు. తమ సంస్థ అందుకు మినహాయింపు కాదన్నారు.

ప్రొడక్ట్‌, ఇంజినీరింగ్‌, ఆపరేషన్‌ డిపార్ట్‌మెంట్స్‌లో ఈ ఉద్యోగాల కోత ఉండే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపినట్లు ఓ వార్తా పత్రిక తన కథనంలో తెలిపింది. ఐపీఓకు ముందు కంపెనీని లాభాల్లోకి తీసుకురావడంలో భాగంగా కంపెనీ ఈ చర్యలు చేపట్టనుందని తెలిసింది. ప్రస్తుతం స్విగ్గీ నష్టాలు సైతం రోజురోజుకూ పెరుగుతున్నాయి. 2021లో రూ.1,617 కోట్లుగా ఉన్న నష్టాలు.. 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.3,628.90 కోట్లకు చేరాయి. అంటే దాదాపు రెట్టింపు అయ్యాయి. స్విగ్గీ తన మార్కెట్‌ వాటాను సైతం జొమాటోకు కోల్పోతోందని బ్రోకరేజీ సంస్థ జఫ్రీచ్ గతంలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని