Higher pension: అధిక పింఛనుకు అర్హులు ఎవరు?

సుప్రీంకోర్టు తీర్పు అమలులో భాగంగా ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చి.. అధికవేతనం పొందుతూ ఆ మేరకు ఈపీఎఫ్‌ చందాచెల్లిస్తున్న ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో అధిక పింఛను ప్రయోజనాలు కల్పించనుంది.

Updated : 23 Feb 2023 13:32 IST

ఈపీఎఫ్‌ పింఛనుదారులు, ఉద్యోగుల్లో ఎన్నో సందేహాలు
నివృత్తి చేసిన ఈపీఎస్‌-95 సేవాగ్రూపు
ఈనాడు - హైదరాబాద్‌

సుప్రీంకోర్టు తీర్పు అమలులో భాగంగా ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చి.. అధికవేతనం పొందుతూ ఆ మేరకు ఈపీఎఫ్‌ చందాచెల్లిస్తున్న ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో అధిక పింఛను ప్రయోజనాలు కల్పించనుంది. ఈ తీర్పు అమలు కోసం ఇప్పటికే మూడు సర్క్యులర్లను ఈపీఎఫ్‌వో జారీ చేసింది. తాజా నిబంధనల ప్రకారం ఎవరు అర్హులు? ఎవరికి అధిక పింఛను ప్రయోజనం వర్తిస్తుంది? తదితర సందేహాలు వస్తున్నాయి. ఈ మేరకు పింఛనుదారులు, ఉద్యోగులు, కార్మికులు ప్రాంతీయ కార్యాలయాలకు చేరుకుని వివరాలు అడుగుతున్నారు. ఉద్యోగుల పింఛను పథకం-95పై తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో నిబంధనలపై పింఛనుదారుల సమాఖ్య అడిగిన సందేహాలను ఈపీఎఫ్‌వో-కోచి ప్రాంతీయ కార్యాలయం నివృత్తి చేసింది. ఈ వివరాలను ఈపీఎస్‌-95 సేవా గ్రూపు క్రోడీకరించింది.

2014 సెప్టెంబరు 1వ తేదీకి ముందు పదవీవిరమణ చేసిన ఉద్యోగులు, కార్మికులు అధిక పింఛనుకోసం దరఖాస్తు చేయవచ్చా?

దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆయా ఉద్యోగులు తాము సర్వీసులో ఉన్నపుడు ఈపీఎస్‌ చట్టం 11(3) నిబంధన కింద అధిక పింఛను కోసం యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చి ఉండాలి. ఈ ఉమ్మడి ఆప్షన్‌ను ఈపీఎఫ్‌వో తిరస్కరించి ఉండాలి. ఈ అర్హత కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసేందుకు అర్హులు.

2014 సెప్టెంబరు 1న, ఆ తరువాత పదవీ విరమణ చేసిన వారు దరఖాస్తుకు అర్హులా?

అధిక పింఛను కోసం ఇప్పుడు ఆప్షన్‌ ఇవ్వవచ్చు. అయితే 2014 సెప్టెంబరు 1వ తేదీకి ముందు అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వకుండా, ఈపీఎఫ్‌ గరిష్ఠ వేతన పరిమితి (బేసిక్‌+డీఏ)కి మించి వేతనం పొందుతూ ఉండాలి. వాస్తవిక వేతనంపై ఈపీఎఫ్‌ చందా చెల్లిస్తూ ఉండాలి.

ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులు,  ఉద్యోగులు ఈ అవకాశం వినియోగించుకోవచ్చా?

2014 సెప్టెంబరు 1కి ముందు సభ్యులుగా చేరి, ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయితే అధికవేతనంపై ఈపీఎఫ్‌ చందా చెల్లించాలి. 2014 సెప్టెంబరు 1 తరువాత చేరిన వారు అధిక పింఛను సదుపాయం వినియోగించుకోలేరు.

అధిక పింఛనుకు ఆప్షన్‌ ఇచ్చినపుడు ఈపీఎఫ్‌ చట్టంలో పేరా 26(6) నిబంధన కింద ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వాలన్నారు. ఇది ఏమిటి?

చట్టంలోని పేరా 26(6) ప్రకారం గరిష్ఠ పరిమితికి మించి వేతనంపై ఈపీఎఫ్‌ చందా చెల్లించేందుకు ఈ నిబంధన వెసులుబాటు కల్పిస్తుంది. అధికవేతనంపై ఈపీఎఫ్‌ చందా చెల్లించేందుకు ముందుగా ఉద్యోగి, యజమాని కలిసి సంయుక్తంగా ఈపీఎఫ్‌వోకు దరఖాస్తు చేయాలి. ఈ దరఖాస్తును ఏపీఎఫ్‌సీ ర్యాంకు.. ఆపై అధికారి ఆమోదించాలి. తాజాగా అధిక పింఛను కోరుకున్న ఉద్యోగులు 26(6) కింద ఆప్షన్‌ కచ్చితంగా ఇచ్చి ఉండాలి.

ఈపీఎస్‌ చట్టం -95 పేరా నం.11(3) కింద ఇచ్చిన ఆప్షన్‌ను చట్టసవరణ అనంతరం పేరా నం.11(4) కింద ఏడాదిలోగా పునరుద్ధరించలేదు. వారికి ఇప్పుడు అవకాశం ఉంటుందా?

చట్టసవరణ తరువాత ఏడాదిలోగా 11(4) కింద ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వని ఉద్యోగులు ఆ అవకాశాన్ని సొంతంగా వదులుకున్నట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు అధిక పింఛనుకు ప్రస్తుతం ఉమ్మడి ఆప్షన్‌ అవకాశం లేదు.

ఉద్యోగుల పింఛనునిధి చట్టంలోని పేరా 11(3), 11(4) ఏం చెబుతోంది?

జవాబు: ఉద్యోగుల పింఛను నిధి (ఈపీఎస్‌) చట్టం - 1995ని 2014లో సవరించారు. ఈ చట్ట సవరణకు ముందు 11(3) నిబంధన ప్రకారం 1995 నవంబరు 16 నుంచి ఉద్యోగి పొందుతున్న వాస్తవిక వేతనం గరిష్ఠ వేతన పరిమితికి మించి ఉన్నప్పుడు మూలవేతనం, డీఏ మొత్తంలో 8.33 శాతాన్ని ఈపీఎస్‌కు చందా చెల్లించాలి. ఈ మేరకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వాలి. ఈ నిబంధనను 2014 సెప్టెంబరు 1 తరువాత ఈపీఎస్‌ చట్టసవరణ ద్వారా తొలగించింది. అయితే వాస్తవిక వేతనంపై గతంలో 8.33 శాతం చందా చెల్లిస్తున్న వారు ఆరు నెలల్లోగా మరోసారి ఆప్షన్‌ ఇవ్వాలని 11(4) కింద అవకాశం ఇచ్చింది. ఈ గడువును మరో ఆరు నెలల పాటు ఈపీఎఫ్‌వో అప్పట్లో పొడిగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని