కామారెడ్డిలో తల్లీ కుమారుడి ఆత్మహత్య ఘటన.. మున్సిపల్‌ ఛైర్మన్‌ సహా ఏడుగురిపై కేసు

కామారెడ్డిలో తల్లీ కుమారుడి ఆత్మహత్య ఘటనపై అక్కడి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Updated : 17 Apr 2022 15:23 IST

కామారెడ్డి: కామారెడ్డిలో తల్లి గంగం పద్మ, కుమారుడు గంగం సంతోష్‌ ఆత్మాహుతి ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు విచారణకు ప్రత్యేక విచారణాధికారిగా బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. మృతుల సూసైడ్‌ నోట్‌, సెల్ఫీ వీడియో, ఆడియో ఆధారంగా ఏడుగురిపై సెక్షన్‌ 306 కింద కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాలపై ఏ1గా పల్లె జితేందర్‌గౌడ్‌, ఏ2 సరాబ్‌ యాదగిరి, ఏ3 పృథ్వీగౌడ్‌ ఐరేని, ఏ4 తోట కిరణ్‌, ఏ5 కన్నాపురం కృష్ణా గౌడ్‌, ఏ6 సరాబ్‌ స్వరాజ్‌, ఏ7 సీఐ నాగార్జున గౌడ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. మెదక్‌ జిల్లా పోలీసుల సమన్వయంతో కామారెడ్డి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రధానంగా రామాయంపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ జితేందర్‌గౌడ్‌, మార్కెట్‌ ఛైర్మన్‌ యాదగిరి, సీఐ నాగార్జున గౌడ్‌ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

ఏం జరిగిందంటే..

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో శనివారం తెల్లవారుజామున మెదక్‌ జిల్లా రామాయంపేటకు చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి గంగం సంతోష్‌(41), ఆయన తల్లి పద్మ(68) ఆత్మాహుతి చేసుకున్నారు. తమ చావుకు రామాయంపేట పట్టణానికి చెందిన  పల్లె జితేందర్‌గౌడ్‌ (పురపాలక సంఘం అధ్యక్షుడు), ఐరేని పృథ్వీరాజ్‌ అలియాస్‌ బాలు, సరాబ్‌ యాదగిరి (మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌), తోట కిరణ్‌, కన్నాపురం కృష్ణాగౌడ్‌, సరాబ్‌ స్వరాజ్‌ (యాదగిరి కుమారుడు), తాండూరి నాగార్జునగౌడ్‌ (ప్రస్తుతం తుంగతుర్తి సీఐ) కారణమంటూ ఫేస్‌బుక్‌లో వేర్వేరుగా సందేశాలు పెట్టి ప్రాణాలొదిలారు. ‘మా చావుకు కారణమైన వారిని అందరూ చూస్తుండగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి శిక్షించాలి’ అని వేడుకున్నారు.

బాధిత కుటుంబానికి రేవంత్‌ పరామర్శ

తల్లీకుమారుడు గంధం పద్మ, సంతోష్‌ ఆత్మాహుతిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులను ఫోన్‌లో ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. మెదక్‌ డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి రామాయంపేటలోని సంతోష్‌ కుటుంబసభ్యులతో మాట్లాడించారు. సంతోష్‌ తండ్రి అంజయ్, సోదరుడు శ్రీధర్‌తో రేవంత్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని.. ధైర్యంగా ఉండాలని చెప్పారు. దోషులకు కఠిన శిక్ష పడేలా పోరాడతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని