తోటి అధికారిని కాల్చిచంపి.. ఆపై తానూ..   

దేశ రాజధాని నగరం దిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. ఓ సీఆర్పీఎఫ్‌ ఎస్సై తన పైఅధికారిని......

Published : 26 Jul 2020 02:59 IST

దిల్లీలో కాల్పుల కలకలం

దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. ఓ సీఆర్పీఎఫ్‌ ఎస్సై తన పైఅధికారిని సర్వీసు తుపాకీతో కాల్చి చంపి.. ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా సంచలనం రేపింది. శుక్రవారం రాత్రి 10.30గంటల సమయంలో దిల్లీలోని 61 లోధ్‌ ఎస్టేట్‌ ప్రాంతంలోని కేంద్ర హోంశాఖ భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఆర్‌పీఎఫ్‌లో  ఎస్సైగా పనిచేస్తున్న కర్నైల్‌ సింగ్‌,  పైఅధికారి, సహచరుడు దశరథ్‌ సింగ్‌ మధ్య వాగ్వాదం జరిగి అనంతరం కాల్పులకు దారితీసినట్టు భావిస్తున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. ఇద్దరి మృతదేహాలపైనా బుల్లెట్‌ గాయాలు ఉన్నట్టు గుర్తించారు. కాల్పులు జరిపిన కర్నైల్‌ సింగ్‌ కశ్మీర్‌లోని ఉదంపూర్‌కు చెందినవారు కాగా.. ఇన్‌స్పెక్టర్‌ దశరథ్‌ సింగ్‌ హరియాణాలోని రోహ్‌తక్‌కు చెందినవారిగా గుర్తించారు. ఇద్దరి మధ్య ఏ విషయంలో వాగ్వాదం జరిగిందో, అసలు వాస్తవాలను తెలుసుకొనేందుకు దర్యాప్తునకు ఆదేశించినట్టు సీఆర్‌పీఎఫ్‌ అధికార ప్రతినిధి, డీఐజీ ఎం.దినకరన్‌ తెలిపారు. నివేదిక వచ్చాకే అన్ని వివరాలూ చెప్పగలమన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని