రూ.5 కోట్లకు గురి..రూ.25 లక్షలు హరీ!

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అంటూ ఆన్‌లైన్‌లో సాగే వ్యవహారాలన్నీ మోసాలని..వాటిలో పెట్టుబడులు పెట్టి డబ్బులు నష్టపోవద్దంటూ ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుకు పోలీసులు చేసిన హితబోధ బూడిదలో పోసిన పన్నీరైంది.

Published : 25 Aug 2021 05:04 IST

సైబర్‌ నేరగాళ్లకు చిక్కి భారీగా నష్టపోయిన మహిళ
రూ.10 లక్షలు పోగొట్టుకున్నప్పుడే కౌన్సెలింగ్‌ ఇచ్చిన పోలీసులు
అయినా మరో రూ.15.50 లక్షలు సమర్పణ

ఈనాడు, హైదరాబాద్‌: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అంటూ ఆన్‌లైన్‌లో సాగే వ్యవహారాలన్నీ మోసాలని..వాటిలో పెట్టుబడులు పెట్టి డబ్బులు నష్టపోవద్దంటూ ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుకు పోలీసులు చేసిన హితబోధ బూడిదలో పోసిన పన్నీరైంది. అత్యాశకు పోయిన ఆ మహిళ ఇంటికి వెళ్లి సైబర్‌ నేరగాళ్ల మాయమాటలు నమ్మి రూ.25.50 లక్షలు పోగొట్టుకున్నారు. ఈ సంఘటన సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో వెలుగు చూసింది.  మణికొండలో నివసించే బాధితురాలు(36) ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. కొంత కాలం కిందట బిట్‌కాయిన్‌లో తక్కువ పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలు సంపాదించొచ్చంటూ ఇన్‌స్టాగ్రాంలో ప్రకటన చూశారు. ఆపై ఓ యాప్‌లో రిజిస్టర్‌ అయ్యి తొలుత రూ.5వేలకు రూ.2,500 లాభం పొందారు. ఆ తర్వాత మరో రూ.5వేలకు రూ.2,500.. మళ్లీ రూ.50వేలకు రూ.25వేలు లాభం గడించారు. ఈ లాభాలను ఆమె విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో ఆమెకు నమ్మకం పెరిగి ఓ రోజు రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టారు. రూ.2.5 కోట్లు లాభం వచ్చినట్లుగా యాప్‌లో కనిపించింది. ఆ డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు యత్నించగా సాధ్యపడలేదు. ఎందుకిలా జరుగుతోందంటూ యాప్‌ కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేశారు. మరో రూ.10 లక్షలు రీఛార్జ్‌ చేస్తే.. మొత్తం లాభం రూ.5 కోట్లు అవుతుందని వారు వివరించారు. ఆమెకు అనుమానమొచ్చి సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఆరా కోసం వచ్చారు. అక్కడ ఆమెకు ఇలాంటివి నమ్మొద్దంటూ ఆర్థిక నేరాల విభాగానికి చెందిన ఓ ఇన్‌స్పెక్టర్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.  ఇంటికెళ్లిన ఆమెకు రెండు, మూడుసార్లు సదరు కంపెనీ ప్రతినిధులు ఫోన్‌ చేశారు. ఇంకో రూ.10 లక్షలు కడితే.. రూ.5 కోట్లు మీవేనంటూ నమ్మకం కలిగించారు. దీంతో ఆమె మరో రూ.10 లక్షలు రీఛార్జ్‌ చేశారు. ఆ తరువాత వివిధ రకాల ఛార్జీల పేరిట మరో రూ.5.50 లక్షలు వసూలు చేశారు. చివరకు 15 శాతం పన్ను కడితేనే విత్‌డ్రా చేసుకోవచ్చంటూ తేల్చి చెప్పారు. ఆమెకు అనుమానమొచ్చి మళ్లీ సైబరాబాద్‌ కమిషనరేట్‌కు రావడంతో సైబర్‌క్రైం పోలీసులు కంగుతిన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని