సంక్షిప్త వార్తలు (2)

మావోయిస్టులు పాతిపెట్టిన 51 ఐఈడీలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్న ఘటన ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్‌ జిల్లాలో జరిగింది.

Updated : 03 Feb 2023 06:31 IST

51 ఐఈడీలను స్వాధీనం చేసుకున్న భద్రతా సిబ్బంది
ముగ్గురికి గాయాలు, ఝార్ఖండ్‌లో ఘటన

చాయీబాసా: మావోయిస్టులు పాతిపెట్టిన 51 ఐఈడీలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్న ఘటన ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్‌ జిల్లాలో జరిగింది. ఇక్కడి మేరాల్గారా గ్రామ సమీపంలో ఉన్న అడవిలో మావోయిస్టు సభ్యులు సమావేశమయ్యారన్న సమాచారంతో సీఆర్పీఎఫ్‌ జవానులు గురువారం సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ క్రమంలో ఐఈడీ ఒకటి పేలడంతో ముగ్గురు జవానులు గాయాలపాలయ్యారు. దీంతో ఆ ప్రదేశంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన సిబ్బంది 51 ఐఈడీలను గుర్తించి అక్కడికక్కడే నిర్వీర్యం చేశారు. గాయపడిన వారిని ఎయిర్‌ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ తెలిపారు.


దిల్లీ జైళ్లలో 348 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం

దిల్లీ: దేశ రాజధానిలోని వివిధ జైళ్లలో గత రెండున్నర నెలల కాలంలో జరిపిన దాడుల ద్వారా 348 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకొన్నట్లు జైళ్లశాఖ డైరెక్టర్‌ జనరల్‌ సంజయ్‌ బనివాల్‌ గురువారం మీడియాకు వెల్లడించారు. బుధవారం ఒక్కరోజే జైల్‌ నంబర్‌-3లో నిర్వహించిన దాడుల్లో 18 ఫోన్లు, ఛార్జర్లు, నాలుగు చాకులు, రెండు ఐరన్‌రాడ్లు, ఓ సర్జికల్‌ బ్లేడు, చేతితో తయారుచేసిన హీటర్లు రెండు, విద్యుత్తు వైర్లు పట్టుబడ్డాయన్నారు. జైళ్లలో అంతర్గత నిఘా పెంచాక, సూపరింటెండెంట్లు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఖైదీలకు ఫోన్ల చేరవేతలో సిబ్బంది హస్తముంటే కఠినచర్యలు కొనసాగిస్తామని డీజీ చెప్పారు. దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన జాతీయ పట్టణ జీవనోపాధి కార్యక్రమం కింద 1,020 మంది ఖైదీలకు పర్యాటక, ఆతిథ్య రంగాల శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన కింద మరో వెయ్యి మందికి అత్యాధునిక దుస్తులు కుట్టడంలో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు డీజీ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని