NOTA: ‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు

ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్‌ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Published : 26 Apr 2024 14:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్‌ నిర్వహించాలని కోరుతూ సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్‌ దాఖలయ్యింది. దీనిని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. ఈ అంశంపై భారత ఎన్నికల సంఘానికి (Election Commission) నోటీసులు జారీ చేసింది. శివ్‌ ఖేరా అనే రచయిత పిల్‌ (PIL) ద్వారా లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల ధర్మాసనం అంగీకరించింది.

నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులను తదుపరి ఎన్నికల్లో (ఐదేళ్ల పాటు అన్ని ఎన్నికల్లో) పోటీ చేయకుండా చూసేలా నిబంధనలు రూపొందించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా నోటాను ‘కల్పిత అభ్యర్థి’గా తెలియజేస్తూ విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ అంశాలకు సంబంధించి తగిన నిబంధనలను రూపొందించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇటీవల సూరత్‌లో పోలింగ్‌ జరగకుండానే ఓ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన తీరును ప్రస్తావించారు. పిటిషనర్‌ చేసిన ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం.. ఈసీకి నోటీసులు పంపించింది. ఇది కూడా ఎన్నికల ప్రక్రియలో భాగమేనని, దీనిపై ఎన్నికల సంఘం ఏం చెబుతుందో చూద్దామని పేర్కొంది.

100% వీవీప్యాట్‌ స్లిప్‌ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం

పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (PUCL) వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంతో 2013లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈవీఎంలలో నోటా (Non Of The Above) ఆప్షన్‌ కల్పించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవ్వరూ నచ్చకపోతే.. ఈ ‘నోటా’ మీట నొక్కే సదుపాయం ఉంది. అయితే, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే చట్టపరంగా ఎలాంటి పరిణామాలు ఉండవు. ఇటువంటి సందర్భంలో ఎవరికి ఎక్కువగా ఓట్లు వస్తే ఆ అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని