తల్లిని కొట్టిందని.. నానమ్మను చంపిన మనవడు!

తరచూ తన తల్లితో నానమ్మ గొడవ పెట్టుకోవడం.. కళ్లెదుటే తల్లిని కొట్టడంతో భరించలేక ఓ బాలుడు (12) తన నానమ్మను హతమార్చిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.

Published : 15 Apr 2024 03:19 IST

జనగామ జిల్లాలో ఘటన

జఫర్‌గఢ్‌, న్యూస్‌టుడే: తరచూ తన తల్లితో నానమ్మ గొడవ పెట్టుకోవడం.. కళ్లెదుటే తల్లిని కొట్టడంతో భరించలేక ఓ బాలుడు (12) తన నానమ్మను హతమార్చిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జఫర్‌గఢ్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతుల ఒక్కగానొక్క కుమారుడు పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అనంతరం వారు కోడలితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. కొంతకాలంగా కుటుంబ సమస్యల కారణంగా ఆ అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్దమనుషులు వారికి సర్దిచెప్పారు. ఈ క్రమంలో శనివారం రాత్రి అత్త (65) తన కోడలితో మరోమారు గొడవ పడింది. దీంతో కోడలి చిన్న కుమారుడు ఆవేశంతో కత్తి తీసుకొని నానమ్మ ఛాతీలో బలంగా పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆమెను వరంగల్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా  మార్గం మధ్యలో చనిపోయింది. పోలీసులు ఆదివారం వివరాలు సేకరించారు. మైనర్‌ అయిన మనవడు, కోడలిపై మృతురాలి భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని