మెట్రోలో సీటు కోసం వివాదం..తోటి ప్రయాణికురాలిపై పెప్పర్‌ స్ప్రే చల్లిన మహిళ

దిల్లీలోని ఓ మెట్రోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు సీటు కోసం గొడవ పడగా.. ఆగ్రహానికి గురైన ఓ మహిళ తోటి ప్రయాణికురాలిపై పెప్పర్‌ స్ప్రే చల్లింది. సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Updated : 05 Apr 2023 17:43 IST

దిల్లీ: మెట్రోరైల్లో సీటు కోసం తలెత్తిన వివాదంలో ఆగ్రహానికి గురైన ఓ యువతి తోటి ప్రయాణికురాలిపై పెప్పర్‌ స్ప్రే చల్లిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో విషయం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్లితే..

దిల్లీ(Delhi)లోని ఓ మెట్రోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు ఒకే వరుసలో కూర్చొని సీటు కోసం గొడవపడుతున్నట్లు వీడియోలో ఉంది. ఒక మహిళ తోటి ప్రయాణికురాలిపై కోపంగా అరుస్తూనే ఉంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన మహిళ బ్యాగులో నుంచి పెప్పర్‌ స్ప్రే తీసి ప్రయాణికురాలిని బెదిరింపులకు గురిచేసింది. ప్రయాణికురాలు ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా వినకుండా..బాటిల్‌ మూత తిప్పి స్ప్రే చల్లింది. తర్వాత అక్కడ నుంచి లేచి వెళ్లిపోయింది. కొన్ని క్షణాల్లోనే ఆ వాసన కంపార్ట్‌మెంట్‌ అంతా వ్యాపించడంతో ఆ ఘాటుకు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇదంతా వీడియో తీసిన ఓ వ్యక్తి ట్విటర్‌లో పోస్టు చేయడంతో దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ స్పందించింది. సంఘటన జరిగిన మెట్రో కోచ్‌ నంబర్‌ పంపమని ఆ వ్యక్తిని కోరింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రజా రవాణాలో ఇటువంటి గొడవలు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని