logo

విడత విడతకూ కోత.. పింఛనుదారులకు వ్యధ

పింఛన్లు ఇస్తున్నామని చెబుతూనే ప్రభుత్వం వివిధ రకాల వడపోతలతో విడత విడతకు కోత పెడుతుందంటూ పింఛనుదారులు వాపోతున్నారు.

Updated : 31 Jan 2023 04:55 IST

729 మంది అనర్హులుగా గుర్తింపు
మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

పింఛన్లు ఇస్తున్నామని చెబుతూనే ప్రభుత్వం వివిధ రకాల వడపోతలతో విడత విడతకు కోత పెడుతుందంటూ పింఛనుదారులు వాపోతున్నారు. కేవలం విచారణ నిమిత్తమేనని, అందరికీ పింఛన్లు అందజేస్తామని పాలకులు చెబుతున్నా జిల్లావ్యాప్తంగా విచారణచేసి వందలాదిమందిని అనర్హులుగా ప్రకటించడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా పింఛను పొందుతున్న వారిలో ఎవరైనా అనర్హులు ఉన్నారా లేదా అన్న దానిపై ప్రభుత్వం ఆరు అంచెల విధానాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగానే అన్ని మండలాల్లో పింఛను పంపిణీకి నిర్దేశించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నవారి జాబితా తయారు చేసి గత డిసెంబరు నెలలో నోటీసులు జారీ చేశారు. అలా మొత్తం జిల్లాలో 6,667మందికి నోటీసులు ఇవ్వగా ఇందులో ఎక్కువశాతం బందరు నగరంలోనే 1203 ఉన్నారు. పెనమలూరులో 1192, గుడివాడ పట్టణంలో 800 చొప్పున, మిగిలిన మండలాల్లో 50 నుంచి 200 వందలమందికిపైగా నోటీసులు ఇచ్చారు. వీరందరికీ తగిన ఆధారాలను సచివాలయంలో సమర్పించేందుకు 15 రోజుల గడువు విధించారు. ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేలా రెవెన్యూ, విద్యుత్తు, రవాణా తదితర శాఖల అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలా పూర్తిస్థాయిలో విచారణ చేసిన అనంతరం ప్రస్తుతానికి 729మంది అనర్హులుగా గుర్తించారు. వీరందరికీ పింఛన్లు ఆగిపోవడంతో ఆందోళన చెందుతూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

పింఛను వస్తుందో రాదో..

పింఛను ఆగిపోయిన వారిలో చాలామందికి అర్హత ఉన్నా తొలగించారని బాధితులు వాపోతున్నారు.  పదెకరాల పొలం లేకున్నా, సరాసరిన 300 యూనిట్ల విద్యుత్తు వినియోగం జరగకపోయినా సాంకేతికంగా దొర్లిన తప్పుల వల్ల పింఛన్‌ ఆపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనర్హులుగా గుర్తించిన వారికి జనవరి నెల పింఛను ఆపేశారు.అనర్హులుగా గుర్తించిన వారిలో ఎక్కువశాతం మంది 300 యూనిట్లపైగా విద్యుత్తు వినియోగిస్తున్నవారు ఉన్నట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడిగా వస్తున్న పింఛను నిలిపివేయడంతో కేవలం దానిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వృద్ధులు, ఒంటరి మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరునెలలకోసారి కొత్త పింఛన్లు ఇవ్వడంతో అప్పటివరకు పింఛన్లు రావేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక సాకుతో పింఛన్లకు కోత పెట్టడం పట్ల  తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి, తగున్యాయం చేసి త్వరితగతిన పింఛన్లను పునరుద్ధరించాలని కోరుతున్నారు.


స్పందనలో అర్జీ ఇచ్చినా..

మాతమ్మ, పోతేపల్లి, బందరు మండలం

నా బియ్యం కార్డులో మా ఆయన పేరుందని చెప్పి పింఛను తొలగించారు. ఆయన చనిపోయి ఏళ్లు గడిచిపోతుంది. ఎప్పటినుంచో వస్తున్న పింఛను ఆపేయడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మా గ్రామంలో ఉన్న సచివాలయ ఉద్యోగులతోపాటు కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందనలోనూ అర్జీ ఇచ్చాను. ఉన్నతాధికారులు స్పందించి త్వరితగతిన పింఛను ఇచ్చేలా చొరవ తీసుకుని ఆదుకోవాలని కోరుతున్నా.


అర్హులందరికీ ఇస్తున్నాం..

వరప్రసాద్‌, డీఆర్‌డీఏ, పీడీ

జిల్లాలో అర్హులందరికీ పింఛన్లు ఇస్తున్నాం. క్షేత్రస్థాయిలో అన్నివిధాలుగా విచారణ చేసి  తక్కువమందిని మాత్రమే అనర్హులుగా గుర్తించాం. వీరికి కూడా ఏ కారణంతో ఆపినట్లు చెప్పామో దానికి సంబంధించిన పత్రాలు అందజేస్తే తిరిగి పింఛను అందుతుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాంకేతిక సమస్యలు ఉంటే సంబంధిత విభాగ అధికారుల వద్దకు వెళ్తే వెంటనే పరిష్కరిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని